ఏపీలో కొత్తగా 12 జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే ఉన్న 13 జిల్లాలతో పాటు మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో లోక్సభ స్థానాన్ని ఒక్కో జిల్లాగా మార్చాలని తీసుకున్న నిర్ణయం జిల్లాల్లో చిచ్చు రేపుతోంది. గుంటూరు లాంటి జిల్లాలు మూడు ముక్కలు కానుండగా, ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఏర్పాటు కానుంది. అయితే లోక్సభ స్థానాల ప్రాతిపదికగా జిల్లాల ఏర్పాటు అసంబద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2026లో లోక్సభ స్థానాల పునర్విభజన జరగనుంది. అప్పుడు ఏపీలో కొత్తగా మరో ఐదు లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా కొన్ని లోక్సభ స్థానాలు ఎక్కడో విసిరేనట్టుగా జిల్లాల్లో మూలకు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం పరంగా చూసుకున్నా అలాంటి చోట్ల జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంత మాత్రం ప్రజలకు సౌకర్యంగా ఉండదని అధికారపక్షంలోనే గొందరు గళం విప్పుతున్నారు.
లోక్సభ స్థానాల పునర్విభజన జరిగితే పరిస్థితి ఏమిటి?
2026లో లోక్సభ స్థానాల పునర్విభజన తథ్యం. ఇప్పటికే కొన్ని స్థానాల్లో 20 లక్షల ఓటర్లు, మరి కొన్నింటిలో 11 లక్షలు మాత్రమే ఉన్నారు. ప్రతి పది లక్షల ఓటర్లకు ఒక లోక్సభ స్థానం ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇలాంటి సమయంలో ఏపీలోనూ ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు పునర్విభజన జరిగితే 31కు చేరే అవకావం ఉంది. అంటే ప్రస్తుతం వాటి ఆధారంగా జిల్లాలు, సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటే, పునర్విభజన తరవాత ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఏ లోక్సభ స్థానంలోకి మారుతుందో చెప్పలేం. అందుకే లోక్సభ స్థానాల ఆధారంగా కాకుండా భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
తెలంగాణలో ఎలా చేశారు
తెలంగాణలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సాఫీగా సాగిపోయింది. ఒకటి రెండు జిల్లాల విషయంలో మినహా మిగతా వ్యవహారమంతా సవ్యంగానే జరిగిందన్న అభిప్రాయాలున్నాయి. తెలంగాణలో ప్రతి జిల్లా కేంద్రం అన్ని మండలాలకు సమాన దూరంలో ఉండేలా సీఎం కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తరవాత కూడా కొందరికి జిల్లా కేంద్రం దగ్గరగా మరికొందరికి మరీ దూరంగా ఉంటే అనేక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే తెలంగాణలో జిల్లాల ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్ ఎక్కడా రాజీపడలేదు. కొత్త జిల్లా కేంద్రాలు ఆ జిల్లా మధ్యలో ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు.
లోక్సభ స్థానం ప్రామాణికం అసంబద్ధం
జిల్లాల ఏర్పాటుకు లోక్సభ స్థానాలను ప్రామాణికంగా తీసుకోవడం అసంబద్ధమని ప్రతిపక్షనేతలే కాదు, అధికారపార్టీ నేతలు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో ఒంగోలు లోక్సభ స్థానం ఒక్కటే ఉంది. మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్లలో ఉన్నాయి. ఇక్కడ లోక్సభ స్థానం ఆధారంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఒంగోలు జిల్లా అవుతుంది. కానీ అదే జిల్లాలోని మార్కాపురం, త్రిపురాంతకం ప్రజలు ఒంగోలు జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి 80 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక గుంటూరు జిల్లా మూడు కానుంది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ స్థానాలను జిల్లాలుగా చేస్తే పల్నాడు ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. నరసరావుపేటను జిల్లాగా చేస్తే మాచర్ల నియోజకవర్గంలోని మారుమూల ప్రజలు జిల్లా కేంద్రానికి రావాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇక గుంటూరు, నరసరావుపేట జిల్లా మధ్య దూరం 30 కిలోమీటర్లే. అదే పల్నాడు కేంద్రంగా గురజాలలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే పల్నాడు ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే బాధ తప్పుతుంది. శ్రీకాకుళంలోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైతే శ్రీకాకుళం జిల్లా ముక్కలు కానుంది. అందుకే శ్రీకాకుళం జిల్లాను విడగొట్టడం ఆ జిల్లాలోని అధికార పక్షనేతలకు కూడా ఇష్టం లేదు.
అందరికీ సమాన దూరంలో ఉంటే మేలు
జిల్లా కేంద్రాలు ఆయా జిల్లా ప్రజలకు సమాన దూరంలో ఉండేలా ఏర్పాటు చేసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది. జిల్లా కేంద్రాలు కొందరికి చాలా దూరంగా ఉండటం వల్ల వారికి సకాలంలో ప్రభుత్వ సేవలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆయా జిల్లాల ప్రజలు అధికారులను కలవాలన్నా దూరం భారంగాఉంటుంది. అంతేగాక లోక్సభ స్థానాలు శాశ్వతం కాదు. అవి మారుతూ ఉంటాయి. అందువల్ల భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. తెలంగాణలో విజయవంతంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలే దీనికి నిదర్శనం.











