రాయలసీమ రామన్న చౌదరి – ఈ పేరు వినగానే ఓ ఎనర్జీ కనిపిస్తుంది. మోహన్ బాబు విలక్షణ నటనకు అద్దం పట్టే సినిమా ఇది. శ్రీలక్ష్మీ పిక్చర్ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు.
2000 సంవత్సం సెప్టెంబరు 15న ఈ సినిమా విడుదలైంది. 1995లో ‘పెదరాయుడు’ ఘనవిజయాన్ని చవిచూసిన మోహన్ బాబు మళ్లీ ఆ స్థాయిలో నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషించాలని ఉవ్విళ్లూరినట్టు కనిపిస్తోంది. ఆ తర్వాత 1998లో ‘రాయుడు’ సినిమా చేశారు. అక్కడితో సంతృప్తి పడలేదు.. ఇంకా పవర్ ఫుల్ పాత్ర కావలసిందే అని ఆరాటపడ్డారు. అలా రూపొందించే ‘రాయలసీమ రామన్న చౌదరి’ చిత్రం. ఈ సినిమా విడుదలై నేటికి ఇరవయ్యేళ్లు.
ఎలా తెరకెక్కిందంటే?
పెదరాయుడు సినిమాలో రజనీ నటన ఎంతగా ఆకట్టుకున్నదో అందరికీ తెలుసు. మోహన్ బాబుతో ఉన్న స్నేహం కోసమే రజనీ ఈ సినిమాలో నటించారు. పైగా దీని తమిళ మాతృక ‘నాట్టామై’ హక్కులను ఆయనే కొని రజనీకి ఇప్పించారు. ఈ సినిమా ఘన విజయం తర్వాత రజనీకాంత్ ను తెలుగులో పూర్తి స్థాయిలో చూపించాలని మోహన్ బాబు ఆరాటపడ్డారు. కేవలం రజనీ కోసమే తమిళ రచయిత పంజు అరుణాచలంతో కథ రాయించారు. రజనీ కూర్చోబెట్టి కథ వినిపించారు. కథంతా విన్న రజనీ ఒకే ఒక మాటన్నారు…‘ఈ కథ నువ్వు చేస్తేనే బాగుంటుంది రా’ అని. దాంతో ఇందులోని తండ్రీకొడుకుల పాత్రలను మోహన్ బాబే పోషించాల్సి వచ్చింది.
కథ ఏమిటి? ఎలా తీశారు ?
ఇది పగప్రతీకారాల కథే. కాకపోతే పాయింట్ లో కొత్తదనం ఉంటుంది. వాళ్ల నాన్నను మోసం చేసి వాళ్ల భూములు లాక్కున్న వారికి రామన్న చౌదరి ఎలాంటి గుణపాఠం చెప్పాడన్నదే కథ. ఇందులో పరుచూరి డైలాగులు తూటాల్లా పేలాయి. గుర్రానికి కాళ్ళల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి కంట్లో బలం, ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా… అనే డైలాగులు థియేటర్లో చప్పట్లు మోగేలా చేశాయి. జయరామ్ ఫొటోగ్రఫీ పనితనం ఈ సినిమాలో కనిపిస్తుంది.
తిరుపతి, తమిళనాడులోని గోపిశెట్టిపాలెం, బ్యాంకాక్, హైదరాబాద్, పొలాచ్చి తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఇందులో మోహన్ బాబు తమలపాకు తిప్పే సన్నివేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ‘ఆకు తిప్పనా’ అంటాడు రామన్న చౌదరి. ఆయన తమలపాకులను తిరగేస్తే అవతలి వ్యక్తి ఫినిష్ అయినట్లే. ఇందులో మోహన్ బాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా జయసుధ, ప్రియాగిల్ వీరికి జంటగా నటించారు. మణిశర్మ నేపథ్య సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాకపోతే నటన పరంగా మోహన్ బాబుకు ఈ సినిమా ఓ మైలురాయిలా నిలిచినా కమర్షియల్ గా అంతగా ఫలితం చూపలేదు.
నటీనటులు, సాంకేతికవర్గం: రామన్న చౌదరి/మురళి గా మోహన్ బాబు, సీతగా జయసుధ, మురళి భార్య గా ప్రియాగిల్, జటాధర స్వామి గా నెపోలియన్, వెంకట శాస్త్రి గా చంద్రమోహన్, సాంబశివరావు గా జయప్రకాశ్ రెడ్డి
సుబ్బారాయుడు గా నర్రా వెంకటేశ్వరరావు, రామన్న తండ్రి రామకృష్ణయ్యగా రంగనాథ్ తదితరులు నటించారు.
కథ, స్క్రీన్ ప్లే – అరుణాచలం క్రియేషన్స్, మాటలు – పరుచూరి బ్రదర్స్, సంగీతం – మణిశర్మ, పోరాటాలు – కనల్ కణ్ణన్, నిర్మాత – మోహన్ బాబు, దర్శకుడు – సురేష్ కృష్ణ.