ఇక నుంచి ప్లేట్ ఇడ్లీ కేవలం రూ.7.50 మాత్రమే. ఇంతకు ఇది ఎక్కడో తెలుసా..? తిరుమలలో… అవును, నిజమే తిరుమలలో ఇక నుంచి ప్లేట్ ఇడ్లీ ధర కేవలం రూ.7.50 మాత్రమే అని దేవాదాయశాఖ వెల్లడించింది. ప్రైవేట్ హోటళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇష్టారీతిన వసూళ్లు
తిరుమల కొండ పై టిఫిన్ లకు, భోజనానికి ప్రైవేట్ హోటళ్లు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తుండడంతో కొందరు భక్తులు ఈ విషయాన్ని దేవాదాయశాఖ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై స్పందించిన దేవాదాయశాఖ ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. తమ విచారణలో ప్రైవేట్ హోటళ్లు వాటి ఇష్టారీతిన వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో దేవాదాయశాఖ అడ్డగోలుగా డబ్బులు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ హోటళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి ప్లేట్ ఇడ్లీ రూ.7.50, ప్లేట్ మీల్స్ రూ.22.50 లుగా మాత్రమే ఉండాలని ధరలు నిర్ణయించింది. ఎక్కువ ధరలకు విక్రయిస్తే 18004254141కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
తిరుమలలో ఉచిత అన్నదాన సత్రాల గురించి అధికారులు భక్తులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది భక్తులకు వాటి టైమింగ్స్ తెలియకపోవడం వలన వాటిని సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. ప్రైవేట్ హోటళ్లను సందర్శిస్తే వారు తమకు తోచిన రీతిలో దోచేసుకుంటున్నారు.