తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ కొత్త సారధులను ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కింజరావు అచ్చెన్నాయుడు, తెలంగాణకు ఎల్.రమణను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నారా లోకేష్ కు అవకాశం దక్కింది. ఇక పొలిట్ బ్యూర్యోలో సీనియర్ నేతలకు, బీసీలకు పెద్దపీట వేశారు. యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలకు చోటు దక్కింది. వీరితో పాటు బోండా ఉమ, ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, అనిత, సంధ్యారాణి, అరవింద్ కుమార్ గౌడ్ లకు కొత్తగా చోటు దక్కింది.
వీరికి ప్రమోషన్
ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేసిన గల్లా అరుణకుమారికి పార్టీ కేంద్ర ఉపాధ్యక్ష పదవి దక్కింది. ప్రతిభా భారతి, డీకే సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మచ్చా నాగేశ్వరరావు, చిలువేని కాశీనాథ్ లను కేంద్ర పార్టీ ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించారు.
మాట్లాడేది వీరే
టీడీపీ స్పోక్స్ పర్సన్ లుగా దీపక్ రెడ్డి, కొమ్మారెడ్డి పట్టాభి, మహ్మద్ నసీర్, ప్రేమ్ కుమార్ జైన్, టి.జ్యోత్స్న. నర్శిరెడ్డి, పరుచూరి అశోక్ బాబులను నియమించారు.
తెలుగు యవతకు ఎవరూ దొరకలేదా?
టీడీపీలో దాదాపు అన్నీ పదవులను భర్తీ చేసిన పార్టీ అధినేత తెలుగుయువత అధ్యక్షుడి పదవి మాత్రం ఎవరికీ కట్టబెట్టలేదు. సరైన అభ్యర్థి దొరకలేదని తెలుస్తోంది. కొన్నాళ్ల నుంచి పరిటాల శ్రీరామ్ పేరు వచ్చినా ఆయన అందుకు అంగీకరించలేదట. అందుకే ఆ పదవికి సరైన నాయకుడు దొరలేదని తెలుస్తోంది.