(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు రైతులకు చేస్తున్న మోసాలు, వారు పడుతున్న బాధలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా ప్రభుత్వం మీద నమ్మకంతో భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేశారన్నారు. ఖరీఫ్లో వర్షాభావంతో రాష్ట్రమంతా కరవు నెలకొంటే కనీసం కరవు మండలాలను ప్రకటించలేదని విమర్శించారు. గత ప్రభుత్వం సకాలంలో కరవు మండలాలను ప్రకటించటమే కాకుండా రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకుందని గుర్తు చేశారు.
కలిసిరాని ఖరీఫ్
శ్రీకాకుళం జిల్లాలో ఈసారి ఖరీఫ్ సాగు రైతన్నకు కలసి రాలేదు. వరుసగా వచ్చిన విపత్తులు తేరుకోనీయకుండా చేశాయి. చివరికి కోతల దశలోనూ అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో ఇప్పటికే దాదాపు 30 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. సన్నరకాలైన సాంబ మసూరి, ఆర్జీఎల్ వంటి తేలికరకం ధాన్యం పదిహేను రోజుల ముందుగానే చేతి కొచ్చింది. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా నూర్పిడి పూర్తి చేసిన రైతులు ఇప్పుడు వాటిని అమ్మేందుకు అవస్థలు పడుతున్నారు. పచ్చి ధాన్యం తీసుకునేందుకు వ్యాపారులూ ముందుకు రావడంలేదు. ఆరబెట్టినవి విక్రయిద్దామన్నా ధర తగినంత రావడం లేదు. ఇదే అదనుగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు దళారులు తక్కువ ధరకే తీసుకుంటున్నారు.
రిజిస్ట్రేషన్తో ఇక్కట్లు ..
వరి పండించిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలంటే రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ తప్పని సరి చేశారు. దీని వలన అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 18.74 శాతం రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. పంటను నేరుగా కల్లాల్లో కొనుగోలు చేయకుండా, నమోదు చేయించుకున్నవారివి మాత్రమే కొనాలని అధికారులు దిశానిర్దేశం చేస్తుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
కోతకు సిద్ధంగా ..
ప్రస్తుతం పంటంతా కోతకు సిద్ధంగా, పనలపైనా, నూర్పిళ్లు రూపంలోనూ కళ్లాల్లో ఉంది. రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు చాలా చోట్ల పంట నాశనమయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో యంత్రాలతో కోతలు, నూర్పిళ్లు పూర్తి చేస్తున్నారు. కొందరు వచ్చిన కాడికే అమ్ముకుంటున్నారు. తడిచిన ధాన్యం, రంగు మారిందంటూ రైతులను దళారులు నిలువునా ముంచేస్తున్నారు. 80 కిలోలు కేవలం రూ.1070 నుంచి రూ.1100 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన పంటనైనా రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.