పదేళ్ల క్రితం, పదిహేనేళ్ల క్రితం మంజూరైన ప్రాజెక్టుల్లో లోపాలను ఎత్తిచూపి అందులో అధిక శాతం వాటాలను నేతలు తమ వశం చేసుకుంటున్నారు. నేడు … రేపు ప్రారంభానికి సిద్ధంగా ఉండే ప్రాజెక్టులు వివరాలు అన్ని బయటకు తీసి హస్తగతం చేసుకుంటున్నారు.. ప్రారంభానికి సిద్ధం కాబోతున్న కార్తీకవనం ప్రాజెక్ట్ తాజాగా అదే జాబితాలో చేరి పోతున్నది.
కార్తీక వనం ప్రాజెక్టు కోసం ప్రైవేటు సంస్థకు విశాఖ భీమిలి బీచ్ రోడ్ సాగర్ నగర్ సమీపంలో పది ఎకరాల స్థలాన్ని 33 ఏళ్ల లీజుకు దశాబ్దంన్నర క్రితం ఇచ్చారు. అందులో బీచ్ రిసార్ట్ నిర్మించేందుకు ప్రైవేట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. స్థలంలో కొంత భాగం అటవీశాఖకు చెందిన భూములు కూడా ఉన్నాయి. అందులో నిర్మాణాల కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తెచ్చుకోవడానికి దశాబ్దకాలం పట్టింది. ఇంతలో ఆ ప్రైవేటు సంస్థ తన వ్యాపారంలో మరో భాగస్వామిని చేర్చుకుంది.
మొత్తానికి ప్రాజెక్టు పూర్తయింది అనుకునే సమయానికి కరోనా వైరస్ వారి పాలిట శాపంగా మారింది. రిసార్ట్ ప్రారంభానికి నోచుకోలేదు. ఇంతలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం అనంతరం ఇక్కడి భూములకు, ప్రాజెక్టులకు భారీగా డిమాండ్ పెరగడం తో అందరి కన్ను సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులపై పడింది.
అధికార పార్టీ నేతలు తలచుకుంటే నందిని పందిని చేయగల సమర్థులు. అందుకే పెట్టుకోవాలంటే ఎంతటి వ్యాపారవేత్త అయిన భయపడాల్సి వస్తోంది.
ప్రాజెక్టు కోసం స్థలం కేటాయించి దశాబ్దకాలం దాటిపోవడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని… వెంటనే అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు జరపాలని… వారిని వాటాదార్లుగా చేర్చుకుంటే ఎటువంటి సమస్యలు రావని ఉచిత సలహా పథకం ప్రకారం ఇచ్చి పడేశారు.
కోట్లు విలువ చేసే ప్రాజెక్టును, అంతా సిద్ధం చేసుకున్నాక చేజార్చుకోవడం ఇష్టంలేక సదరు సంస్థ నిర్వాహకులు వేరొకరితో అయిష్టంగా చేతులు కలపాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ హోటల్ రంగంలో పేరొందిన రాడిసన్ సంస్థ రంగంలోకి దిగింది. ఇంకేముంది సీన్ కట్ చేస్తే కార్తీక వనం కాస్త రాడిసన్ బ్లూ రిసార్ట్ గా మారిపోయింది. ఇందులో అధికార పార్టీకి చెందిన నేతలు వాటాలు ఎంత అన్న దానిపై త్వరలోనే వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 2013లో కాగ్ ఇచ్చిన నివేదికలోనే ఈ ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయని స్పష్టం చేసింది. అటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు చేతులు మారడంతో సక్రమంగా మారిపోయింది.
బే పార్క్ పార్క్ ది అదే పరిస్థితి..
ప్రభుత్వం, పబ్లిక్, ప్రైవేట్ (PPP) భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా అధికారపార్టీ నేతలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఎకో టూరిజం బే పార్కు కూడా కార్తీక వనం తరహాలోనే చేతులు మారుతోంది. ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన రెవెన్యూ స్థలం ఒక పర్యాటక శాఖకు అప్పగించారు. టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా ఎండాడ సమీపంలోని 25 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కి ఇస్తామని, సంస్థకు అండగా ఉంటామని చెప్పి అధిక వాటాలు దక్కించుకున్నారు. ఈ ప్రాజెక్టు సుమారు 15 ఏళ్ల క్రితం మంజూరైంది.