ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తున్న నేపథ్యంలో నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. రానున్న కాలంలో కొవిడ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాంతకం కావచ్చని చెబుతున్నారు. పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, మంచి ఆహారం, సమయానుకూలంగా వైద్య సేవలు పొందడం, మనోధైర్యం,వ్యాయామం లాంటి చర్యలతోనే కరోనా నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.తాజాగా ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చేసిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రానున్న కాలంలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతూనే అవసరం లేకున్నా, తక్కువ లక్షణాలు ఉన్నవారికి కూడా సిటీ స్కాన్ చేయిస్తున్నారని, దీనివల్ల కాన్సర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అవసరమైతే తప్ప సీటీ స్కాన్ చేయించుకోకూడదని వ్యాఖ్యానించారు. సీటీ స్కాన్ 300 ఛాతీ ఎక్స్రేలకు సమానమని, అది చాలా ప్రమాదమని వ్యాఖ్యానించారు. దీంతో పాటు కరోనా వైరస్ లో మార్పులే సెకండ్ వేవ్ తీవ్రత పెరిగేందుకు కారణమైందని,థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందన్నారు.కొన్ని రకాల స్ట్రెయిన్లు రోగనిరోధక వ్యవస్థకు చిక్కడం లేదు, ఇలాంటి స్ట్రెయిన్లతో మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్నారు. దేశంలో కనీసం 2 వారాల పాటు కఠినమైన లాక్డౌన్తోపాటు సామాజిక దూరం,అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండడం మాత్రమే మార్గాలని వ్యాఖ్యానించారు. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లతో ప్రయోజనం లేదన్నారు.
వాషింగ్టన్ యూనివర్సిటీ హెచ్చరికలు..
భారత్లో కొవిడ్ వ్యాప్తికి సంబంధించి రాబోయే 2 వారాల్లో మరింత విరుచుకుపడే సూచనలున్నాయని, కేసుల పెరుగుదల ఇలాగే కొనసాగితే జూన్ 11 నాటికి 404,000 మరణాలు సంభవిస్తాయని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం అంచనా వేసింది.దీంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇన్స్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా వేసినట్లు కథనాలు వస్తున్నాయి.జులై నాటికి ఊహించని స్థాయిలో మరణాలు ఉంటాయని అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికాలో 5,78,000 మరణాలు నమోదు కాగా భారత్లో మొత్తం 2.22లక్షల మరణాలు చోటుచేసుకున్నాయి. ఆరు నుంచి 8వారాల అంచనాతో ఈ లెక్కలు వేసినట్టు జర్నల్స్ వెల్లడిస్తున్నాయి.
ముందు జాగ్రత్తలతోనే..
కాగా నిర్లక్ష్యం,అజాగ్రత్తలతోనే చాలావరకు వైరస్ వ్యాప్తి చెందుతోందన్న అంచనాలున్నాయి. అదే సమయంలో చివరి నిమిషం వరకు గుర్తించలేక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లడం, భయంతో హార్ట్ ఎటాక్ రావడం లాంటి కారణాలూ ఉన్నాయని అంచనా.ఈ పరిస్థితుల నేపథ్యంలో స్వచ్ఛంద లాక్ డౌన్, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం, ఫంక్షన్లు లేదా జనసమర్థ ప్రదేశాల్లోకి వెళ్లకపోవడం, సామాజిక దూరం పాటించడం, వ్యాయామం, పౌష్టికాహారం, శరీరంలో విటమిన్లు, రోగ నిరోధక శక్తి పెరిగేలా చూసుకోవడం, పరిశుభ్రత వంటి చర్యలే మార్గమని చెబుతున్నారు.
ఇక కేసుల విషయానికి వస్తే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,361 కేసులు నమోదయ్యాయి. 51మంది మరణించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,225కేసులు నమోదయ్యాయి.మొత్తం కేసుల సంఖ్య 4,69,722కి చేరింది.ఏపీలో గడిచిన 24 గంటల్లో 20,034 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 2398 కేసులు నమోదయ్యాయి.