సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గడచిన ఏడేళ్లుగా ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయన్నా.. ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు వంటి అంశాలపై ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి కూడా అదే తరహా పరిస్థితి నెలకొంది. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా ఎంపీ పదవులకు రాజీనామాలు చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించిన టీడీపీ ఎంపీలు.. తమ మాదిరే వైసీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాజీనామాల ఊసెత్తకుండానే.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించిన వైసీపీ ఎంపీలు ఈ సమావేశాల్లో వాటి సాధన కోసం కృషి చేస్తామని ప్రకటించారు.
ఉక్కు ప్రైవేటీకరణ ఆపాల్సిందే
సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీడీపీ తరఫున కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ లు.. వైసీపీ నుంచి వేణుంబాక విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత రెండు పార్టీలకు చెందిన నేతలు వేర్వేరుగానే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు ఏమన్నారంటే.. ‘‘ప్రత్యేక హోదా, విభజన హామీలు, కొవిడ్ పరిస్థితులు, ఎంపీ లాడ్స్ నిధులపై చర్చ జరగాలని కోరాం. ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజీనామాలకు సిద్ధం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ పదవులు వదిలిసేందుకు సిద్ధం. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి రాష్ట్రం కోసం పోరాడాలి’’ అని కనకమేడల తెలిపారు.
వైసీపీ చిట్టా పెద్దదే
ఇక వైసీపీ తరఫున మీడియా ముందుకు వచ్చిన సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు.. ఎనిమిదేళ్లైనా కేంద్రం విభజన చట్టం హామీలను నెరవేర్చలేదు. తెలుగు ప్రజలందరికీ ద్రోహం చేస్తోంది. బీజేపీ పక్షపాత ధోరణి అవలంభిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలి. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రాన్ని కోరాం. బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని కోరాం. దిశ బిల్లును క్లియర్ చేయాలని కోరాం. సీఆర్డీఏ, ఏపీ ఫైబర్, రథం తగలబడ్డ అంశాలపై సీబీఐ విచారణ కోరాం.. ఫిరాయింపుల అంశంపై కేంద్రం వైఖరి సరిగాలేదు. అనర్హత పిటిషన్పై కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలను లేవనెత్తుతాం’’ అని తెలిపారు. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలకు సిద్ధమని టీడీపీ ప్రకటిస్తే.. రాజీనామా అన్న మాటే వినపడకుండా వైసీపీ నెట్టుకొచ్చేసింది.











