వైసీపీ గౌరవాద్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేయబోతున్నారన్న అంశం గత కొంతకాలంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. వైసీపీ ప్లీనరీ వేదికగా ఈ ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది.నాటకీయ పరిణామాల మధ్య విజయమ్మ ఎట్టకేలకు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నానని పార్టీ సభ్యత్వం నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
కొంతకాలంగా జగన్ కు విజయమ్మకు పొసగడం లేదనే ప్రచారం జరుగుతూ ఉంది. అందుకే ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లోనే నెలకొంది. ఈ క్రమంలో ఆమె వైసీపీ ప్లీనరీకి వస్తారా, లేదా అనే అనుమానాలు ఆ పార్టీ నాయకుల్లో నెలకొనగా, రాజకీయ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే ఇడుపులపాయలో వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న విజయమ్మ అక్కడ నుంచి నేరుగా గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు.ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన విజయమ్మ ప్లీనరీ సమావేశాలు వేదికగా పార్టీలో తన గౌరవాద్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో తన బిడ్డ షర్మిల ఒంటరిగా పోరాటం చేస్తోందని, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని విజయమ్మ తెలిపారు. అయితే తల్లిగా జగన్కు ఎప్పుడూ మద్దతుగానే ఉంటానని విజయలక్ష్మి స్పష్టం చేశారు.ప్రస్తుతం జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలో ఉన్నారని, తాను రెండు పార్టీల్లోనూ కొనసాగడం సరికాదని అనుకుంటున్నానని.. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నానని విజయమ్మ పేర్కొన్నారు. వక్రీకరణ, విమర్శలకు తావులేకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నానన్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను అనుకోలేదని.. వైసీపీ అభిమానులు తనను క్షమించాలని ఆమె కోరారు.
అదేసమయంలో జగన్, షర్మిల లకు తాను ఎల్లప్పుడూ అండగా ఉన్నానని విజయలక్ష్మి తెలిపారు. ఏపీలో తన సోదరుడు జగన్కు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసిందని విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందించడానికే షర్మిల పోరాటం చేస్తోందని విజయమ్మ అన్నారు. ఆమెకు అండగా ఉండేందుకు తాను వైసీపీకి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని విజయమ్మ స్పష్టం చేశారు.