తిరుమల వేంకటేశ్వరుడు కొలువు తీరిన తిరుమల గిరుల చుట్టూతా ఉండే శేషాచలం అడవుల్లో విస్తారంగా పెరిగే ఎర్రచందనం అడ్డూ అదుపూ లేకుండా స్మగ్లింగ్ అవుతూనే ఉంటుంది. ఇది ఇవాళ మొదలైనది కాదు.. ఇవాళ అంతమయ్యేది కూడా కాదు. ప్రభుత్వాల్లో ఎవరున్నప్పటికీ.. ఎన్ని పోలీసులు దాడులు జరుగుతున్నప్పటికీ.. వందల సంఖ్యలో వాహనాలు సీజ్ అవుతున్నప్పటికీ.. అంతకు మించిన సంఖ్యలో వ్యక్తులు (ప్రధానంగా తమిళ స్మగ్లర్లుగా మనం వ్యవహరించే వారు) అరెస్టు అవుతున్నప్పటికీ.. స్మగ్లింగ్ కార్యకలాపాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
అయితే తాజాగా ఎర్రచందనం స్మగ్లర్లు వెళుతున్న వాహనాన్ని ఒక నకిలీ పోలీసుల ముఠా వెంటాడడం, నిజం పోలీసులే అనుకుని.. వారిని తప్పించుకునే ప్రయత్నంలో స్మగ్లర్ల వాహనం వేగంగా వెళుతూ.. అదుపు తప్పి టిప్పర్ను ఢీకొనడం ఆ ప్రమాదంలో నలుగురు దారుణంగా మరణించడంతో అందరి దృష్టి మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ వైపు మళ్లింది.
అసలేం జరిగింది..
కడపజిల్లా పరిధిలోకి వచ్చే అడవుల్లో ఎర్రచందనం నరిగిన స్మగ్లర్లు స్కార్పియో వాహనంలో వెళుతుండగా.. వల్లూరు మండలం గోటూరు వద్ద వెనుకనుంచి ఇటియోస్ కారులో కొందరు వెంటపడ్డారు. వారు పోలీసులు అని భావించిన స్కార్పియోలోని స్మగ్లర్లు వేగంగా నడుపుతూ.. అదుపు తప్పి.. టిప్పర్ ను ఢీకొన్నిరు. అది కూడా నేరుగా టిప్పర్ డీజిల్ ట్యాంకర్నే ఢీకొనడంతో మంటలు రేగి స్కార్పియో దారుణంగా దగ్ధమైంది. అందులో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే గుర్తు పట్టలేని విధంగా కాలిపోయారు. మరొకవ్యక్తి ఆస్పత్రిలో మరణించాడు. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. అందులో 18 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు గమనించారు.
అయితే ఈలోగా వారిని వెంబడించిన ముఠా కారు కూడా వచ్చి వారిని ఢీకొంది. ఆ కారులోని వారు పరారవగా ఒకరు మాత్రం పోలీసులకు దొరికాడు. ఇటియోస్ కారులో వెంబడించిన వారు నకిలీ పోలీసులుగా గుర్తించారు. వాళ్లు నిజం పోలీసులే అని భ్రమించి.. పారిపోయే ప్రయత్నంలోనే ప్రమాదం జరిగింది.
ఎర్రచందనం స్మగ్లర్ల ను వెంబడించిన ఇటి యోస్ కారు పెండ్లిమర్రి మండలానికి చెందిన ఒక వ్యక్తికి చెందినది గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇటి యోస్ కారులోని వ్యక్తులు పారిపోయినట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఒకే ఘటనలో రెండు నేరాలు..
జరిగింది ఒకటే దుర్ఘటన.. పోయింది అయిదు నిండు ప్రాణాలు.. కానీ రెండు నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి- ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే.. రెండు- నకిలీ పోలీసుల రూపంలో వారిని వెంబడించి వసూళ్ల దందా నడిపించే వ్యక్తులు. ఎర్రచందనం దొంగలు దొరికిన ప్రతిసారీ ఒకటో తరహా నేరం బయటపడుతూనే ఉంటుంది. దొరకని సందర్భాల్లో.. రెండో తరహా నేరాలు ఎన్నెన్ని గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయో ఎవరికీ తెలియదు. వాహనం దొరికింది.. దాన్ని బట్టి.. అసలు నకిలీ పోలీసుల అవతారమెత్తి ఇలా ఎర్రచందనం దొంగలనుంచి దందాలు చేస్తున్న వారెవరో పోలీసులు రాబట్టాలి.
ఈ స్మగ్లింగ్ ఆగదా?
ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది.. చిత్తూరు, కడప ప్రాంతాలకు చెందిన పోలీసుల, అటవీ అధికారుల అసమర్థతకు, లాలూచీ వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనంగా మనకు అనిపించే వ్యవహారం. స్మగ్లర్లు దొరికినట్టు, అరెస్టులు జరిగినట్టు, దుంగలు స్వాధీనం అయినట్టు, వాహనాలు సీజ్ చేసినట్టు ప్రతిరోజూ వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ స్మగ్లింగ్ ఆగినట్టు మాత్రం కనిపించదు. ఎందుకంటే.. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా సరే.. వారి అండదండలు స్మగ్లర్లకు ఉంటున్నాయనే భావన ప్రజల్లో ఉంది. ఎర్రచందనం స్మగ్లర్లకు ఆశ్రయం ఇస్తూ.. అండగా ఉంటూ.. కోట్లకు పడగలెత్తిన నాయకులు కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు వీటిని సమర్థంగా అరికట్టిన దాఖలాలు మాత్రం లేవు.
అసలు స్మగ్లర్లలో భయం ఉండదా?
ఇటీవలి ఘటనల్ని పరిశీలిస్తే.. అసలు పోలీసు దాడులు స్మగ్లర్లలో కించిత్ మార్పు కూడా తేలేకపోతున్నాయా అనే అనుమానం కలుగుతుంది.
శుక్రవారం నాడు తలకోన శేషాచల అటవీ ప్రాంతంలోని కాటుకాకనుమ వద్ద టాస్క్ ఫోర్స్ కూంబింగ్లో ఉండగా, సుమారు 50 స్మగ్లర్లు తారసపడ్డారు. నలుగురు తమిళనాడు వాసులను అరెస్ట్ చేసి 46 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
గురువారం నాడు.. యర్రావారిపాళ్యం మండలం శేషాచల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారుల కూంబింగ్ చేస్తుండగా.. ఇదే తలకోన సమీపంలోని నల్లమంద వద్ద 30 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారులను చూసి తమిళ స్మగ్లర్లు పారిపోగా.. 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అదే గురువారం నాడు.. కడప ఓబులవారిపల్లె మండలం వై కోట అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారుల తనిఖీల్లో నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు చేశారు.
అదే రోజున- నెల్లూరు జిల్లాలో 3 కోట్ల విలువ చేసే ఎర్రచందనం పట్టుకున్నారు. ఆత్మకూరులోని నెల్లూరుపాలెం చెక్ పోస్టు వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 194 ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. లారీనీ వదిలేసి డ్రైవర్, క్లీనర్ పారిపోయారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం పట్టుబడింది.
.. ఈ వరుస ఘటనలు చూస్తేనే.. అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఎంత విచ్చలవిడిగా జరుగుతోందో తెలుస్తుంది. ఇవి బయటపడిన ఘటనలు మాత్రమే. అసలు చిక్కకుండా.. ఎంత విశృంఖలంగా స్మగ్లింగ్ జరుగుతోందో తెలియదు. స్మగ్లింగ్ను అరికట్టడం మాత్రమే కాదు. వారిని బెదిరించి సొమ్ము చేసుకునే నకిలీ పోలీసుల కతలు కూడా నిగ్గు తేల్చాలి. సోమవారం ఉదయం జరిగిన ఘోరప్రమాదం నేర్పుతున్న పాఠం ఇది.
వెనక ఉన్న వారెవ్వరు?
ఎప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ పట్టుబడినా తమిళనాడు స్మగ్లర్లు అనే మాటే మీడియాలో వస్తుంటుంది. నిజానికి వారు స్మగ్లర్లు కాదు. కూలీలు. తమిళనాడు కూలీలు మాత్రమే ఎందుకు దొరుకుతున్నారు. అసలు చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో తమిళనాడు కూలీల కదలికలు కనపడగానే.. పోలీసులు ఎందుకు అలర్ట్ కాలేకపోతున్నారు. ఇవన్నీ అనుమానాలే. విషయం ఏంటంటే.. తమిళ కూలీల్ని వాడుకుని… అక్రమ దందాలను నడిపిస్తున్నది స్థానిక ప్రాంతాలకు చెందిన నాయకులే. ఆ మూలస్తంభాలను పట్టుకోగలిగితేతప్ప.. ఎప్పటికీ ఈ ఎర్రచందనం అనేది ఆగే అవకాశం లేదు.
.. సురేష్ పిళ్లె











