అఖండ భారతావని వర్తమాన చిత్రం చూస్తున్న కొద్దీ.. స్వేచ్ఛా సందేహాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. అర్ధరాత్రి స్వాతంత్య్రానికి ఇంకా తెల్లారలేదనే అనిపిస్తుంటుంది. దశాబ్దాల స్వాతంత్య్రానికి సరైన అర్థం ఇంకా ప్రాప్తించలేదనే అనుకోవాల్సి వస్తోంది. పేదలు మరింత పేదలుగా…పెద్దలు మరింత పెద్దలుగా మారుతున్న ఈ అనివార్య అంతరాల అవాంతరాలు అసమానతలు… ఏనాటికీ అభివృద్ధికి దారులు వేయవని… వేయలేవని నిస్సిగ్గు స్వార్థం బాహటంగానే దండోరా వేస్తుంటే…ఈ స్వరాజ్యం ఎందుకో అనిపిస్తుంది. గాంధీజీ మొక్కవోని దీక్షతో సాధించిన స్వాతంత్య్రం ఏ పరమార్థం సాధించింది??
ఒక బక్కపలచ మనిషి.. చేతిలో ఊత కర్ర పట్టుకుని జాతి గతిని మార్చేందుకు సంసిద్ధమవడమే ఓ చరిత్ర! అహింసే తన ఆయుధంగా తెల్లజాతికి ఎదురొడ్డి నిలవగల ఆ గుండె ధైర్యం రావడానికి బలమైన ఘటనలే కారణాలయ్యాయి. 1893 జూన్ 7న గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో దర్బన్ నుంచి ప్రిటోరియాకు చేసిన రైలు ప్రయాణం ఓ ప్రధాన ఘట్టంగా చెప్పుకోవాలి… ఆ రోజు రాత్రి గడ్డకట్టిన చలిలో వణుకుతూ స్టేషన్లోనే కూర్చుండిపోయిన గాంధీ మనసులో ఎంతటి సంఘర్షణ చెలరేగిందో.. ఏ ఆవేశపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయో.. కళ్ల వెనకాల ఏ కన్నీటి బిందువులు నిరసించాయో…అవే అతణ్ణి మరో కోణంలో ఆలోచింప జేశాయి.
ఆ నిశ్శబ్ద నిశీధిలో.. రైలు మారిట్జ్ బర్గ్కు రాత్రి తొమ్మిది గంటలకు చేరుకుంది. ఒక ప్రయాణికుడు గాంధీ ఉన్న మొదటి తరగతి కంపార్ట్మెంట్లో వచ్చి తనను ఎగా దిగా చూశాడు. గాంధీ నల్లవాడు కావడంతో సహించలేక పోయాడు. పెట్టె దిగి ఒకరిద్దరు ఉద్యోగుల్ని పిలుచుకు వచ్చాడు. ఇంతలో మరో ఉద్యోగి వచ్చి ‘నీవు ఇక్కడ కాదు వెనక పెట్టెలో కూర్చోవాలి’ అంటూ హుకూం జారీ చేశాడు. ‘నా దగ్గర మొదటి తరగతి టికెట్ ఉంది కదా’ అని గాంధీ వాదించినా వారు వినకుండా తనను పెట్టె నుంచి గెంటేశారు. తాను కేవలం నల్లవాడు కావడం వల్లే రైలులో మొదటి తరగతి కంపార్ట్మెంట్ నుంచి నెట్టివేశాడు ఓ తెల్లదొర.
అసలే అది చలికాలం. దక్షిణాఫ్రికాలోని పర్వత ప్రాంతాల్లో చలి ఇంకా అధికం. మారిట్జ్బర్గు మరీ ఎత్తున ఉండటం వల్ల చలి కోతపెడుతోంది. దూరంగా ఉన్న పెట్టెలో ఓవర్కోటు ఉన్నా.. అది అడిగితే మరో అవమానం ఎదురవుతుందేమోనన్న భయంతో మిన్నకుండి పోయాడు. ఆ రోజు స్టేషన్ వెయింటింగ్ రూమ్లో మౌనిలా ఉండిపోయిన గాంధీ మనసులో ఇక ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా వచ్చింది. అయితే అది లిప్తపాటు మాత్రమే. తనను కంపార్ట్మెంట్ నుంచి తోసేసిన వ్యక్తిపై గాంధీ రగలిపోలేదు. తిరగబడలేదు. కారణం అక్కడ ఆ చర్యకు పాల్పడింది వ్యక్తే కావచ్చు. కానీ అతనిని ఉసిగొల్పింది మాత్రం అప్పటి వ్యవస్థే!
ఏ సమాజంలో అయినా.. ఏ కాలంలో అయినా వ్యవస్థలో లోపాలే వ్యక్తుల్లో ప్రతిఫలిస్తుంటాయి. ఒక వేళ అప్పుడు వర్ణవివక్ష అనేదే లేకుండా ఉండి ఉంటే గాంధీజీకి అలాంటి అవమానం ఎదురయ్యేదే కాదు.. అతను తీవ్రంగా ఆలోచించే అవకాశం, సందర్భం కూడా ఉండేవి కావేమో! అందుకే గాంధీజీ ఆ సంఘటనను సామాజిక రుగ్మతగా భావించాడు. ఆ వర్ణ జాడ్యం పోయేందుకు ఏం చేయాలో ఆలోచించాడు. అదే గొప్ప విప్లవానికి నాంది పలికింది.
అందుకే గాంధీజీ ఆనాటి ఘటన తన జీవితాన్నే మార్చేసిన సృజనాత్మక స్వానుభవంగా వర్ణించాడు. ఆ క్షణంలోనే అతని మనసులో అహింస బీజాక్షరం అంకురించింది. తదనంతర కాలంలో అది జాతిజనుల గుండెల్లో ఉద్యమగీతికగా పల్లవించింది. గాంధీజీని మహాత్మగా మార్చింది. భారతదేశానికి స్వేచ్ఛావాయువులు ప్రసాదించిన మూలమంత్రంగా నిలిచింది. దేశప్రజల బానిసంకెళ్ళను తునాతునకలుగా తెంచివేసింది.
అహింసే ఆయుధంగా: తరతరాల బానిసత్వం నుంచి భారతీయులను విముక్తులుగా చేసేందుకు ఎందరెందరో వీరోచితంగా పోరాడారు. అల్లూరి, భగత్ లాంటి వీరుల విప్లవధోరణులు తిరుగుబాటులు ప్రజల్ని ప్రభావితం చేశాయి. అయితే అహింస.. వ్యక్తుల స్వేచ్ఛను అణచివేసిన ఆ అరాచక కాలంలో బ్రిటీష్ దొరల దురహంకారాన్ని దునుమాడగల శక్తిమంతమైన ఆయుధంగా అవతరించిందన్నది విస్పష్టం. దండి సత్యాగ్రహం మొదలు పలు నిరసనలు కొత్తపుంతలు తొక్కాయి. పాలకుల అంచనాలకు అందనంతగా పోటెత్తాయి. గాంధీని బ్రిటిష్ పాలకులు ఈ బక్కచిక్కిన మనిషేం చేయగలడని అనుకుని ఉండవచ్చు.
కానీ క్రమంగా జాతి జాతే తన వెంట నడవడం ప్రారంభించాక వారు నిరుత్తరులయ్యారు. లాఠీలకు, తూటాలకు అణచివేతలకు వెరవని వజ్ర సంకల్పంతో ప్రజలు ఉద్యమించడంతో పాలకులు ఉక్కిరిబిక్కిరికాక తప్పలేదు. తోకముడవకా తప్పలేదు.
మొండి మాటగా
దండి బాటలోనే కాదు… ఉద్యమం కడదాకా గాంధీజీది మొండి మాటే! ఎవరు కాదన్నా తన ఆలోచనల్ని మార్చుకోలేదు. చివరికి తన సిద్ధాంతమే పనిచేసింది. అయితే ఈ పరిణామం ఒక్కరోజుతో సంభవించలేదు. గాంధీజీ అత్యంత సంయమనంతో సాగించిన పోరాటం సామాన్యమైనది కానేకాదు. ఎందుకంటే అప్పట్లో ఆయన్ను అభిమానించేవారే కాదు విమర్శించేవారికీ కొదవ ఉండేది కాదు. అసలు ఈ అహింస సిద్ధాంతమేంటో అని పెదవి విరిచిన వారు, ఎగతాళి చేసినవారూ ఎందరో. అయితే గాంధీజీ దూరదృష్టితో తిట్లను విమర్శల్ని సానుకూలంగానే తీసుకున్నాడు. ఎవరు వచ్చినా రాకపోయినా తన పంథా వీడలేదు. మొండిగా కదిలాడు. తనకు తెలుసు ఏదో ఒక రోజు ప్రజలు తనవెంట వచ్చితీరుతారని. అదే జరిగింది. పోరాటం ఫలించి స్వాతంత్య్రం లభించింది. చాలా దూరమే ప్రయాణించాం. .కానీ ఏం లాభం??
స్వతంత్రమా సిగ్గుపడు..
‘స్వాతంత్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడి పోగానే సరిపోదోయి’ అన్న పాటను వెలుగునీడలు సినిమా కోసం శ్రీశ్రీ ఏ ముహూర్తాన రాశారో గానీ.. ఇప్పటి పరిస్థితికీ అది కచ్చితంగా సరిపోతోంది. మనకు స్వేచ్ఛ లభించింది.. కానీ సామాజిక రుగ్మతలు అంతకంతకూ పెచ్చుపెరుగుతునే ఉన్నాయి. స్వార్థ రక్కసి కరాళ నృత్యం భీతావహంగా ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడచిపోతున్నా.. ప్రగతి రథం మొండెద్దు బండిలా సాగుతోంది. మనుషుల బతుకులకు పూచీ లేకుండా పోతోంది. రాజకీయాలు వికృత క్రీడలుగా మారిపోయాయి. ఓటుబ్యాంకు రాజ్యమేలుతోంది. అవినీతి అట్టహాసంతో నీతి కుదేలయిపోతోంది.
ఈ వర్తమాన భయానక చిత్రానికి ఎందరో కుహనా నాయకులు రూపకర్తలు. ఈ పీడిత సమాజానికి ఎందరో అధికార మదాంధులు అధర్మకర్తలు. ధనిక బీద తేడాలు అంతరించలేదు. వర్ణవివక్ష ఏమాత్రం తగ్గలేదు. ఆనాడు గాంధీజీ ఎదుర్కొన్న అవమానం.. ఇప్పటి కొందరనుభవిస్తున్న అవమానాల కన్నా ఎక్కువేం కాదేమో అనిపిస్తోంది. కులం కట్టుబాట్లు, వెలివేతలు, రెండుగ్లాసుల పద్ధతులు ఇంకా రాజ్యమేలుతునే ఉన్నాయి.
సగటు జీవికి భద్రత ఏదీ?
పంచదార లేదు.. పాలడబ్బా లేదు.. బొగ్గుల్లేవు.. కప్పుకోడానికి రగ్గుల్లేవు.. అంటూ కవి తిలక్ సగటు మధ్యతరగతి జీవి జీవనచిత్రాన్ని కవితాత్మకంగా చిత్రీకరించారు. అయితే ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో పిసరంతయినా మార్పు రాలేదు. సగటు జీవి బతకడమే కష్టమైపోతున్న దరిద్రకాలం దాపురించింది. వచ్చే రాబడికి ఖర్చులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. కనీసం కాయగూరల ధరవరలను కూడా నియంత్రించలేని నిస్తేజ స్థితిలో పాలకులు మిగిలిపోయారు. ఏలికలు సగర్వంగా సమర్పిస్తున్న సంక్షేమ పథకాలు ఓటు ప్రాయోజిత కార్యక్రమాలే తప్ప బడుగుబతుకులకు అండదండగా ఉండటం లేదు. మధ్య తరగతి బతుకులు అతలాకుతల మవుతున్నాయి.
తాజాగా విజృంభించిన కరోనా విలయమే తీసుకుంటే.. మానవత్వం మంటగలిపిన ఉదంతాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. సాటి మనిషి కరోనాతో మరణిస్తే కనీసం ఊర్లోకి తెచ్చేందుకు అనుమతివ్వలేనంత దారుణ దృశ్యాలు కనిపించాయి. ఇక వైద్యం అంటారా.. అది గాల్లో దీపమే. కరోనా వల్ల లబ్ధి పొందిందెవరైనా ఉన్నారా అంటే ప్రైవేటు ఆస్పత్రుల వారే. లక్షలకు లక్షలు పిండేశారు. కరోనా వస్తే చికిత్సకు ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్నంత అధ్వాన్నంగా పరిస్థితులు మారిపోయాయి. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవంతే అన్న ప్రభుత్వ హెచ్చరికలు చాలా సందర్భాల్లో హాస్యాస్పదంగా మారిపోయాయి. ఇక దేశవ్యాపితంగా వలసజీవులు తమ సొంతూళ్ళకు కాలిబాటన నడచి వెళ్ళిన దయనీయ దృశ్యాలను మనమే కాదు ప్రపంచ ప్రజలూ కళ్ళార్పక చూశారు.
సోనూసూద్ లాంటి మానవీయ మనుషులు తోచినంత సాయమందించారే గానీ.. ఈ దుస్థితిని ముందస్తుగా ఏమాత్రం ఊహించని.. అంచనా వేయలేని ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం మాత్రం అందరికీ తేటతెల్లమయింది. స్వేచ్ఛాభారతదేశపు వర్తమాన స్థితికి ఇలాంటి దారుణోదాహరణలు చాలానే ఉన్నాయి.
నిర్భయలా? నిస్సహాయులా?
అర్ధరాత్రి ఆడపిల్ల క్షేమంగా ఇల్లు చేరితేనే స్వాతంత్య్రానికి అసలైన అర్థం అని గొప్పగా ప్రవచించుకున్న మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పాశవిక ఘటనలు ఈ మధ్య కాలంలోనే వరసగట్టి చోటుచేసుకోవడం ఎంత దౌర్భాగ్యం. 2012లో ఢిల్లీలో నిర్భయ ఘటనకు దేశం మొత్తం రగిలిపోయింది.. కదలిపోయింది. విధిలేని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్బయ చట్టం తెచ్చింది. కానీ మృగాళ్ళలో ఏమాత్రం మార్పు తీసుకు రాలేకపోయింది. నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ళ అమ్మాయిపై నలుగురు కామాంధులు మూకుమ్మడిగా అత్యాచారానికి పాల్పడ్డమే కాకుండా ఆ యువతిని చిత్రహింసలకు గురిచేశారు. ఆ అమ్మాయి సోమవారం రాత్రి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో మరణించింది. ఈ అత్యాచార ఘటన అందరిలో ఆగ్రహావేశం రగిలిస్తోంది.
ఈ ఘటనకు రెండు రోజుల ముందు కొందరు కామాంధులు ఓ 14 ఏళ్ళ యువతిని చెరచి.. చెట్టుకు వేలాడదీసి ఆమె ప్రాణాలు బలిగొన్నారు. గత నెలలో ఇదే రాష్ట్రంలోని అఖింపూర్ఖేరి జిల్లాలో వరసగా నాలుగు అత్యాచారాలు జరిగాయి. అలాగే పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. తమ కూతుళ్ళు ప్రేమించి కులాంతర పెళ్ళిళ్లు చేసుకున్నారని భర్తలను కిరాతంగా హతమార్చిన దారుణాలు తెలుగు నేలపైనే దృశ్యమానమయ్యాయి.. ఇవి ఏ ప్రగతికి.. ఏ అభివృద్ధికి.. ఏ వెలుగులకు నిదర్శనాలు? చట్టాలపైన కనీస గౌరవం లేనివాళ్లు.. మానవత్వాన్ని ఇసుమంతయినా వంటబట్టించుకోనివాళ్లు అంతకంతకూ పెరిగిపోతుండటం ఎంత దురదృష్టం! పేదరికం.. నిరుద్యోగం.. వెనకబాటుతనం.. ముప్పేట దాడి చేస్తున్న ఈ అవ్యవస్థలో స్వాతంత్య్రానికి అర్థమేంటో అన్వేషించాల్సిందే!! ఇవన్నీ మననం చేసుకుంటే గాంధీజీ కలలుగన్న దేశం ఇదయితే కానేకాదన్న ఓ నిర్వేదం మన మనసుల్ని చుట్టేస్తుంది.
మారదులోకం.. మారదు కాలం
గాలివాటు గమనానికి
కాలిబాట దేనికి?
గొర్రెదాటు మందకి మీ
జ్ఞానబోధ దేనికి?
ఏ చరిత్ర నేర్చుకుంది
పచ్చని పాఠం..
అన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి భావావేశం.. కవితాక్రోశం.. వ్యధార్థ భారత యధార్థ చిత్రానికి నిలువెత్తు నిదర్శనం!!
.. రామదుర్గం మధుసూదనరావు











