జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.ప్రభుత్వం కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిధులు మళ్లించడాన్ని తప్పుబట్టింది. ఎస్డీఆర్ఎఫ్ నిధులను తిరిగి ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేస్తామని స్పష్టం చేసింది.రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించే సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభత్వ న్యాయవాది కొరడంతో విచారణను ఈ నెల 13 వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ నాగరత్న ధర్మాసనం.
ఏపీ ప్రభుత్వం ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులు దారి మళ్లించడం పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత ప్రభుత్వ చర్యను న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యవసాయ శాఖ పిడి ఖాతాలకు మళ్లించిన నిధులను తిరిగి వెంటనే జమ చేయాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.ఎస్.డి.ఆర్.ఎఫ్ దారి మళ్లించరాదని కోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో కోవిడ్ నాలుగో వేవ్ వస్తే ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కరోనా నియంత్రణకు వినియోగించాల్సిన నిధులలో దాదాపు 1100 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని టిడిపి నేత పల్లా శ్రీనివాస్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సమందహించి కాగ్ సమర్పించిన అఫిడవిట్ ను న్యాయస్థానం పరిశీలించింది. కరువు నేపధ్యంలో ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులను వ్యవసాయ కమీషనరేట్ వ్యతిగత డెపాజిట్ ఖాతాలకు బదలాయించారని, ఈ నిధులతో కరోనాకు సంబంధం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
కాగా, ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులను ఏ అవసరాలకు వినియోగించాలో వాటికే వినియోగించాలని, కరువు కోసం అని చెప్పి ఆ నిధులను ఇతర అవసరాల కోసం వినియోగించడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆ నిధులు తాత్కాలికంగానే బదిలీ చేశారు కాబట్టి, తక్షణమే ఆ నిధులను తిరిగి జమచేయాలని ఆదేశించింది. ఈ అంశం పై తామే ఉత్తర్వులను జారీ చేతశామని ధర్మాసనం స్పష్టం చేసింది.
కరోనా నాలుగో వేవ్ వస్తే ఏం చేస్తారు ? నిధుల మాట ఏమిటి ? నిధులు లేకపోతే పరిస్థితి ఎలా చక్కదిద్దుతారు ? అసలు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాడిని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. అలాగే కరువు కోసం నిధులు బదలాయించిన ప్రభుత్వం ఆ నిధులను ఎక్కడా వినియోగించలేదు. తాత్కాలికంగా బదలాయించినా, ఎలా చేసినా ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులు తిరిగి ఎస్.డి.ఆర్.ఎఫ్ ఖాతాల్లోకి తిరిగి రావాల్సిందే అని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఒకవేళ ఇతర రాష్ట్రాలు కూడా ఇదే పద్దతిని అవలంభిస్తే పరిస్థితి ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. భవిష్యత్తులో అవసరం అయితే ఉపయోగించుకోండి కానీ ఇప్పుడైతే నిధులను తిరిగి ఎస్.డి.ఆర్.ఎఫ్ ఖాతాల్లోకి తిరిగి జమ చేయాల్సిందే అని ధర్మాసనం సూచించింది.
ఇదిలా ఉంటే ఇదే అంశం పై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. కాగా, అవసరం లేదని, ఈ మేరకు తామే ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ప్రభుత్వాన్ని సంప్రదించే సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది పదే పదే కోరడంతో ధర్మాసనం విచారణను ఈనెల 13 వ తేదీకి వాయిదా వేసింది.
అదేవిధంగా ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంగించిందని , కానీ నిధుల మళ్లింపు జరగలేదని కేంద్ర ప్రభత్వం తరఫున అదనపు సొలసిటల్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు.అంతేకాకుండా బదిలీ చేసిన నిధులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ వసూలు చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.