మలయాళ చిత్ర సీమలో పోలీస్ వేషాలకు ఒక బ్రాండ్ ను సెట్ చేసిన యాక్షన్ హీరో సురేష్ గోపీ. ముఖ్యంగా నైంటీస్ లో ఆయన చేసిన పోలీస్ వేషాలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో కొన్ని తెలుగులోకి కూడా అనువాదం అయ్యాయి. మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో ఆయన. 2015లో ‘మైగాడ్’ అనే సినిమా చేసిన తర్వాత సురేష్ గోపీ .. తన సినీ కెరీర్ కు 5 ఏళ్ళు గ్యాపిచ్చాడు. అదే ఏడాది ‘ఐ’ తమిళ మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఈ ఏడాది ఆయన ‘వరణే ఆవశ్యముండు’ అనే మూవీతో మాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి సక్సెస్ అయింది.
ఇకపై సురేశ్ గోపీ వరుసగా మల్లూ తెరపై యాక్షన్ చిత్రాలతో విరుచుకు పడడానికి డిసైడయ్యాడట. అందులోనూ తన వయసుకు తగిన పాత్రలతో అభిమానుల్ని అలరించనున్నాడు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం ‘కావల్’ అనే మూవీలో నటిస్తున్నాడు. దాంతో పాటు గా సురేష్ గోపీ మరో సినిమాకి కమిట్ అవుతున్నాడు. సినిమా పేరు ‘ఒట్టకొంబన్’. మ్యాథ్యూ థామస్ ప్లామూట్టీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. సురేష్ గోపీకి ఇది 250వ సినిమా కానుండడం విశేషంగా మారింది.
నిజానికి ఇదే కథతో పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా.. ‘కడువ’ అనే మూవీ తెరకెక్కుతోంది. కథ దగ్గర ఇద్దరు మేకర్స్ కు లీగల్ ఇష్యూస్ మొదలయ్యాయి. కడువ నిర్మాతలు కోర్టుకెళ్ళారు. హైకోర్ట్ ఈ సినిమా విషయంలో స్టే ఇచ్చింది. కథలోనూ, పాత్రల్లోనూ మార్పులు సూచించింది. దాంతో సురేష్ గోపీ ఫ్యాన్ వార్ కు చెక్ పెట్టే విధంగా తన కథలో మార్పులు చేయమని మేకర్స్ ను కోరాడట. ఇటీవల ‘ఒట్టకొంబన్’ సినిమాకి సంబంధించిన టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. పవర్ ఫుల్ పాత్రలో ఇందులో సురేష్ గోపీ కనిపించబోతున్నాడు. మరి 250వ సినిమా సురేష్ గోపీకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.