వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (డబ్ల్యూహెచ్ఓ) కరోనాను మహమ్మారిగా ప్రకటించడంతో దేశంలో మార్చి 22న ఒక్క రోజు ‘జనతా కర్ఫ్యూ’ విధించారు. ఆ సాయంత్రం నుంచి చాలా రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ ను విధించాయి. మార్చి 24న ప్రధాని మరోమారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడి నుంచి మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ వచ్చారు. అన్నీ రంగాలు స్థంబించిపోవడంతో దేశంలో ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ఆర్థిక వేత్తలు, మేధావులు ఇచ్చిన సలహామేరకు ప్రధాని అన్ లాక్ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకటి..రెండు మినహాయించి అన్నింటికి అనుమతి ఇచ్చేశారు.
అన్ లాక్ లో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు దాదాపు 90 వేలకు పైగా కేసులు నమోదవతున్నాయి. 57 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు 91 వేల మంది మరణించారు. చాలా రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య తక్కువ అవుతున్నా ఇంకా 7 రాష్ట్రాల్లో పరిస్థితి కలకలం రేపుతోంది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో మాత్రం రోజుకు 5 వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 63 శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 77 శాతం మరణాలు కూడా ఈ రాష్ట్రాల్లోనే సంభవించాయి.
ప్రధాని సూచన
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. స్వల్ప కాలవ్యవధులలో మరోమారు లాక్ డౌన్ ను విధించే అంశాన్ని పరిశీలించాలని మోడీ ఓ సూచన చేశారు. ఇదే సమయంలో తరచుగా 1 నుంచి 2 రోజుల లాక్ డౌన్ ను రాష్ట్రాల్లో కఠినంగా అమలు చేస్తే, వైరస్ ఎవరిలో ఉందన్న విషయం బయటకు వచ్చేస్తుందని, దాని ద్వారా వైరస్ ను అడ్డుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని సూచించారు. తాను చెప్పిన అంశాన్ని సీరియస్ గా ఆలోచించాలని రాష్ట్రాలను కోరారు. రాష్ట్రాలు తమ ప్రజల కోసం ఆక్సిజన్ నిల్వలను పెంచుకోవాలని పేర్కొన్నారు.
ప్రధాని నోట మరోమారు లాక్ డౌన్ మాట వినబడటంతో ఆయా రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కానీ ప్రధాని సూచనల అమలుపై సందేహం నెలకొంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థికరంగం మరోమారు లాక్ డౌన్ విధిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వ రంగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల ఆఖరుకు దీనిపై ఓ క్లారిటీ రానుంది.