హైదరాబాద్ వరదలతో నగర జనం పడ్డ ఇబ్బందులు ఎవ్వరూ మరిచిపోరు. ఆ వరద ఎన్నో నష్టాలను, కష్టాలను మిగిల్చింది. కొంత మంది ఇల్లు కూలిపోతే, మరి కొంత మందివి ఇల్లులు శిథిలమయ్యాయి. పశువులు మరణించాయి. వరదల్లో మనుషులు, వాహనాలు కొట్టుకుపోయాయి. కాలనీలు నీట మునగడంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్ని కొట్టుకుపోయాయి. బియ్యం, పప్పులు, ఉప్పులు తడిచి ముద్దయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి కోలుకోవడానికి వరద బాధితులకు వారం పది రోజులే పట్టాయి. ఈక్రమంలో ప్రభుత్వం వరద బాధితులకు తక్షణ సాయం కింద ఇల్లు కూలిపోయిన వారికి రూ.లక్ష, స్వల్పంగా డ్యామేజ్ అయిన వారికి రూ.50 వేలు, బాధిత ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయంను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది మంచి విషయమే. కానీ ఆ సాయం నిజంగానే బాధితులకు అందిందా? అనేదే ఇప్పుడు చర్చ.
ప్రభుత్వం ప్రకటించిన ఈ వరద సాయమే కొన్ని రోజులుగా వివాదాస్పదం అవుతోంది. మొదటి విడత వరద సాయాన్ని కొన్ని ముంపు ప్రాంతాల్లో బాధితులకు అందజేశారు. రెండవ విడత సాయం అందజేత కూడా కొన్ని చోట్ల ప్రారంభమైంది. అనర్హులకు కూడా సాయం అందజేస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి, విపక్షాల నుంచి రావడంతో మధ్యలో రెండు మూడు రోజులు నిలిపివేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.550 కోట్ల ఆర్థిక సాయంలో ఇప్పటికే రూ.387 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారట. పైగా మరో రూ.వంద కోట్లు కావాలని సీఎంను ప్రభుత్వ పెద్దలు అడగనున్నారట.
అకౌంట్లో ఎందుకు వేయడం లేదు?
కరోనా వైరస్ దేశంలో వ్యాపించిన తురువాత అన్ని రాష్ట్రాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. తెలంగాణలో కూడా లాక్ డౌన్ దాదాపు నెల రోజుల కంటే ఎక్కువగానే అమలైంది. ఎక్కడి వారు అక్కడే ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఇళ్ల నుంచి బయటికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా నడుమ లాక్ డౌన్ అమలైన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నడుమ ప్రజలు తమ అవసారాలు తీర్చుకునేందుకు గానూ సీఎం.. ప్రతి కుటుంబానికి రూ.1500, బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. ఈ ఆర్థిక సాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఆర్థిక సాయాన్ని ఇలా రెండు, మూడు నెలలు రాష్ట్ర ప్రజలందరికీ అందజేశారు. మరీ అలాంటిది.. కేవలం రూ.1500 ఆర్థిక సాయాన్నే అప్పుడు బ్యాంకు ఖాతాలో వేసిన ప్రభుత్వం.. వరద సాయం కింద అందజేస్తున్న రూ.10వేల ఆర్థిక సాయాన్ని నేరుగా ప్రజల చేతులకు అందించడమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా ఇల్లులు కూలిపోయిన వారికి రూ.50వేలకు పైగానే అందజేస్తున్నారు. చెక్ రూపంలో కాకుండా నేరుగా నగదు రూపంలో అందజేయడపై రాజీకయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఇదే విషయంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రభుత్వంపై ఆరోపణలు కూడా చేశారు. బాధితులను గుర్తించకుండానే వరద సాయం అందజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరద సాయం అందజేయడంలో రూ.కోట్ల స్కామ్ జరిగిందనే అనుమానాలను విపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి.
ఆధార్ కార్డుకు రూ.10వేలకు లింకేంటి?
వరదల వల్ల హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలు నీటమునగలేదు. మరీ అలాంటప్పుడు నీటమునగని ప్రాంతాల్లోనూ రూ.లక్ష, రూ.50వేలు, రూ.10వేల ఆర్థిక సాయాన్ని అధికార పార్టీ నేతలు పంచుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆధార్ కార్డు ఉంటేనే రూ.10వేలు ఇస్తున్నారు. సాయం అందజేయడానికి.. ఆధార్ కార్డుకు అసలు లికేంటో జనాలకు అర్ధం కావడంలేదు. దీని వెనుకాల ఏమైనా రాజకీయ కోణం దాగుందా అనే చర్చ కూడా కొన్ని రోజులుగా జరుగుతోంది. వరదలొచ్చి కూడా చాలా రోజులే అవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలను అసలు ఏ లెక్కన అంచనా వేసి సాయం అందజేస్తున్నారో అంతుచిక్కని ప్రశ్న. కొన్ని ప్రాంతాల్లో అర్హులకు సాయం అందుతోంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అనర్హులకు కూడా సాయం అందటంతో ప్రభుత్వ ధనం వృథా కావటంలేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
లేదంటే త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతుండటంతో వరద సాయాన్ని ఎన్నికల ప్రచారానికి ఈ రకంగా వాడుకుంటున్నారో లేదో తెలియదు. ప్రజలకు ఆధార్ కార్డు, ఇక్కడ ఓటు ఉందా? అని ఎందుకు అడుగుతున్నట్లు? ఎన్నికలకు డబ్బులు పంచడం వీలవుతుందో లేదోనని, పైగా అభ్యర్థులు అప్పుడు తమ స్వంత డబ్బును ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పడైతే ఈ వరద అవకాశాన్ని తమ ఖాతాలో వాడేసుకుంటే పోలా? అనేలా అధికారపార్టీ వ్యవహరిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోపక్క వరద సాయం అందించిన వారి లెక్కలు తమ వద్ద ఉన్నాయని, అనసవర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. దాదాపు 3లక్షలకు పైగా బాధితులకు సాయం అందజేసినట్లు వెల్లడించారు. వరద సాయం పంపిణీలో జీహెచ్ఎంసీ అధికారుల పూర్తి స్థాయి భాగస్వామ్యం లేకుండా అధికార పార్టీ నేతలు పంపిణీ చేస్తుండటమేంటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
సాయం చేయాలంటూ ధర్నా..
వరద బాధితులతో కలిసి కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించారు. బాధితులకు వరద సాయం పంపిణీ చేయాలని వందల మందితో ఈ రోజు కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజలతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.