విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో ఆమె వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు. చిన్న తనం నుండి నృత్యంపై ఉన్న ఆసక్తితో శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలుగా చేరారు. వెంపటి నృత్యరూపాలలో ఆమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించారు. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాదులోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్గా పనిచేస్తూ పిల్లలకు శిక్షణ ఇస్తుండేవారు. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
ఆమెను వరించిన అవార్డులు
2001 – పద్మశ్రీ పురస్కారం
1982 – మద్రాసు లోని కృష్ణ గానసభ వారి నుండి నృత్య చూడామణి
1998- ఎన్టీయార్ పురస్కారం
1990 – సంగీత నాటక అకాడమీ పురస్కారం
2011 – తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు
విజయనగరంతో ఎనలేని అనుబంధం
సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతున్న విజయనగరంతో శోభానాయుడుకు ఎనలేని అనుబంధం ఉంది. 1980 స్థానిక ఎమ్మార్ కళాశాలలో నిర్వహించిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో చండాలిక నృత్య ప్రదర్శన నిర్వహించి ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకున్నారు. 2003 ఆగస్టు 10న విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో నాట్య కారుడు రవికుమార్ నాట్య కళా నృత్యోత్సవాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 2019 ఏప్రిల్ 30 నర్తనశాల డ్యాన్స్ అకాడమీ 20వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ భేరి రాధికారాణి, ఇతర పట్టణ ప్రముఖులు చేతులమీదుగా నర్తనశాల జీవితం సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
కళా రంగానికి తీరనిలోటు
శోభానాయుడు ఆకస్మిక మరణం కళారంగానికి తీరనిలోటని నర్తనశాల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ భేరి రాధికారాణి, ప్రముఖ కళాకారులు మండపాక రవి, భోగరాజు సూర్య లక్ష్మి తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.