పశ్చిమబెంగాల్లో మరోసారి సీఎం మమత వర్సెస్ ప్రధాని మోదీ అన్నట్లుగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డినా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వచ్చింది.నందిగ్రాంలో మమత బెనర్జీ ఓడినా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మమతాబెనర్జీ సీఎం అయ్యారు.అయితే ఎన్నికలు ఫలితాలు వచ్చాక కూడా రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణగలేదు.బీజేపీ వర్సెస్ తృణమూల్ వర్గాల మధ్య దాడులు,ప్రతిదాడులు ఇటీవలి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో ప్రధాని మోదీ లక్ష్యంగా సీఎం మమత బెనర్జీ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూడా ప్రతివిమర్శలకు దిగింది.ఇదంతా ఓవైపు జరుగుతుండగానే శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కైలాకుందా ఎయిర్ బేస్లో ప్రత్యేక సమీక్షా సమావేశం
యాస్ తుఫాను ప్రభావిత పశ్చిమ బెంగాల్,ఒడిషా రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ తుపాను ఆ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిన విషయం తెలిసిందే.అయితే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించి ప్రధాని మోదీ కైలాకుందా ఎయిర్ బేస్లో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి మమత బెనర్జీ అరగంట సేపు ఆలస్యంగా వచ్చినట్టు వార్తలు వచ్చాయి.మమతా బెనర్జీ కోసం ప్రధాని మోదీ అరగంట సేపు వేచి చూడాల్సి వచ్చిందని ఆ వార్తల సారాంశం.ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర గవర్నర్ చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశమైంది.ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ద పాలనలో ఇలాంటి ఘటనలు మంచివి కావని,నిరంకుశ వాదానికి తావివ్వకూడదని, ప్రజాశ్రేయస్సుకి ప్రాధాన్యం ఇవ్వాలనే అర్థం వచ్చేలా గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ట్వీట్ చేయడం ఆ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.
ఆలస్యంగా వచ్చినా ..
ఇక సీఎం మమతా బెనర్జీ అరగంట సేపు ఆలస్యంగా వచ్చినా తరువాత కొద్దిసేపు మాత్రమే ఉన్నారని,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆలస్యంగా వచ్చారని,సీఎం మమతా బెనర్జీ,సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్లు తాము రాసుకున్న వినతి పత్రాన్నిమోదీకి ఇచ్చేసి సంక్షిప్తంగా మాట్లాడి తాము సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందని చెప్పి అనుమతితో కూడిన సమాచారంగా చెప్పి వెళ్లిపోయారు.ఈ సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు మోదీతో పాటు గవర్నర్ జగదీప్ ధన్ఖర్,ప్రతిపక్షనేత సువేందు అధికారి మాత్రమే ఉండాల్సి వచ్చింది.కాగా ఈ అంశంపై మమత మాట్లాడుతూ తనకు ప్రధాని సమీక్ష సమాచారం తనకు ఆలస్యంగా తెలిసిందని,ఇతర కార్యక్రమాల్లో ఉన్నందున సమావేశానికి ఆలస్యంగా వచ్చానని పేర్కొన్నారు.
మమతా బెనర్జీకి కేంద్రం షాక్..
ఈ పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీకి కేంద్రం షాక్ ఇచ్చింది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలు కేంద్రానికి అవసరమని,అందుకే ఆయనను వెంటనే రిలీవ్ చేయాలని సమాచారం ఇచ్చింది.సోమవారం ఢిల్లీలోని డీఓపీటీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశం పూర్తయ్యాక కాసేపటికే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.దీనిపై తృణమూల్ కాంగ్రెస్ విమర్శలకు దిగింది.తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బలవంతపు డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించింది.
పొడగింపుపై సందిగ్దం..
కాగా ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆలాపన్ బందోపాధ్యాయ్ 1987 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి.మే 31తో ఆయనకు 60 ఏళ్లు పూర్తి కానున్నాయి.సోమవారంతో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్నా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆయన సర్వీసును పొడిగించాల్సిందిగా మే 12న మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాశారు.అయితే తాజా వివాదం నేపథ్యంలో ఆయన పదవీకాలం ఆరునెలలు పొడగిస్తారా లేక మూడునెలలకు పొడిగించి ధిల్లీలోనే కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది.ఈ అంశంపై మరోసారి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కనుందనే చర్చ నడుస్తోంది.











