సినిమా రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి తెలుగు నటుడు పైడి జయరాజ్ ఎంతమందికి గుర్తుండి ఉంటుంది. పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ నటుడి గురించిన ప్రస్తావనను ఎవరూ చేయడం లేదు. అతని జయంతి ఈ నెల 28వ తేదీ. ఎంతో మంది మహానటులను మనం తరచూ తలచుకుంటున్నా జయరాజ్ గురించి ఎవరికీ పట్టడం లేదు. అప్పట్లో అతను సూపర్ స్టారేనని చెప్పాలి. సినిమా పుట్టి తొమ్మిది దశాబ్దాలు కావస్తోంది. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో హిందీ చిత్రసీమ ఇచ్చిన గుర్తింపు అతనికి తెలుగు పరిశ్రమ నుంచి రావడం లేదు.
మూకీల కాలం నుంచి టాకీ కాలం వరకూ సినిమాకు ఓ స్వర్ణయుగమనే చెప్పాలి. జయరాజ్ హీరోగా 156 సినిమాల్లో నటించారు. క్రమేపీ క్యారక్టర్ ఆర్టిస్టుగా 200 పైచిలుకు చిత్రాల్లో నటించారు. హిందీ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ చిత్రాల్లో కూడా జయరాజ్ ప్రభ వెలిగిపోయింది. ఆయన జన్మస్థలం కరీంనగర్. 1909 సెప్టెంబరు 28న ఆయన జన్మించారు. అచ్చుతయ్య, ఆండాలమ్మ దంపతులకు ఆయన పుట్టారు. బాంబే టాకీస్ నిర్మించిన ‘ప్రతిమ’ 1945లో తెరకెక్కిన సంగతి తెలిసిందే.
దిలీప్ కుమార్ కు హీరోగా ఇది రెండో సినిమా. అప్పటికే నటుడిగా సూపర్ స్టార్ గా వెలుగుతూ ఆ సినిమాకు జయరాజ్ దర్శకత్వం వహించారు. 1980లో ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. నటుడిగా తొలిసారిగా తెలుగువారికి లభించిన పురస్కారమిది. అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులను జయరాజ్ అందుకున్నారు. ఆయన పుట్టిన రోజు విశేషాన్ని ప్రజలకు తెలియబర్చే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. ఈసారి 33 మండలాల్లో ఆయన జయంతి వేడుకలను నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.