బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ ముగిసి థియేటర్లు ప్రారంభమైన నేపథ్యంలో నిర్మాతలు కూడా విడుదలకు సన్నద్ధమయ్యారు. తాజా కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం, రెస్టారెంట్లు, బార్లు, షాపులు, షాపింగ్ మాల్లు, వ్యాయామశాలలు, యోగా సెంటర్లు, సెలూన్లు లాంటివన్నీ ప్రారంభయ్యాయి. కోవిడ్ తగ్గిపోయిందని అందరూ ఊపరిపీల్చుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి థియేటర్లను తెరవడానికి అంగీకారం తెలిపింది.
కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలు ఉండటంతో మళ్లీ ప్రభుత్వం థియేటర్ల ప్రారంభానికి వెనకడుగు వేస్తోందన్న వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకూ అన్నీ తెరచి ఉంటున్నాయి. ‘బెల్ బాటమ్’ చిత్రాన్ని ఆగస్టు 19న విడుదల చేయాలని నిర్ణయించారు. ఆమేరకు థియేటర్లను కూడా బుక్ చేశారు. సాధారణంగా ఏ హిందీ సినిమా అయినా దాని లాభాలు మహారాష్ట్ర నుంచే 30 శాతం వస్తాయి. మరి అనుకున్న ప్రకారం ఆగస్టు 19న ‘బెల్ బాటమ్’ విడుదల ఉంటుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి.
ఒకటి రెండు వారాలు విడుదల వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల థియేటర్లు ప్రారంభం కాకపోతే సెప్టెంబరు 1 నుంచి ప్రారంభం కావచ్చు. మరి అప్పుడు రిలీజ్ చేసే విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అమితాబ్, ఇమ్రాన్ హష్మి నటించిన ‘చెహ్రే’ సినిమా కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. ‘చెహ్రే’ సినిమాని ఈ నెల 27న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇది కూడా వాయిదా పడవచ్చు. బెల్ బాటమ్ సినిమా మీద అక్షయ్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమా ట్రైలర్ ప్రారంభం కోసం ఢిల్లీలోని సినిమా థియేటర్ కు కూడా వెళ్లారు. రంజిత్ తివారీ దర్శకత్వంలో ఈ బెల్ బాటమ్ రూపొందింది. ఇందులో అక్షయ్ రా ఏజెంట్ పాత్రను పోషించారు. ఇందులో ఇంకా హ్యూమా ఖురేషి, వాణి కపూర్, లారా దత్తా, ఆదిల్ హుస్సేన్ తదితరులు నటించారు. 1980లో జరిగిన విమానం హైజాక్ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కాకపోతే మాత్రం అక్షయ్ అభిమానులకు నిరాశ కలిగించే వార్తే.