రామ్ హీరోగా చేసిన ‘రెడ్’ సినిమా ‘సంక్రాంతి’ బరిలోకి దిగింది. స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. నివేదా పేతురాజ్.. మాళవిక శర్మ.. అమృత అయ్యర్ తమ గ్లామర్ తో అలరించారు. రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రామ్ కి ఇటు క్లాస్ ఆడియన్స్ లోను .. అటు మాస్ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రామ్ పాత్రలను డిజైన్ చేశారు. అందువలన ఈ రెండు వర్గాల నుంచి ఆయన సినిమాకి ఆదరణ లభిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళం వెర్షన్ కి సంబంధించిన ‘రెడ్’ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ నెల 22వ తేదీన మలయాళ వెర్షన్ సినిమాను అక్కడ విడుదల చేస్తున్నట్టుగా చెప్పింది. రామ్ కూడా కొంతకాలంగా మలయాళంలో తన మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే ‘రెడ్’ సినిమాను మలయాళంలో విడుదల చేస్తున్నారు.
‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా చేసిన దగ్గర నుంచి, రామ్ .. అనుపమ పరమేశ్వరన్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ చనువుతోనే ఆమె ‘రెడ్’ మలయాళ సినిమాను గురించిన విషయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ‘థ్యాంక్స్ పాప’ అంటూ రామ్ స్పందించాడు కూడా. మరి మలయాళంలో విడుదలవుతున్న ‘రెడ్’ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందా? అక్కడ తన మార్కెట్ పెంచుకోవాలనే రామ్ ప్రయత్నం ఫలిస్తుందా? అనేది చూడాలి. రెడ్ మలయాళం ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు.











