ఉత్తరాఖండ్ రాజకీయాలు ఎప్పుడూ అస్థిరమే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంతే. ఈ మాట ముమ్మాటికీ నిజమేనన్నట్లుగా… ఇప్పుడు కేవలం నాలుగంటే నాలుగు నెలల వ్యవధిలోనే ఆ రాష్ట్రానికి ముగ్గురు సీఎంలు పదవీ బాధ్యతలు చేపట్టారు. అంటే… నాలుగు నెలల వ్యవధిలో సీఎం కుర్చీలో ముగ్గురు నేతలు మారారన్న మాట. సాధారణంగా ఏ రాష్ట్రానికైనా ఐదేళ్ల కాల పరిమితితోనే సీఎం ఎంపిక జరుగుతుంది. అయితే రాజకీయ అస్థిరతలు కొన్ని రాష్ట్రాల్లో ఐదేళ్ల పాటు ఒకే సీఎం సాధ్యం కావడం లేదు. ఏళ్ల మాటేమిటి? నెలలకే సీఎంలు మారిపోతున్న పరిస్థితి. ఈ తరహా పరిస్థితికి ఉత్తరాఖండ్ నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ ఏడాది ఆరంభం నుంచే అలజడి
ఉత్తరాఖండ్ అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరగగా… ఈ ఏడాది మార్చి దాకా రాజకీయంగా ఓ మాదిరి స్థిరత్వమే కనిపించింది. అయితే ఈ ఏడాది మార్చిలో అధికార పార్టీగా ఉన్న బీజేపీలో రేగిన అసమ్మతి కారణంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటిదాకా సీఎంగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ మార్చిలో సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో త్రివేంద్రకు సరితూగగల ఎమ్మెల్యే ఎవరూ కనిపించని నేపథ్యంలో ఎంపీగా ఉన్న తీరథ్ సింగ్ రావత్ ను బీజేపీ అధిష్ఠానం సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. తీరథ్ ను సీఎంగా కూర్చోబెట్టిన బీజేపీ… ఆయనకు అసెంబ్లీ సభ్యత్వం దక్కేలా చూడటంలో మాత్రం ఆసక్తి చూపలేదు. వెరసి శుక్రవారం నాడు అనూహ్య పరిస్థితుల్లో తీరథ్ సీఎం పదవికి రాజీనామా చేసేశారు.
పుష్కర్ అయినా ఎన్నికల దాకా నిలబడతారా?
ఇంకేముంది… బీజేపీ అధిష్ఠానం తన ప్రతినిధి బృందాన్ని డెహ్రాడూన్ కు హుటాహుటీన పంపింది. బీజేపీ సీనియర్ నేత, మన తెలుగు నేత దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలో అక్కడికి వెళ్లిన బీజేపీ బృందం… ఉత్తరాఖండ్ బీజేఎల్పీ భేటీని నిర్వహించింది. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను క్రోడీకరించి… తీరథ్ స్థానంలో పుష్కర్ సింగ్ ధామిని కొత్త సీఎంగా ఎంపిక చేసింది. వెరసి నాలుగు నెలల్లో ఉత్తరాఖండ్ కు మూడో సీఎంగా పుష్కర్ త్వరలోనే బాధ్యతలు చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అంటే… హీనపక్షం ఇంకో 8 నెలల సమయం ఉంది. ఈ 8 నెలలైనా పుష్కర్ సింగ్ ను మారకుండా ఉంటారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి.










