(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
జిల్లా కేంద్రంగా త్వరలో అవతరించబోతున్న పార్వతీపురంలో పట్టు సాధించేందుకు వైసీపీ నాయకులు సై అంటే సై అంటున్నారు. వైసీపీ నాయకురాలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండగా , తన పట్టు జారకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం సంపాదించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటంతో వీరిద్దరి మధ్య స్థానిక వైసిపీ కేడర్ నలిగిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి ఆధిపత్య పోరుతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అడుగంటిందనే విమర్శలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ పైరవీలతో కాలక్షేపం చేస్తూ తమ అనుయాయులకు ఉద్యోగాల్లో నియమించేందుకు, కాంట్రాక్టులను ఇప్పించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
డిప్యూటీ సిఎం అండతో ..
డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజ్ అరకు పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. తన భార్య డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అవ్వడంతో ఆమె అండతో పార్వతీపురం ఐటీడీఏపై పూర్తి పట్టు సాధించారని తెలుస్తోంది. అక్కడ చీమ కదిలినా ఇక్కడ తెలియాలనే షరతు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీడీఏలో జరిగే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాలు, కాంట్రాక్ట్ పనులు ఈయన కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు, ప్రతిదానికీ ఒక రేటు నిర్ణయించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా మండలానికి ఒకరిని సమన్వయకర్తగా నియమించి వారి ద్వారా పనులు చక్కపెడుతున్నట్లు బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా ఐటీడీఏ పరిధిలోని పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో తన అనుయాయులకు అవకాశం కల్పిస్తూ తన పట్టు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా పార్వతీపురంలో పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి.
మంత్రి బొత్స అండతో ..
వైసీపీకి చెందిన పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు జిల్లా మంత్రి బొత్స అండతో డిప్యూటీ సీఎంను కట్టడి చేసేందుకు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం మున్సిపాలిటీలో ప్రతి కదలిక తనకు తెలిసే విధంగా , ప్రతి ఫైలూ తన సూచన మేరకే కదలేటట్టు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఇతరత్రా నియామకాలు అలజంగి కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిని తన గుప్పెట్లో బంధించి, తన వారిదే అక్కడ ఇష్టారాజ్యం చేసినట్లు వినికిడి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గిరిజన ప్రాంతమైన కురుపాంకు తొలుత మంజూరు చేసినప్పటికీ, తన పలుకుబడితో పార్వతీపురంలో ఏర్పాటు చేసుకోనేలా కృతకృత్యులయ్యారు. ఈ సంఘటనతో డిప్యూటీ సీఎంపై తాను ఆధిక్యం చాటుకున్నట్లు స్పష్టం అవుతోంది. కురుపాంకు మంజూరైన ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణ పనులు తనవారికి అప్పగించుకోవడంతో , ఆసుపత్రి విషయంలో ఆమె సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. పార్వతీపురంలో ఇటీవల చోటు చేసుకుంటున్న వివాదాస్పద సంఘటనలన్నీ ‘పవర్’ పాలిటిక్స్ లో భాగంగానే జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యమని స్థానికులు అంటున్నారు.
మన్యసీమకు ముఖద్వారంగా ఉన్న పార్వతీపురంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పవర్ పాలిటిక్స్ రాజ్యమేలుతూ అభివృద్ధి అడుగంటుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.