టీఆర్ పీ రేటింగ్ స్కాంలో రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చిట్ చాట్ బయటకు వచ్చింది. ఈ చిట్ చాట్ లో ఆయన ప్రకాశ్ జవదేకర్ వల్ల ఉపయోగం లేదని ఒకరు, పీఎంఓ వేరే విధంగా డీల్ చేస్తుందని ఒకరు, న్యూస్ 18బెదిరిస్తోందని మరొకరు చాట్ చేయడం, ఆ విషయం బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ విషయాలను ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. మీడియాను అడ్డుపెట్టుకుని అర్నాబ్ గోస్వామి పవర్ బ్రోకర్గా వ్యవహరించారని, నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారని, ఈ తప్పులకు సుదీర్ఘకాలం జైలు తప్పదని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఈ చిట్ చాట్ పై అర్నాబ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
టీవీల్లో చర్చా కార్యక్రమంలో విరుచుకుపడే వ్యక్తిగా పేరున్న అర్నాబ్ గోస్వామి ఆధ్వర్యంలో రిపబ్లిక్ టీవీ 2017లో ఏర్పాటైంది. అయితే టీవీ ప్రారంభమైన నాటినుంచి టీఆర్ పీ రేటింగ్ లు విపరీతంగా రావడం, అప్పటికే ఉన్న జాతీయ ఛానెళ్ల రేటింగ్ దారుణంగా పడిపోవడంతో అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది బార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై పోలీసులకు ఈ ఫిర్యాదు అందడంతో రిపబ్లిక్ టీవీపై, ఆ సంస్థ సీఈఓ వికాస్ ఖాన్ చందానీ, ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదైంది.
ఈ కేసులో 2013నుంచి 2019వరకు బ్రాడ్కాస్ట్ రీసెర్చ్ ఆడియెన్స్ కౌన్సిల్ (బార్క్) సీఈఓగా పనిచేసిన పార్థ్ దాస్గుప్తా ను 2020లో అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో పార్ద్ దాస్ గుప్తా పలు సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. తనకు ముడుపులు, ఖరీదైన బహుమతులు ఇవ్వడంతోపాటు పలువురు కీలక వ్యక్తులను కూడా తమవైపు తిప్పుకున్నారని ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనతో అర్నాబ్ గోస్వామి చేసిన వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది. రేటింగ్ లు, ప్రోగ్రాంల నిర్వహణ విషయంలో జరిగిన ఈ చాట్ లో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వల్ల ఉపయోగం లేదని, పీఎంఓ వేరే విధంగా డీల్ చేస్తుందని, ఇతర టీవీలు వేరే వాళ్లని భయపెడుతున్నాయని చర్చ జరిగింది. అంటే.. పీఎంఓ లోనూ అర్నాబ్ గోస్వామి ప్రభావిత వ్యక్తులు ఉన్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇదీ కుంభకోణ సంక్షిప్త సారాంశం..
వీక్షకులు ఎక్కువ ఏ టీవీని, ఏ ప్రోగ్రాంని, ఏ టైంలో చూశారో గణించేదే టీఆర్ పీ. ఇందుకోసం బారోమీటర్ ద్వారా లెక్కింపు జరుగుతుంది. ఆ బారో మీటర్ ఏ వినియోగదారుల కనెక్షన్ కు అనుసంధానంగా ఉందనేది రహస్యంగా ఉంటుంది. మారుతూ ఉంటుంది. అయితే ఈ బారో మీటర్ వివరాలను అర్నాబ్, పార్ద్ దాస్ గుప్తా లు సేకరించారు. సదరు వినియోగదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చి..రిపబ్లిక్ టీవీ ని చూసేలా చేశారని ఆరోపణ. సాంకేతికంగా ఇంకా చాలా వివరాలు ఉంటాయి. వాటిని కూడా ట్యాంపర్ చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపైనే పలు ఫిర్యాదులు అందడంతో బార్క్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ కేసులోనే అరెస్టులు జరిగాయి. తాజాగా.. బయటకు వచ్చిన దాదాపు 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్ మెసేజ్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.











