కాంగ్రెస్ పార్టీ లో కొత్త ముక్క పుట్టుకురావడానికి రంగం సిద్ధం అవుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆన్ లైన్ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం, సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా గులాంనబీ ఆజాద్ ఇల్లే వేదికగా జరిగిన అసంతృప్తుల సమావేశం అన్నీ కలిపి, ముహూర్తం ఖరారు కావడం మినహా, పార్టీలో కొత్త చీలిక పుట్టుకు రాగల సంకేతాలనే అందిస్తున్నాయి.
ఈ పరిణామాలు భారతీయ జనతా పార్టీకి అపరిమిత ఆనందం కలిగిస్తున్నాయనడంలో సందేహం లేదు. సేనాని ఎవరో దిక్కుతెలియని పరిస్థితిలో.. కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అధికార పక్షం మీద యుద్ధానికి సమాయత్తం కాగల స్థితిలో లేదు. ఇప్పటికే రెండుసార్లు తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన నరేంద్రమోడీ.. ప్రధానిగా హ్యాట్రిక్ విజయాలకు ఇప్పటినుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. కాశ్మీర్ వ్యవహారం గానీ, ఇప్పటినుంచి మూడున్నరేళ్లలో అంటే సరిగ్గా.. ఎన్నికల ప్రకటన రాగల సమయానికి అయోధ్య రామాలయం పూర్తి అవుతుందనే అంచనాలు గానీ.. ఇవన్నీ.. కమలదళం వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యే ప్రయత్నాల్లో భాగాలే.
వారు అంత దూకుడుగా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంటిపోరుతో కునారిల్లుతోంది. గల్లాపట్టుకుని కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. ఆ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సమావేశంలో అంతపనీ జరిగింది. ఇక వారు కలిసి ఉండడం కల్ల. ఆజాద్, కపిల్ సిబల్, శశిథరూర్.. తిరుగబాటు జెండా ఎగరేసిన లేఖలో సంతకాలు చేసిన 23 మంది నాయకుల్లో చాలా మంది సామాన్యులు కారు. తమకంటూ బలం, ప్రజాబలం, పార్టీలో వర్గ బలం ఉన్నవారే. వారంతా ఇప్పుడు వేరుకుపంటికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ పార్టీలోనే ఉన్నా సరే.. ఇదివరకటిలా పార్టీతో మమేకమై పనిచేయగల వాతావరణం లేకుండా, వారిలోని స్ఫూర్తిని సోమవారం నాటి సమావేశంలో రాహుల్ సమూలంగా తొక్కేశారు.
అంతా రాముని దయ..
ఈ పరిణామాలు అన్నీ తమకే లాభిస్తాయని భారతీయ జనతా పార్టీ ఆశ పడుతోంది. రాముని దయ ఉండబట్టే కాంగ్రెస్ పరిణామాలు.. ఆ పార్టీ పతనానికి దారి తీస్తున్నాయని. కమలనేతలు అనుకుంటున్నారు. మోడీ నాయకత్వంలో భాజపా మరింత తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ తమ వంతు ఉపకరించగలదని భావిస్తున్నారు. మోడీ సహా, ఢిల్లీస్థాయి అగ్ర నేతలెవ్వరూ ఈ విషయంలో నోరు మెదపలేదు. లోలోన పండగ చేసుకుంటూ మౌనంగా పరిణామాలను గమనిస్తున్నారు.
అదే సమయంలో- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం పెదవి విప్పారు. కాంగ్రెస్ ను ఎవరూ కాపాడలేరని, భాజపాతో కుమ్మక్కు ముద్ర వేస్తూ సీనియర్ నాయకులను ఆ పార్టీ దూరం చేసుకుంటున్నదని అన్నారు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేస్తే.. ఆ బలాన్ని నమ్ముకుని సీఎంగా అధికార పీఠం మీదకు వచ్చిన చౌహాన్ను మించి- కాంగ్రెస్ కీచులాటలు ఎవరికి లాభిస్తాయో చెప్పగలవారు ఎవరుంటారు? ఆయనైతే స్వానుభవంలో వారి కీచులాటల ఫలితం పొందినవాడు గనుక.. సాధికారికంగా ఆ సంగతి చెప్పగలరు.
భవిష్యత్తు వర్ణమయం
కాంగ్రెస్ పార్టీ గులాం నబీ, కపిల్ సిబల్ వర్గాలపై కత్తి దూసే ప్రయత్నంలో రాష్ట్రాల కమిటీల్లో కూడా మార్పుచేర్పులు తప్పవు. చాలామంది లూప్ లైన్లోకి వెళతారు. వారిని భారతీయ జనతా పార్టీ మచ్చిక చేసుకుంటుందా? ప్రత్యేకించి దక్షిణాదిలో తమ అస్తిత్వం నామమాత్రంగా ఉన్న రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి- భాజపా- కాంగ్రెస్ పరిణామాలను వాడుకుంటుందా? అనే సంగతులు నిలకడమీద తేలుతాయి. ఏది ఏమైనప్పటికీ.. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు- ఇంటిపోరు అన్నీ కలిసి.. భాజపాకు భవిష్యత్తును మరింత వర్ణమయంగా, శోభాయమానంగా చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు.