‘తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘జ్యోతి’కి మంచి గుర్తింపు ఉంది. ఒకవైపున కామెడీ టచ్ ఉన్న పాత్రలను .. మరో వైపున వ్యాంప్ తరహా పాత్రలను ఆమె పోషించింది. సాధారణంగా ఎవరైనా ఒక ఆర్టిస్ట్ పేరు వినగానే, వాళ్లు చేసిన పాత్రల్లో బాగా కనెక్ట్ అయిన పాత్ర ఒకటి కళ్లముందు కదలాడుతుంది. అలా జ్యోతి పేరు వినగానే, ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో ఆమె చేసిన ‘తిలోత్తమ’ పాత్ర గుర్తొస్తుంది. ఇక ఆ తరువాత ఆమె చేసిన ‘హంగామా’ .. ‘కెవ్వుకేక’ .. ‘ ఎవడిగోలవాడిది’ .. ‘దరువు’ సినిమాల్లోని పాత్రలు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి జ్యోతి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం .. డాన్స్ అంటే పిచ్చి. అందువలన సహజంగానే నేను నటన దిశగా అడుగులు వేశాను. నా ఆసక్తిని గమనించిన మా నాన్నగారు, నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. హీరోయిన్ అవుదామనే ఉద్దేశంతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశాను. ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాతో, ఎస్వీ కృష్ణారెడ్డిగారు నాకు అవకాశం ఇచ్చారు. హీరోయిన్ పాత్ర కాకపోయినా, ప్రాధాన్యత కలిగిన పాత్ర కావడంతో చేశాను. ఆ సినిమాలో నేను చేసిన ‘తిలోత్తమ’ పాత్ర జనంలోకి బాగా వెళ్లింది. ఆ సినిమా విజయయాత్రలో జనమందరి దృష్టి నాపైనే ఉంది. ఆ తరువాత కూడా ‘తిలోత్తమ’ పేరుతోనే జనం నన్ను గుర్తుపట్టేవారు. ఆ సినిమా నుంచి నాకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘గుడుంబా శంకర్’ సినిమాలోను మంచి రోల్ చేశాను. పవన్ కల్యాణ్ ఓ స్టార్ హీరో అని తెలుసు. కానీ ఆయనకి బయట ఏ రేంజ్ లో క్రేజ్ ఉందనేది ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు తెలియదు. అందువలన ఆ సినిమాలో చేసే ఛాన్స్ ఇప్పుడు వస్తే బాగుండునే అని అనుకుంటూ ఉంటాను. కెరియర్ ఆరంభంలోనే పవన్ సినిమాలో చేసినందుకు గర్వపడుతుంటాను. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో కొన్ని పాత్రలు సంతృప్తినిచ్చాయి. గతంలో నేను చేసిన సినిమాలు ఇప్పుడు చూస్తే, నేను ఇంకా బాగా చేయవలసిందని అనిపిస్తుంది. ‘వసంతకోకిల’లో శ్రీదేవి పోషించిన తరహా పాత్రను చేయాలనుంది. డిటెక్టివ్ తరహా పాత్రలు .. ‘సైకో’ పాత్రలు .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలపై ఆసక్తివుంది. ఇక మణిరత్నం .. శంకర్ దర్శకత్వంలోను నటించాలనే ఆశ ఉంది” అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది.
Must Read ;- సింహాచలంలో ఆ దర్శకుడి ప్రత్యేక పూజలు ఎందుకు?











