‘రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు’ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి విన్నాం. మల్టీస్టారర్ సినిమా అనే మాటకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. పాత మల్టీస్టారర్ సినిమాలనే కొత్త సీసాలో పోస్తే ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలే వస్తాయి.
ఇద్దరు అగ్రహీరోలతో సినిమా చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. అసలు ముందు ఆ ఇద్దరు హీరోల కాల్షీట్లు కుదరాలి.. అంతకన్నా ముందు ఆ హీరోల ఈగో శాటిస్ఫై కావాలి. ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి.. ఇవన్నీ పూర్తయ్యాకే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఇలాంటి సినిమా బాలీవుడ్ లో రూపొందాలంటే పెద్దగా ఇబ్బందులుండవుగానీ ప్రాంతీయ భాషల్లో తీయాలంటేనే తిప్పలు. తెలుగులో రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పట్టాలెక్కిందీ అంటే దానికి రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడే కారణం. అసలు నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ హీరోలిద్దరినీ కలిపి సినిమా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని.

ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయాలంటే నేటి రోజుల్లో కుదరదు. అలాగని మనకు మల్టీస్టారర్ సినిమాలు లేవా అంటే ఎందుకు లేవు. తెలుగు సినిమా తొలి నాళ్లలో నాగయ్య, నారాయణరావులు కలిసి కూడా సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాకు రెండు కళ్లులా భావించిన ఏయన్నార్, ఎన్టీఆర్ లు కూడా దాదాపు 14 సినిమాల్లో కలిసి నటించారు. మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కాలంటే ముందు ఇద్దరు హీరోలకూ న్యాయం చేయగలిగే కథ కూడా దొరకాలి. దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని దర్శకుడు న్యాయం చేయగలగాలి. ఇది సక్సెస్ అయితే మరిన్ని సినిమాలు రావడానికి కూడా ఆస్కారముంటుంది.
సమస్య ఎక్కడ వస్తుంది?
హీరోల్లో ఎవరికి వారు నేనే గొప్ప అనుకోవడంలోనే సమస్య వస్తుంది. అసలు ఇలాంటి సినిమాకు ఎవరి పేరు ముందు వేయాలి? అనేది ఇంకో పెద్ద సమస్య. అందుకే పేర్లు వేయకుండా మీ అభిమాన హీరోలు అంటూ సినిమా టైటిల్స్ లో వేసిన సందర్భాలు ఉన్నాయి. పాటలు, ఫైట్స్, ఇంట్రడక్షన్ సీన్, హీరోయిన్ ఎంపిక, డైలాగ్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ సమస్యలే. దర్శకుడు ఏ హీరోనైనా తక్కువ చేసి చూపిస్తే అభిమానులు అంగీకరించలేరు. ఒక వేళ అది ఆ హీరోకి నచ్చకపోయినా అభిమానులతో వక్తం చేసేలా చేస్తాడు. ఇవన్నీ దర్శకుడికి పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుల విషయంలోనూ ఈ తలనొప్పులు వచ్చిన సందర్బాలు ఉన్నాయి. అందుకే దర్శకుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి.
ఎన్టీఆర్ – ఏఎన్నార్ కాలంలో..
తెలుగు సినిమాకి రెండు కళ్లులా భావించే ఏయన్నార్, ఎన్టీఆర్ ల విషయానికి వస్తే అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ కన్నా కొంత సీనియర్. కానీ స్టార్ డమ్ పరంగా ఎన్టీఆర్ ముందుకు దూసుకుపోయారు. వీరిద్దరూ కలిసి ‘పల్లెటూరి పిల్ల’లో తొలిసారిగా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ తొలి సినిమా ‘మనదేశం’ అయినా హీరోగా ‘పల్లెటూరి పిల్ల’ తొలి చిత్రంగా చెప్పాలి. అప్పటికి ఏయన్నార్ పెద్ద హీరో. అందువల్ల దర్శకుడికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఒకరు వసంత్ గా, ఇంకొకరు జయంత్ గా ఈ సినిమాలో నటించారు.
Must Read ;- సూపర్, పవర్ స్టార్లు అలా స్పందిస్తేనే హీరోయిజం!

‘సంసారం’, ‘పరివర్తన’, ‘మిస్సమ్మ‘, ‘తెనాలి రామకృష్ణ’, ‘చరణదాసి’, ‘మాయాబజార్’, ‘భూకైలాస్’ , ‘గుండమ్మ కథ’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘చాణక్య-చంద్రగుప్త’, ‘రామకృష్ణులు’ , చివరగా ‘సత్యం-శివం’ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. సినిమాల పరంగా ఇద్దరి మధ్యా ఉన్న పోటీ వల్ల, మధ్యలో కొందరి చెప్పుడు మాటల వల్ల అభిప్రాయభేదాలు కూడా తలెత్తాయి. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ తర్వాత దాదాపు 14 ఏళ్లపాటు వీరి మధ్య మాటల్లేవు. ఒకదశలో ఎన్టీఆర్, కృష్ణ మాస్ హీరోలుగా జనంలోకి వెళ్లారు. వీరిద్దరూ కలిసి కూడా సినిమాలు చేశారు. కానీ వీరి మధ్య కూడా అభిప్రాయభేదాలు తలెత్తాయి.
సినిమా విడుదలయ్యాక ఎవరి పాత్రకైనా మంచి పేరు వస్తే తట్టుకోలేని హీరోలు కూడా ఉంటారు. దాంతో దర్శకుడి మీద కూడా అలుగుతారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుల తరం తర్వాత చిరంజీవి వచ్చి మెగాస్టార్ గా ఎదిగారు. ఎన్టీఆర్, ఏయన్నార్ లతో చిరంజీవికి నటించే అవకాశం వచ్చినా అదేంటో ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యయి. ఎన్టీఆర్ తో చేసిన ‘తిరుగులేని మనిషి’, ఏయన్నార్ తో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఆ తర్వాత తనతో సమవుజ్జీలుగా ఉండే హీరోలతో నటించడానికి చిరంజీవికి కూడా అవకాశం రాలేదు.
నాగ్, వెంకీలకు ఎలాంటి సమస్యా లేదు
మల్టీస్టారర్ సినిమాల విషయంలో నాగార్జునకు గానీ, వెంకటేష్ కు గానీ ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. కాకపోతే ఎన్టీఆర్ ఫ్యామిలీతో మాత్రం వీరు ఎందుకో కలిసి నడవలేదు. సీనియర్ ఎన్టీఆర్ తో వెంకటేష్ ఓ సినిమా చేసే అవకాశం వచ్చినా ఆ సినిమా పట్టాలెక్కలేదని అంటారు. అది గౌతమిపుత్ర శాతకర్ణి కథ అట. ఇందులో శాతకర్ణిగా ఎన్టీఆర్, ఆయన కుమారుడు పులమావిగా వెంకటేష్ నటించాలని అనుకున్నారు.
ఎన్టీఆర్ ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ చిత్రానికన్నా ముందు ఈ సినిమా రూపొందాల్సి ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అదే కథను కొంత మార్చి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా చేశారు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన బాలీవుడ్ నటులతో ఎక్కువగా చేశారు. నాగార్జునకు ఇలాంటి అవకాశం వస్తే చిరంజీవితోనే రావాలి. వీరిద్దరి మధ్యా సత్సంబంధాలున్నాయి.
ఎస్. ఎస్.. ఇది రాజమౌళికి పరీక్షే
ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఈ ఇద్దరితోనూ రాజమౌళికి సినిమాలు చేసిన అనుభవం, సాన్నిహిత్యం ఉన్నాయి. ఒకవిధంగా ‘బాహుబలి’ సినిమా తర్వాత ఏమిటనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి దాన్ని సవాలుగా తీసుకుని ట్రిపుల్ ఆర్ చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారని అనుకోవాలి. బాహుబలి లాంటి సినిమా తర్వాత ఆయన మీద అంచనాలు పెరిగిపోయి ఉంటాయి. ముందుకు వెళ్లాలా? వెనక్కి వెళ్లి మర్యాద రామన్న లాంటి సినిమా చేసుకోవాలా అన్న డోలాయమానంలో ఉంటారు.
Also Read ;- ఎన్టీఆర్ ‘లవకుశ’తోనే పాన్ ఇండియాకు భీజం

అలాంటి స్థితిలో ముందుకు వెళ్లాలని రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్లే ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ సినిమా విడుదలయ్యాక కూడా అదే పరిస్థితి. అందుకు మహేష్ బాబు సిద్దంగా ఉన్నారు. మహేష్ తో సాదాసీదా సినిమాలని రాజమౌళి ఎందుకు అనుకుంటారు? అవసరమైతే అందులో ఏ రజినీకాంత్ నో రంగంలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ట్రిపుల్ ఆర్ తర్వాత తెలుగులో మరన్ని మల్టీస్టారర్ సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.











