అత్యంత పవిత్ర ప్రదేశమైన తిరుమలలో ఎంతో పుణ్యంగా భావించే శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని కల్తీ చేసి గత పాలకులు ఎంతో పెద్ద పాపం చేశారు. ఆ కల్తీ కూడా సరిదిద్దుకోలేని స్థాయిలో పాల్పడ్డారు. దైవ సమానంగా భావించే తిరుమల లడ్డూలో వాడే స్వచ్చమైన ఆవు నెయ్యిలో జంతు కొవ్వులతో కూడిన నూనెను కలిపి భారీ తప్పిదం చేశారు. ఆ పాపం అంత త్వరగా కడిగేసుకొనేది కాదు. అయినా తిరుమల దేవస్థానం పాప ప్రక్షాళన చర్యలకు దిగింది. తిరుమలతో పాటుగా రాష్ట్రంలోని అన్నవరం, తదితర ప్రముఖ ఆలయాల్లో కూడా ప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రతను పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల ఆలయంలో ప్రత్యేక హోమాలను నిర్వహించారు. అక్కడి బంగారు బావి వద్ద ఉన్న యాగశాలలో శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ పండితులు నిర్వహించారు. వైఖానస ఆగమోక్తంగా ప్రక్రియ ముగిశాక ఈఓ శ్యామలరావు, అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి విలేకరులతో మాట్లాడారు. శ్రీవారి ఆలయంలో ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల ప్రోక్షణ నిర్వహించారని ఆయన వెల్లడించారు. శాంతి హోమం విజయవంతం అయినందున భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై ఉన్న భయాలు, అపోహలను విడనాడవచ్చని చెప్పారు.
ఆ తర్వాత ఆలయం బయట ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహా మండలి అధ్యక్షుడు మోహన రంగాచార్యులు మీడియాతో మాట్లాడారు. యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తుహోమం, కుంభ ప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఆయన తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి నైవేద్యం సమర్పించామని అన్నారు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, జేఈవో, ప్రధానార్చకులు, ఆగమ సలహాదారులు కలిసి హోమం అనంతరం పవిత్ర జల కలశంతో ఆలయ పోటు, ఉగ్రాణం, లడ్డూ విక్రయ కేంద్రం, బూందీ తయారీ పోటు, నెయ్యి ట్యాంకర్లు, శ్రీవరాహస్వామి ఆలయం దగ్గర, శ్రీవారి పుష్కరిణిలోని ఆంజనేయస్వామి, శ్రీబేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రోక్షణ చేశారు.
అంతకుముందు ఈ ప్రాంతాల్లో వాస్తుధూపం వేశారు. సాయంత్రం ఆరు గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంట్లో దీపారాధన చేసే సమయంలో క్షమా మంత్రాలైన ‘ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ’ను పఠించాలని.. తద్వారా శ్రీవారి అనుగ్రహం పొందాలని పండితులు సూచించారు. తిరుమల పెద్ద, చిన్న జీయంగార్లు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధానార్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.