(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అనుకున్నదే జరిగింది. స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తూ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దినంగా భావిస్తూ అఖిల పక్షాలతో గురువారం సాయంత్రం టౌన్ షిప్లో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా అధికార పార్టీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రాజకీయాన్ని ప్రదర్శించారన్న విమర్శలొస్తున్నాయి. గురివింద గింజకు… అన్న సామెతను నిజం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ, ఎగతాళి చేస్తూ ఉద్వేగ ప్రసంగం చేశారు. పార్టీలకతీతంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా సాగాల్సిన ప్రసంగం పార్టీకి డబ్బా కొట్టుకునేలా కొనసాగించారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయారని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా గంటలో తీసుకువస్తామని, లేకుంటే తాను ఆత్మార్పణకు కూడా సిద్ధమని శైలజానాథ్ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను ఎగతాళి చేసేలా ఎంపీ ప్రసంగం సాగింది. లేఖ రాశామని, ఉద్యమంలో పాల్గొంటున్నామని, మీరేం చేశారు? రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని విమర్శించారు. ఆయన్ని తిట్టడం.. ఈయన్ని తిట్టడం.. వల్ల సమస్య పరిష్కారం కాదని.. ఎవరికి వాళ్లు హీరో అవడానికి మాట్లాడడం కాదని చెబుతూనే… స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం లక్ష్యం కావాలని సెలవిచ్చారు.
శైలజానాథ్ అంటే తనకు గౌరవం ఉందని అంటూనే.. “ పాదయాత్ర చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చేస్తాదా, కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా?” అని ప్రశ్నించారని అది సరికాదని చెప్పారు. మా పోరాటం కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. “నడుస్తాం.. పడుకుంటాం… ఢిల్లీకి వినిపించేలా చేస్తాం.. అనుకున్నది సాధిస్తాం.. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒక్కరైనా పార్లమెంటులో మాట్లాడారా అని నిలదీశారు. పంజాబ్, హర్యానా గురించి మాట్లాడుతున్నారు.. వారం రోజుల పాటు సభ కూడా జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ కోసం ఒక్కరైనా అడిగారా? లేఖ అయినా ఇచ్చారా ? రాహుల్ గాంధీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ను కాపాడుతారు అంట! “ భారత దేశం పుట్టిన తర్వాత ఎవ్వరూ చేయని తప్పు చేశారు” అంటూ ఎంపీ మండిపడ్డారు. మేము పాతిక మంది ఎంపీలు ఉంటే.. మీకు వంద మంది ఎంపీలు ఉన్నారు… దీనిపై మాట్లాడండి అంటూ హితవు పలికారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడేందుకు వేదిక కాదు అంటూనే రాజకీయాలన్నీ మాట్లాడేసారు. ఒకపక్క ఆయన కాంగ్రెస్ను విమర్శిస్తూ ఉంటే.. మరో పక్క ఆ పార్టీ అభిమానులు వేదిక కింద నుంచి కేకలు వేయడం ప్రారంభించారు. మరోవైపు వేదికపై ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు.. ఎంపీని వారించే ప్రయత్నం చేసినా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు.
రాసింది ఒక్క లేఖ..
రాష్ట్రానికి పాతిక మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని… కాంగ్రెస్కు వంద మంది ఉన్నారని.. వారెందుకు నిలదీయడం లేదని ప్రశ్నించిన ఎంపీ లాజిక్ మరిచి ప్రసంగం కొనసాగించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి పాతిక మంది ఎంపీలు ఉంటే.. అదే కాంగ్రెస్కు ఒక్కరు కూడా లేని దుస్థితి. రాష్ట్ర విభజన తర్వాత ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ ఎన్నికల్లో అభ్యర్థుల కోసమే పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు .. ఆ రాష్ట్ర సమస్యలను పక్కన పెట్టి, ఆంధ్ర రాష్ట్రంలో ప్లాంట్ గురించి ఎందుకు ప్రశ్నిస్తారు? అన్న విషయాన్ని ఎంపీ విస్మరించారు.
ఆయన నోటితోనే వారం రోజుల పాటు కాంగ్రెస్ ఎంపీలు రైతుల కోసం సభను స్తంభింపజేశారని గుర్తించారు గాని, తాము పాతికమంది ఉండి స్టీల్ ప్లాంట్ కోసం సభను స్తంభింపజేయాలని మాత్రం ఆలోచన చేయలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకే ఒక్క లేఖ కేంద్రానికి రాసి.. తమ బాధ్యత తీరిపోయినట్టు ప్రకటించడం విడ్డూరం. ఇతర జిల్లాలకు చెందిన అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో స్టీల్ ప్లాంట్కు అనుకూలంగా ఎన్ని ఆందోళనలు చేశారో గుర్తెరగలేకపోయారన్న విమర్శలొస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఇతర జిల్లాల ఎంపీలకే చిత్తశుద్ధి లేనప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలను నిందించడం ఎంతవరకు సబబో ఎంపీ గారికే తెలియాలని అంటున్నారు.
ఉద్యమ వేళ..నిందల గోల..
ముందుగా ఊహించినట్టే ఉద్యమాన్ని కూడా తమ పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడేలా అధికార పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎదుటి పార్టీపై నిందలు వేసే కన్నా.. ప్లాంటును సమస్యల నుంచి ఎలా గట్టెక్కించాలన్నదానిపై అర్థవంతమైన ప్రసంగం చేసి ఉంటే అందరి మన్ననలు పొంది ఉండేవారు. కుక్క తోక వంకర అన్న చందాన ఆ పార్టీ నేతలు వేదిక ఏదైనా తమ బుద్ధి, ప్రవర్తన మాత్రం మార్చుకోవడం లేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read ;- భరోసా ఇవ్వని జగన్.. స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు నిరాశే!











