శివపుత్రుడు, అపరిచితుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వ్యక్తి హీరో విక్రమ్.సహజసిద్ధమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విక్రమ్ కు తమిళంలోనే కాదు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. నిర్విరామమైన కృషితో స్టార్ హీరోగా ఎదిగిన విక్రమ్ కు తన కెరీర్ లో సక్సెస్ ను అందుకోవడానికి 20 ఏళ్లు పట్టింది.శివపుత్రుడు చిత్రంలో తన విలక్షణమైన నటనకు గానూ విక్రమ్ కు నేషనల్ అవార్డు కూడా దక్కింది. కాగా, విక్రమ్ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటి విక్రమ్ కు సంబంధించిన ఓ వార్తా ఇప్పుడు ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.
తమిళ స్టార్ హీరో విక్రమ్ ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యారు. ఎక్సర్సైజ్ చేసి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో విక్రమ్ కు గుండెపోటు వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయనను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కావేరీ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే కరోనా బారిన పడిన విక్రమ్ దాని నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ప్రస్తుతం విక్రమ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చెన్నైలో జరగనుంది. ఈ కార్యక్రమానికి విక్రమ్ కూడా హాజరు కావాల్సిఉండగా, ఆయన గుండెపోటుకు గురి కావడం కలకలం రేపుతోంది.