ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ ప్రారంభమైంది. ఉద్యోగుల పదవీ కాలం 57 సంవత్సరాలకు తగ్గిస్తారంటూ, దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోందని, కసరత్తు కూడా ప్రారంభమైందంటూ సోషల్ మీడియాల వస్తున్న వార్తలు ఉద్యోగుల్లో ఆందోళన రేపుతున్నారు. సచివాలయంలో, బయట ఏ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కలసినా ఇదే చర్చ. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఓ వైపు ప్రభుత్వ ఉన్నత అధికారులు చెబుతున్నా, ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన తగ్గలేదు. దీనిపై సీఎం స్థాయి వ్యక్తి క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటుందా?
ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 57 సంవత్సరాలకు తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. అయితే నిప్పు లేనిదే పొగ రాదని, కొందరు ఉద్యోగులు అనుమానిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. నేడు దానిపై మాట్లాడే వారే కరవయ్యారని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఇవన్నీ పరిశీలిస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వారు చర్చించుకుంటున్నారు.
స్పందించని సీఎం
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గిస్తారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతున్నా, ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూసి తరవాత నిర్ణయం తీసుకునేందుకు వారే లీకులు ఇచ్చారా అనే అనుమానం కూడా వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం జగన్మోహన్ రెడ్డికి సాఫ్ట్ కార్నర్ లేదని, వారికి ఎంత చేసినా ప్రభుత్వంపై వ్యతిరేకంగానే ఉంటారని సీఎం భావిస్తున్నారట. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై సీఎం పట్టించుకోవడం లేదనే అనుమానాలకు తావిస్తోంది.
మూడు సంవత్సరాలు రూ.3000 కోట్ల మిగులు
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం ఉన్న 60 నుంచి 57కు తగ్గిస్తే ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.3000 కోట్లు ఆదా అవుతుందని, ఈ మొత్తంతో లక్ష మంది గ్రామ సచివాలయ సిబ్బందికి జీతాలు ఇవ్వవచ్చని అంచనా. ప్రభుత్వంలో 57 సంవత్సరాలు దాటిన వారు 30 వేల మంది ఉన్నారని ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గించే నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఇంటెలిజెన్సు అధికారులు కూడా నిఘా పెట్టారు. దీన్ని బట్టి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికే కొందరు పనికట్టుకుని చేస్తున్నారని భావించవచ్చు. అయితే దీనిపై ముఖ్యమంత్రి నుంచి ఓ స్పష్టమైన ప్రకటన వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.











