గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల తొలగింపు వ్యవహారం వైసీపీ, టీడీపీల మధ్య రచ్చ రాజేసింది. వినుకొండ పట్టణంలోని విష్ణుకుండి నగర్ నాగార్జునసాగర్ కాల్వ గట్టుపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహంతోపాటు, పరిటాల విగ్రహాన్ని తొలగించేందుకు వైసీపీ నేతల ప్రయత్నాలు ఫలించాయి. విగ్రహాల తొలగింపును టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు స్వయంగా వినుకొండ వాసి కావడంతో సీరియస్ గా తీసుకున్నారు. దీంతో వైసీపీ ప్రయత్నాలను మొదటి నుంచి అడ్డుపడుతూ వస్తున్నారు. చివరకు ఎట్టకేలకేలకు భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దింపి శనివారం అర్థరాత్రి ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగింపును పూర్తి చేశారు.
40 విగ్రహాలు వదిలేసి ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలే ఎందుకు తొలగిస్తున్నారు
వినుకొండ పట్టణంలో రహదారులు చిన్నగా ఉన్నాయి. అయినా పట్టణంలోని పలు కూడళ్లతోపాటు, రహదారి మధ్యలో 40 విగ్రహాలు ఉన్నాయి. తాజాగా రంగా వర్థంతి సందర్భంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఓ ప్రాంతంలో కొత్తగా విగ్రహం పెట్టారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించే విగ్రహాలను వదిలేసి, ప్రజలకు ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలిగించని ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలను తొలగించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికారులు మాత్రం కొత్త భాష్యం చెబుతున్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న విగ్రహాల తొలగించవచ్చనే హైకోర్టు ఆదేశాలను అనుసరించే వినుకొండలో విగ్రహాలు తొలగిస్తున్నామంటున్నారు. అన్ని విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నారు.
కానీ ముందుగా ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగించి ఆ తరవాత సైడైపోవాలని అధికారులు భావిస్తున్నారని టీడీపీ నేతలు పసిగట్టారు. ఎలాగైనా ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగింపును అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. 15 రోజులుగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. వినుకొండ మున్సిపల్ కమిషనర్ కు పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎట్టకేలకు భారీ బలగాలను మోహరించి ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలను తొలగించారు. దీనిపై వినుకొండ టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి.
వినుకొండలో అర్థరాత్రి హైడ్రామా, 144 సెక్షన్ అమలు ?
వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగిస్తే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. ఇది గమనించిన అధికారులు ముందస్తుగా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. వినుకొండ పట్టణంలో 400 మంది ఎపీఎస్పీ బెటాలియన్ పోలీసులను రంగంలోకి దింపారు. శనివారం పగలంతా పట్టణంలో పోలీస్ పహారా కొనసాగింది. అర్థరాత్రి ఎవరినీ అనుమతించకుండా ఎన్టీఆర్, పరిటాల విగ్రహాలను తొలగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు విగ్రహాలను తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. విగ్రహాల తొలగింపులో ఎలాంటి ఉద్రిక్తలు తలెత్తకుండా ముందస్తుగా పోలీసు బలగాలను మోహరించామని వినుకొండ డీఎస్పీ వీరారెడ్డి మీడియాకు వెల్లడించారు.
విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలైంది?
వినుకొండ పట్టణంలోని ప్రధాన కూడలి మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఉంది. టీడీపీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా ఎన్టీఆర్ కు పూల మాల వేసి అక్కడి నుంచే ప్రారంభిస్తారు. సమీప ప్రాంతాల్లో ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు కూడా ఎక్కువే. ఏ కార్యక్రమం ప్రారంభించినా పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. ఇది గమనించిన వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎలాగైనా సిటీ మధ్య నుంచి ఎన్టీఆర్ విగ్రహం తొలగించాలని భావించారట. అనుకున్నదే తడవుగా వైసీపీ పెద్దల అనుమతి, వారి అండ తీసుకుని బ్రహ్మనాయుడు పని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు వినుకొండ కమిషనర్ పూర్తి సహాయసహకారాలు అందించారని తెలుస్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, టీడీపీ శ్రేణుల నుంచి ప్రతిఘటన ఎదురైనా 15 రోజులుగా పట్టువదలకుండా, శనివారం అర్థరాత్రి పని పూర్తి చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. నేడు వినుకొండ, రేపు ఎక్కడి విగ్రహాలు తొలగిస్తారోనని టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి.











