రేపల్లె శివ ప్రవీణ్ కుమార్.. ఈ పేరు పెద్దగా ఎక్కడా వినపడలేదే అంటారా? సరే అయితే.. మనం పిలుచుకునే పేరే చెప్పుకుందాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ పేరు వింటేనే నున్నటి గుండుతో సిసలైన సివిల్ సర్వెంట్ మన కళ్ల ముందు కదలాడతారు. ఐపీఎస్ అధికారిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత ఎందుకనో గానీ.. ప్రభుత్వ గురుకుల పాఠశాలలను బాగు చేసే పనిని భుజానికెత్తుకున్నారు. అడిగిందే తడవుగా నిబంధనలను పక్కనపెట్టి మరీ అటు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమైనా, ఇటు కేసీఆర్ సర్కారు అయినా ఆయనకు గురుకులాల సొసైటీని అప్పగించేశాయి. తనపై నమ్మకం పెట్టుకున్న ప్రభుత్వాలను ఎంతమాత్రం నిరాశ చెందనీయకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేశారు. ఇక అక్కడ తన పని అయిపోయింది అనుకున్నారో, లేదంటే గురుకులాలను బాగు చేసినట్టే బయట ఉన్న చెత్తను కూడా శుభ్రం చేద్దామనుకున్నారో గానీ.. ఉన్నట్టుండి సర్కారీ కొలువుకు ముగింపు పలికారు.
ఏం చేసినా ప్రత్యేకమే
ఐపీఎస్ సర్వీసు ఇంకా ఆరేళ్లు ఉండగానే.. ఆ కొలువుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఎందుంకటే.. ఏ ఒక్కరికీ చెప్పకుండానే ఆయన హాఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎస్ సర్వీసుకు రాజీనామా చేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తారని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే.. ముందుగా ఈ వార్తలను కొట్టిపారేసిన ఆర్ఎస్.. ఆ తర్వాత మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా సంకేతాలిచ్చారు. ఇప్పుడు ఏకంగా బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో ఆయన చేరిపోతున్నారు. ఈ మేరకు రంగం కూడా సిద్ధమైపోయింది. ముహూర్తం తెలియదు గానీ.. ఆయన బీఎస్పీలో చేరిపోవడంతో పాటుగా పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవిని చేపడతారన్న విషయం స్పష్టమైపోయిందనే చెప్పాలి. పోలీసు అధికారిగా, గురుకులాల కార్యదర్శిగా తనదైన శైలి పనితీరును కనబరచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారోనన్న అంశంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.
ఎంట్రీకి ముందే రూపం మారింది
ఇదిలా ఉంటే.. రాజకీయాల కంటే కూడా తాను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకొచ్చిన ప్రవీణ్ కుమార్.. పొలిటికల్ ఎంట్రీకి తహతహలాడిపోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. పోలీసు అధికారిగా ఉండగా ఖాకీ దుస్తులు, గురుకులాల కార్యదర్శిగా ఉండగా సాదాసీదా అధికారి వేషంలో కనిపించిన ప్రవీణ్.. ఇప్పుడు ఏకంగా ఖద్దరులోకి మారిపోయారు. ఖద్దరు వేశారంటే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసినట్లే కదా. ఓ టీవీ ఛానెల్ కు ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఖద్దరు చొక్కాలో తళుక్కుమన్నారు. ఖద్దరు చొక్కాలో కొత్తగా కనిపిస్తున్న ప్రవీణ్ రూపాన్ని చూడగానే.. ఖాకీలో ఉన్న ప్రవీణ్ తో పాటు సాదాసీదా అధికారిగా కనిపించిన వైనం ఠక్కున గుర్తుకు వస్తోంది. ఖాకీ తీసేసిన ప్రవీణ్ రాజకీయాల్లోకి రాకుండానే ఖద్దరు వేసేశారే అన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.