పల్లా శ్రీనివాసరావుకు సంఘీభావం తెలపడానికి వచ్చిన నారా లోకేష్కు అరచేతిలో కర్పూరం వెలిగించి ఓ అభిమాని హారతి ఇవ్వడం చూసి.. అతని అభిమానానికి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. పల్లా శ్రీనివాసరావును పరామర్శించిన తర్వాత ప్రసంగించిన లోకేష్.. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదాన్ని గుర్తు చేస్తూ.. ‘అమ్మడానికి వాళ్లేవరు.. కొనడానికి వీళ్లేవరు.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజొస్తుంది. గతంలో 32 మంది రైతులు ఈ ఉక్కు ఫ్యాక్టరీ కోసం అమరులయ్యారు. అమృతరావు గారు ఇక్కడ దీక్షకు కూర్చున్నారు. నేను పుట్టినప్పటి నుంచి వింటున్నా.. విశాఖపట్నం అంటే ఉక్కు కర్మాగారం.. ఉక్కు ఫ్యాక్టరీ అంటే విశాఖపట్నం. ఇల్లు కట్టాలంటే విశాఖ ఉక్కు తీసుకురమ్మనే వాళ్లు. వాళ్లేమో లాభాలు చూస్తారు.. మరి 5 కోట్ల ఆంధ్రులకేమో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాణం.’
‘నష్టాల్లో ఉన్న మాట వాస్తవమే.. కానీ ఎందుకుంది? విశాఖ ఉక్కును మోడ్రనైస్ చేశారు.. కొత్తగా జరిగిన పరిణామాల వల్ల విశాఖ ఉక్కు నష్టాలు చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కాదు.. 1998 లోనే ప్రైవేటీకరణ చేయాలని చూశారు. ఆనాటి ఎంపి ఎర్రంనాయుడుగారు.. అప్పటి ప్రధాని వాజ్ పేయి గారితో మాట్లాడి.. విశాఖ ఉక్కును లాభాల బాట పట్టించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆపైన 2000లో విశాఖకు సొంత గనులు కేటాయించాలని ఆనాడే కేంద్రాన్ని కోరారు.
విశాఖ గురించి ఇంత చర్చ జరుగుతుంటే.. ప్రజలకు అండగా ఉంటాననే ధైర్యం జగన్కు లేదు. ప్రజలు ఇంత మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించి ఇస్తే.. వాళ్లంతా ఏం చేస్తున్నారు. గాడిదలు కాస్తున్నారా? గన్ లాంటి జగన్ అన్నారు.. కానీ ఇది బులెట్లు లేని గన్. నొక్కితే నీరొస్తుంది.. అక్కడ మోడీ గారు కేసులు తీస్తే.. జైలు కెళ్లాలేమో అని వీళ్లకు వణుకొస్తుంది. జగన్ నేమో లెటర్ రాశా అంటున్నారు.. కానీ ప్రధానమంత్రికి అటువంటి లెటర్లు చేరిన దాఖలాలు లేవు. కనీసం ప్రధానమంత్రికి లెటర్ రాసే పరిస్థితిలో కూడా ఒక రాష్ట్ర సీఎం ఉండడం సిగ్గుచేటు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణనే అడ్డుకోలేని వ్యక్తి.. ప్రత్యేక హోదా సాధిస్తారా? పల్లా శ్రీనివాసరావు గారికి ఫ్యాక్టరీ ముందే దీక్ష చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. అసలు ముఖ్యమంత్రి విశాఖలోకి ఎందుకు అడుగుపెట్టడం లేదని ప్రశ్నించారు?











