ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఎంతో భవిష్యత్ ఉన్న యువతీయువకులు సమస్యని ఎదుర్కోలేక చావు పరిష్కారం అనుకుంటున్నారు. ఉద్యోగ సమస్యలు, ఆర్ధిక సమస్యలు భరించలేకపోవడం ఓ వైపు కారణాలైతే, మరో వైపు రిలేషన్స్ లో ఏర్పడే గందరగోళం అధిక శాతం ఆత్మహత్యలకు కారణమవుతోంది. తాజాగా తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి సెప్టెంబరు 8వ రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లాకి చెందిన శ్రావణి ఎనిమిదేళ్ళ క్రితం నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చింది.
క్రమంగా టీవీ సీరియల్ నటి అయింది.
‘మనసు – మమత ‘ , ‘ మౌన రాగం ‘ సీరియల్స్ తో పాపులర్ అయింది . ఆరు నెలల క్రితం ‘ టిక్- టాక్’ ద్వారా పరిచయమైన దేవరాజ్ రెడ్డితో స్నేహం కలిగింది. కొంతకాలం పాటు శ్రావణి – దేవరాజ్ రెడ్డిని తమ ఇంటిలోనే ఉంచుకున్నట్లు శ్రావణి తమ్ముడు శివ అనే వ్యక్తి టీవీ చానెల్స్ లో చెబుతున్నాడు. దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తి తనకి తల్లిదండ్రులు ఎవరూ లేరని, హైదరాబాద్ లో హాస్టల్ లో ఉండలేనని అంటే శ్రావణి అతడిని నెల రోజుల పాటు తన ఇంటిలోనే ఉండే అవకాశం కల్పించింది.
ఆ సమయంలో శ్రావణి నిద్ర పోతున్నప్పుడు ఆమె ఫింగర్ ప్రింట్స్ తీసుకుని శ్రావణి పర్సనల్ ఫోన్ దేవరాజ్ ఓపెన్ చేశాడని, శ్రావణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రావణి ఫోన్ నుంచి ఆమె పర్సనల్ వీడియోలు తన ఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ అయ్యేలా దేవరాజ్ చేసుకున్నాడని శ్రావణి తమ్ముడు శివ అంటున్నాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని, శ్రావణిని దేవరాజ్ బ్లాక్ మెయిల్ చేశాడని, అతనికి లక్ష రూపాయిలు ఇచ్చామనేది శివ వాదన. అయినా దేవరాజ్ వదలకుండా బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఎస్ . ఆర్. నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని శ్రావణి కుటుంబ సభ్యులు చెబుతున్నారు .
అతని వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుందని శ్రావణి కుటుంబం ఆరోపిస్తుంది. దేవరాజ్ ఈ కబురు తెలిసి గుంటూరు పారిపోయాడని, ఆతన్ని పట్టుకుని ఉరి శిక్ష విధిచాంలని శ్రావణి తల్లి రోదిస్తూ టీవీలో కోరారు.
ఇదిలా ఉండగా శ్రావణి ఆత్మహత్యకి కారకుడయ్యాడన్న దేవరాజ్ రెడ్డి టీవీ ఛానెల్స్ ముందుకు వచ్చి తన వెర్షన్ వినిపిస్తున్నాడు. తాను, శ్రావణి ప్రేమించుకున్నామని, తన మీద కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఎస్ . ఆర్. నగర్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టారని దేవరాజ్ అంటున్నాడు. ఏ నాడూ తాను శ్రావణి దగ్గర డబ్బులు తీసుకోలేదని, ఒక పార్టీ ఖర్చుల నిమిత్తం రూ. 30 వేలు తన అకౌంట్ లోకి ట్రాన్సఫర్ చేసిందని , అది తప్ప తమ మధ్య ఎటువంటి నగదు లావాదేవీలు జరగలేదని దేవరాజ్ చెబుతున్నాడు.
మూడు రోజుల క్రితం శ్రీ కన్య హోటల్ లో తాను – శ్రావణి కలిసి మాట్లాడుకున్నామని , ఈ లోగా సాయి అనే వ్యక్తి వచ్చి, శ్రావణి ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడని దేవరాజ్ ఆరోపిస్తున్నారు. గతంలోనే తాను శ్రావణిని ఎందుకు దొంగ కేసు పెట్టావని అడిగానని , లాయర్ కేసు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఆలా పెట్టాలన్నారని చెప్పింది. తన ఫోన్ అప్పుడే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని దేవరాజ్ చెప్పారు.
శ్రావణి ఆత్మహత్యకి తాను కారణం కాదని సాయి అనే వ్యక్తి నలుగురిలో అవమానించి, కొట్టాడని అతను, శ్రావణి కుటుంబ సభ్యులు హింసించడం వల్లనే శ్రావణి ఆత్మ హత్య చేసుకుందని దేవరాజ్ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి శ్రావణి చివరిసారిగా తనతో మాట్లాడిన ఆడియో టేప్ రిలీజ్ చేశారు దేవరాజ్. అందులో తన చావుకి కారణం సాయి అని శ్రావణి చెప్పడం అనుమానాలను కలిగిస్తోంది . ప్రియుడు కారణమైనా, కుటుంబ సభ్యులు కారణమైనా ఒక ఆడ పిల్ల జీవితం మాత్రం విషాదంగా ముగిసింది.