ఏపీలో అన్ని జిల్లాల్లో లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిపోయింది.గడచిన 15 రోజలుగా పెట్రోల్ ధరలు పెరగడంతో ఏపీలో అన్ని జిల్లాల్లో సెంచరీ కొట్టింది. తాజాగా ఇవాళ లీటరుకు 28 పైసలు పెరగడంతో ఏపీలో అన్ని జిల్లాల్లో లీటరు పెట్రోలు వంద దాటింది.వారం కిందటే లీటరు పెట్రోలు చిత్తూరు జిల్లాల్లో మొదటి సారిగా సెంచరీ కొట్టింది. తాజాగా విజయవాడలో రూ.100.05పైసలు,తిరుపతిలో రూ.101.23పైసలు,విశాఖలో రూ.100.54పైసలకు చేరింది. ఇక డీజిల్ ధర కూడా జీవిత కాల గరిష్ఠాలను తాకింది.ఏపీలో లీటరు డీజిల్ 94 రూపాయలకు చేరింది.గత ఏడాది ఇదే సమయంలో లీటరు పెట్రోలు 79 రూపాయలుండగా నేడు వంద దాటింది.అంటే ఏడాది కాలంలోనే లీటరు పెట్రోలు రూ.21 పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
ఎందుకు పెరుగుతోంది
ప్రతి రోజూ పెట్రోలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడమే కారణంగా చెబుతున్నారు.2017లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చిన డైనమిక్ ప్రైసింగ్ వల్లే ప్రతి రోజూ ఇంధన ధరలు పెరుగుతున్నాయి.గత ఏడాది మార్చి నుంచి మే వరకు మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గాయి.ఆ సమయంలో మన దేశంలోనూ డీజిల్, పెట్రోల్ ధరలు కనిష్ఠ స్థాయికి చేరాయి.అప్పట్లో కరోనా లాక్ డౌన్తో వినియోగం కూడా గణనీయంగా పడిపోయింది.తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ప్రతి రోజూ పెరగడం వల్ల, దేశీయ మార్కెట్లోనూ ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి.ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 69 డాలర్లకు ఎగబాకింది.దీంతో ఆయిల్ కంపెనీలు ప్రతి రోజూ ధరలు పెంచుకుంటూ పోతున్నాయి.గడచిన ఏడాది కాలంలో 53 సార్లు ఇంధన ధరలు తగ్గితే,312 సార్లు పెరిగాయి.దీంతో లీటరు పెట్రోలు రూ.79 నుంచి 100 దాటిపోయింది.
ధరలు ఎప్పుడు తగ్గుతాయి..?
ఇంధన ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.ఏడాది కాలంగా ఇంధన వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.దీనికితోడు చాలా దేశాల్లో లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఇంధన వినియోగం గరిష్ఠానికి చేరింది.దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.దీని ప్రభావం దేశీయంగా పడుతోంది.మన దేశంలో అవసరమయ్యే ఇంధనాల్లో కేవలం 23 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతోంది.దాదాపు 77 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.ఇప్పట్లో మన దేశంలో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు కనిపించడం లేదు.దేశీయంగా ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరిగితే ఇంధన దిగుమతులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.











