వివిధ రంగాల్లోని ప్రముఖ వ్యక్తులందరూ కొంతకాలంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలునాటడం.. ఆ ఛాలెంజ్ ను వేరొక్కరికి ఫార్వార్డ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సినీ నటుడు రాజారవీంద్ర.. ఆ ఛాలెంజ్ ను హీరో సునీల్ కు విసిరారు. దాన్ని స్వీకరించిన సునీల్ నేడు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. మొక్కలు నాటడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని, ఈ కార్యక్రమం చాలా తీవ్రంగా ముందుకు పోతోందని, మనం జీవించడానికి కావాల్సిన ఆక్సిజన్ కోసం మనం మొక్కలు నాటాలని, వృక్షోరక్షతి రక్షితః అని మన పెద్దలు చెప్పారు కాబట్టి, తన వంతు బాధ్యతగా ఈ రోజు మూడు మొక్కలు నాటానని , అందరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవల్సింది గా కోరారు.
అలాగే.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దేశాన్ని పచ్చని వనంగా తీర్చిదిద్దుతున్న సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టిస్ట్ సురేఖావాణి, కలర్ ఫోటో చిత్ర బృందం అయిన డైరెక్టర్ సందీప్ రాజ్, హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు కాలభైరవ, కమెడియన్ వైవా హర్షాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.