మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఎట్టకేలకు నటుడు మురళీమోహన్ స్పందించారు. ఈరోజు ఉదయం ఫిలిం ఛాంబర్ లో జరిగిన ప్రేమలో పాపలు బాబులు సినిమా పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మీద బురద జల్లాలని ప్రయత్నిస్తే అది జల్లేవారి మీదే పడుతుందన్నారు. ‘నేను అమెరికా దాటి ఎక్కడా ఆఫీసు పెట్టలేదు, ఒకవేళ ఇండియాకి వస్తే మొదటిసారి మీ దగ్గరికి వచ్చి ఆఫీసు పెడతాను అని ఆనాడు బిల్ గేట్స్ అన్నాడు చంద్రబాబుతో.
హైదరాబాద్ కి ఐటి రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు దే. మైక్రోసాఫ్ట్ రాగానే ఒకరితో ఒకరు అందరూ లైన్ కట్టి హైదరాబాద్ వచ్చారు. బిల్ గేట్స్ ని హైదరాబాద్ హైటెక్ సిటీ ఓపెనింగ్ కి పిలిచింది చంద్రబాబు’ అని వివరించారు. 2000 సంవత్సరంలోనే విజన్ 20-20 అని ప్రారంభించిన మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అనీ, హైటెక్ సిటీ పెరుగుతుంటే దానికి కావాల్సిన వసతులన్నీ ముందుగానే ఊహించి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసిన వ్యక్తి అనీ చెప్పారు.
2020 లో ఎలాగో చేయలేకపోయారు దురదృష్టవశాత్తు కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉన్నా 2040 వరకు తప్పకుండా చేస్తారు అని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ‘చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మొన్న ఢిల్లీ పార్లమెంట్ సమావేశంలో దీని గురించి చర్చించాము, ఆయన తొందరగా బయటికి రావాలి అని, దాంతోపాటు రాజ్ ఘాట్ కి వెళ్లి అక్కడ ఒక అరగంట వేడుకున్నాం. ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ లో ఇప్పుడు సుహాసిని గారు నిరాహార దీక్ష చేస్తున్నారు ఇప్పుడు నేను అక్కడికే వెళుతున్నాను.
74 సంవత్సరాలు ఉన్న ఒక మంచి ముఖ్య మంత్రిని ఈరోజు జైల్లో పెట్టడం అనేది అన్యాయం. వెంటనే ఆయన విడుదల కావాలి. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఇంకా మంచి పనులు చేయాలి. అరచేయితో సూర్యుని ఆపలేం. గ్రహణం విడిచిన వెంటనే వచ్చే కాంతి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు చంద్రబాబు కూడా గ్రహణం విడిచి అలా బయటికి వచ్చి అద్భుతంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నగరం ఇవన్నీ కూడా అద్భుతంగా ఆయన గ్రహణం విడిచి బయటికి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తారని నేను నమ్ముతున్నాను’ అని వివరించారు.