ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ తో పాటు నిర్మాతలందరి దృష్టీ ఒక్కసారిగా జీ ప్లెక్స్ పై పడింది. కారణం ఏమిటంటారా.. పే పర్ వ్యూ పద్ధతిని జీ ప్లెక్స్ అనుసరించడం, కొత్త సినిమాలను అందులో విడుదల చేయడమే. రెండు కొత్త సినిమాలను అలా విడుదల చేయడంతో ఆ ఫలితం మీద అందరూ కన్నేశారు. దీన్ని తాము కూడా అనుసరించాల్సి వస్తే ఏంచేయాలి? ఇదే పద్ధతిని కొనసాగించాలా? ఇంకా ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందా? అనే అంశాల పరిశీలన కోసమే అందరి దృష్టీ జీ ప్లెక్స్ పై పడింది.
దీన్ని విశ్లేషించే ముందు మొన్న విడుదలైన ఆ రెండు సినిమాలేమిటో చూద్దాం. ఒకటి హిందీ సినిమా ‘ఖాలీ పీలి’, ఇంకోటి తమిళ సినిమా కా పే రణసింగమ్. అయితే వీటికి జీ ప్లెక్స్ నిర్ణయించిన ధర చూస్తే అందరికీ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అది చూసే వారికే తప్ప చూపించే వారికి కాదుగా. ఈ ఏర్పాటు వల్ల జీ ప్లెక్స్ కు మాత్రం పంటపండింది.
ఈ సినిమాల ఫలితం ఏమిటి?
‘ఖాలీపీలి’ మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. జీ 5, జీ ప్లెక్స్ లో ఈ సినిమాని విడుదల చేశారు. దీని రేటు చూసి అందరూ షాకే. రూ. 299గా ధర నిర్ణయించారు. సినిమా థియేటర్ లో కూడా ఇంత రేటు ఉండదు. పైగా థియేటర్ లో చూస్తే వచ్చే అనుభూతి వేరు. మరి ఎందుకు ఇంత ధర నిర్ణయించారన్నదానికి జవాబు లేదు. పైగా ఇందులో నటించిన వారిలో స్టార్స్ ఉన్నారా అంటే అదీ లేదు. విమర్శకులంతా ఈ సినిమా చూసి పెదవి విరిచేశారు. దీంతో ఈ సినిమాకు స్పందన కరవైంది. తిప్పి కొడితే మూడు కోట్లకు మించి లాగుతుందా లేదా అన్నది కూడా అనుమానమే.
కా పే రణసింగమ్ సంగతేంటి?
ఇది తమిళ సినిమా. పైగా విజయ్ సేతుపతి మంచి క్రేజ్ ఉన్న నటుడు. తమిళ సినిమా అనుకున్నారేమో దీనికి మాత్రం ధరను రూ. 199 గా నిర్ణయించారు. ఒకవిధంగా ఈ ధర కూడా ఎక్కువే.. ఇది థియేటర్లతో పోలిస్తేనే సుమా. రైతుల నీటి సమస్యతో ముడిపడిన కథాంశం. దీనికి కాస్త బాగుందన్న టాక్ వచ్చింది. పైగా ఈ సినిమా చూడాలని ఈ నెల 1వ తేదీ నుంచే చాలామంది ఆన్ లైన్ లో చెల్లింపులు చేసేశారు. మొదటిరోజున ఈ సినిమా కోసం 70 వేల మంది డబ్బు చెల్లించారు. అంటే తొలిరోజునే రూ. 70 లక్షల వసూళ్లు ఈ సినిమా సాధించిందన్న మాట.
ఈ సినిమా నిడివి 2.57 గంటలుంది. డబ్బులు చెల్లించిన తర్వాత ఆరు గంటల వ్యవధిలో ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. దాదాపు 150 దేశాల్లో జీ ప్లెక్స్ అందుబాటులో ఉంది. ఈ విధానం జీ ప్లెక్స్ కు పండగే గాని ప్రేక్షకులకు మాత్రం దండగే అనిపిస్తోంది. విరుమాండి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన ఐశ్వర్యా రాజేష్ నటించింది. ఇది మంచి ఫీల్ గుడ్ మూవీ అనే పేరు తెచ్చుకుంది. కాకపోతే ఇంత సుదీర్ఘ సినిమాని చూడాలంటే ఓపిక కావాలి. పైగా స్లో నెరేషన్ ను జనం జీర్ణించుకోలేరు.
నియమ నిబంధనల్లో సడలింపులు అనివార్యం
పే పర్ వ్యూ పద్దతిలో ప్రేక్షకులకు సినిమాలను అందించాలనుకుంటే కొన్నినియమనిబంధనలను సడలించాల్సిన అవసరం కనిపిస్తోంది. మల్టీ ప్లెక్స్ ధరకు అందుబాటులో ఉన్నా ఫరవాలేదు. మరో విషయం వాళ్లు కేటాయించే సమయం కూడా సరిపోదు. అది పెంచాల్సిన అవసరముంది. ఒకసారి ప్లే బటన్ నొక్కామంటే మనం చూసే సమయం ప్రారంభమైందన్నమాటే. అక్కడి నుంచి మనకు ఆరు గంటల సమయం కేటాయిస్తారు. ఆ లోపే సినిమా చూడటాన్ని మనం ముగించుకోవాలి.
మధ్య లో కరెంటుపోయినా, నెట్ పోయినా ఇంతేసంగతులు. ఆలస్యమైతే మళ్లీ డబ్బులు చెల్లించుకోవలసిందే. సినిమాల విషయంలో కూడా ఇలా జరిగితే మళ్లీ షోకి పంపించే ఏర్పాటు ఒకప్పుడు చేసేవారు. మరి దీనికి అలాంటి సౌకర్యం లేదు. త్వరలో మన తెలుగు సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ కూడా ఇదే పద్ధతిలో జీ ప్లెక్స్ లోనే రాబోతోంది. జీ ప్లెక్స్ అనుసరించే పద్ధతినే మిగతా ఓటీటీలు కూడా చేయబోతున్నాయి. జనం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.