సోము వీర్రాజు ఇప్పటినుంచే అందరికీ ఆఫర్లు ఇస్తున్నారు గానీ.. ఎన్నికల సమయానికి ఈ కూటమికి అంతసీనుంటే చేరవచ్చు గానీ.. ఇప్పటినుంచే వెళ్లడం ఎందుకు అని మీనమేషాలు లెక్కిస్తున్న వారే ఎక్కువ.
ఏపీలో బీజేపీ పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు ఆ పార్టీని బలోపేతం చేసేందుకు క్యాస్టు కార్డ్ బయటకు తీశారు. కాపులు ఎక్కువగా ఉండే జిల్లాలను ఆయన టార్గెట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా, గుంటూరు జిల్లాలోని కాపు నేతలకు ఫోన్లు చేసి బీజేపీలో చేరాలని సోము కార్యాలయం నుంచి గుర్తింపు ఉన్న కాపు నేతలకు ఫోన్లు వస్తున్నాయట.
2024లో ఏపీలో బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వస్తుందని, మంచి భవిష్యత్ ఉంటుందంటూ చెబుతున్నారట. బీజేపీ మన పార్టీ అంటూ ఫోన్ సంభాషణ మొదలు పెడుతున్నారట. అంటే బీజేపీ కాపుల పార్టీ అంటూ కాపు నేతలను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు స్పీడందుకున్నాయని తెలుస్తోంది.
కాపులు ఏకం అవుతారా?
కాపులు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండేవారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తరవాత వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాపునేతలకు టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో సగం మంది కాపులు టీడీపీకి అండగా నిలిచారు. విజయవాడలో 1988లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగా దారుణ హత్య తరవాత కాపులు టీడీపీకి దూరమయ్యారు. ఆ తరవాత కాపులు కాంగ్రెస్, టీడీపీల్లో కొనసాగుతూ వారి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది కాపు నేతలు మంత్రులు కాగలిగారు. కానీ కాపులు ముఖ్యమంత్రి కాలేదనే లోటు వారిలో కనిపిస్తూ ఉంటుంది.
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో కాపుల్లో కొంత కొత్త ఉత్సాహం వచ్చింది. కాపులకు ఒక పార్టీ వచ్చినట్టయింది. అయితే అనుకున్న ఫలితాలు రాకపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. ఆ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా, కాపులు అటు వైసీపీ, ఇటు జనసేనకు మద్దతు పలికారు. దీంతో జనసేన కూడా కాపులందరినీ ఏకం చేయలేకపోయిందనే చెప్పాలి. తాజాగా బీజేపీ రెండోసారి కూడా అధ్యక్ష పదవి కాపులకు కట్టబెట్టి, ఇది కాపుల పార్టీ అనే ముద్ర వేయించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే…
ముందు అక్కడ నుంచే ప్రారంభం
ముందుగా కాపులు ఎక్కువగా నివశించే ఉభయగోదావరి జిల్లాల నుంచి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఈ రెండు జిల్లాల్లో ఉన్న గ్రామస్థాయి కాపు నేతలందరి వివరాలు సేకరించి, వారిని బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారట. బీజీపీలోకి వస్తే మీకు మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇస్తున్నారని సమాచారం. త్వరలో కాపు నేతలతో రాజమండ్రిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ఆత్మీయ రాజకీయ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారట. ముందుగా కులం మద్దతు పొందితే తరవాత ఏపీలో బీజేపీ బలపడుతుందని సోము అంచనా వేస్తున్నారని సమాచారం.
కుల ముద్ర వేసుకుంటే లాభమా? నష్టమా?
ఏదైనా ఒక పార్టీకి కుల ముద్రవేసుకుంటే లాభమా, నష్టమా అంటే ఖచ్ఛితంగా చెప్పడం కష్టం. ఎందుకంటే టీడీపీకి కమ్మకులం అండగా నిలిచింది. వైసీపీకి రెడ్డి కులం దండగా నిలిచింది. ఇక బీజేపీకి కాపులు అండగా నిలిస్తే, మిగిలిన కులాల వారికి కూడా భరోసా కల్పించవచ్చనేది బీజేపీ పెద్దల వ్యూహం. అయితే కాపులకు ఏకతాటిపైకి తేవడమే పెద్ద సవాల్. కాపులు నాలుగు జిల్లాలో అధికార పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. వారు ఎలాగూ బీజేపీ పంచన చేరరు. మరి వారి అనుచరులు కూడా హఠాత్తుగా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకావం కనిపించడం లేదు. ఎవరైనా బలమైన నేతల బీజేపీలో చేరితే అతని అనుచరులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రతి గ్రామం నుంచి కాపు నేతలకు ఫోన్లు చేసినంత మాత్రాన బీజేపీలో చేరతారు అనుకుంటే పొరపాటే అవుతుంది. అయితే కాపులను ఏకం చేయడంలో సోము వీర్రాజు ఎంత వరకు సక్సెస్ అవుతారో వేచిచూడాల్సిందే.