తొలి ప్రైవేట్-వాణిజ్య రంగం కలిసి చేసిన ప్రయోగంగా ఇది రికార్డులకెక్కింది. మొత్తం 19 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఈ ప్రయోగం ద్వారా ప్రవేశపెట్టనున్నారు. దేశీయ, ప్రైవేటు సంస్ధలకు సంబంధించిన 5 ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ-సీ51 ని ప్రయోగించారు. శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించి.. ఆదివారం ఉదయం 10.24కు కౌంట్డౌన్ జీరోకు చేరుకోగానే నింగిలోకి దూసుకు వెళ్లింది.
పీఎస్ఎల్వీ సీరిస్ లో ఇది 53వ ప్రయోగం. పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ 1.55 గంటలపాటు రోదసిలో పయనించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగించిన క్షణం నుంచి మొదలుపెట్టి 17.23 నిమిషాలకు బ్రెజిల్కు చెందిన 637 కిలోల అమెజోనియ-1 ఉపగ్రహాన్ని సన్ సింక్రనైజ్ పోలార్ ఆర్బిట్ లోకి చేరవేయనుంది. అనంతరం నాలుగు నిమిషాలలో మిగిలిన 18 బుల్లి ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ51 కక్ష్యల్లో వదిలిపెట్టనుంది.