ఏపీలో అదికార పార్టీ వైసీపీలో కీలక నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా పార్లమెంటులో ఆ పార్టీ నేతగా నిత్యం బిజీబిజీగా కనిపించే వేణుంబాక విజయసాయిరెడ్డి పరిస్థితి ఇప్పుడు నిజంగానే కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైందని అనిపిస్తోంది. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అన్న సామెత ఇప్పుడు సాయిరెడ్డి పరిస్థితికి చక్కగా సరిపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదో పార్టీ సమావేశంలో అయితే… మీడియాను అంతగా అనుమతించకుండా లోలోపలే ఏవేవో తిట్టుకున్నా, సాటి నేతలకు చీవాట్లు పెట్టినా పెద్దగా ఇబ్బంది లేదని, మీడియాను ఏమాత్రం దూరం పెట్టలేని జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి (డీడీఆర్సీ) సమావేశంలో సొంత పార్టీ నేతలపై సాయిరెడ్డి చేసిన అసందర్భ వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆయనకే ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
డీడీఆర్సీలో చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు తిరుగుబాటు ఎగురవేసినంత పనిచేయగా.. ఇప్పుడు వారందరినీ సముదాయించే పనిని సాయిరెడ్డి మొదలెట్టారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సాయిరెడ్డి బహిరంగంగానే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడగా.. వారు కూడా సాయిరెడ్డిపై ఎదురు దాడికి దిగిన వైనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఏకంగా పార్టీ అధినేత, సీఎం జగన్ చెవిన పడగా.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో సాయిరెడ్డి ఇప్పుడు రాజీ యత్నాలను ముమ్మరం చేయక తప్పలేదన్న మాట కూడా వినిపిస్తోంది.
రెండు రోజుల క్రితం విశాఖలో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో భాగంగా విశాఖ నగర ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన సాయిరెడ్డి… అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తనదైన రేంజిలో ఫైరైపోయారు. మీడియా అంతా చూస్తుండగా… అది కూడా జిల్లా అధికారులందరి ముందు సాయిరెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్ నాథ్ లు… అక్కడిక్కడే సాయిరెడ్డిని నిలదీసినంత పనిచేశారు. తాము ఎక్కడ అవినీతికి పాల్పడ్డామో తెలపాలని, అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న తమకే అధికారులు పలకడం లేదని, దీనికి కారణం ఎవరని కూడా వారిద్దరూ ప్రశ్నించారు. పబ్లిక్ మీటింగ్ లో అది కూడా… జిల్లా అధికార యంత్రాంగం ముందు తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా తనను నిలదీసినంత పనిచేయడంతో సాయిరెడ్డి కూడా షాక్ కు గురయ్యారు. వారిని నిలువరించే పని కూడా చేయలేకపోయారు. మొత్తంగా తాను చేసిన ఒకటి, రెడు వ్యాఖ్యలే సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఇంతగా హర్ట్ చేశాయా? అన్నట్లుగా సాయిరెడ్డి అంతర్మథనంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో విశాఖలోనే కాకుండా మొత్తం ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలన్నింటికీ తానే చీఫ్ ను అన్నట్లుగా వ్యవహరించే సాయిరెడ్డి… ఈ ఘటనతో ఖిన్నుడైపోయారని చెప్పాలి.
ఈ షాక్ నుంచి సాయిరెడ్డి తేరుకునేలోగానే వ్యవహారం మొత్తం జగన్ వద్దకు చేరిపోయిందట. దీంతో ఇటు సాయిరెడ్డితో పాటు అటు సాయిరెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినంత పనిచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడటం, ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన సాయిరెడ్డి… శుక్రవారం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం ఎర్పాటు చేశారట. ఈ భేటీకి మీడియాను దూరంగా పెట్టేసిన సాయిరెడ్డి… బహిరంగ సమావేశాల్లో ఇలా మనం పోట్లాడుకుంటే ఎలాగని సన్నాయి నొక్కులు నొక్కారట. అయితే బహిరంగ సమావేశంలోనే తమను టార్గెట్ చేసేలా మాట్లాడితే చూస్తూ ఊరకుంటే… తమదే తప్పు అవుతుంది కదా, ఏ తప్పూ చేయకున్నా తామెందుకు దోషులుగా నిలబడాలని కరణం, గుడివాడలు సాయిరెడ్డిపై మరోమారు దండెత్తే యత్నం చేశారట. దీంతో చేసేదేమీ లేక ఇకపై మనమంతా ఐక్యంగా ఉండాలని, మన వల్ల పార్టీకి చెడ్డపేరు వద్దని రాజీ ధోరణిలో మాట్లాడిన సాయిరెడ్డి…ఎలాగోలా వారిద్దరి అసమ్మతిని తగ్గించేశారట. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్టుంటే… నిజంగానే అడుసు తొక్కనేల… కాలు కడగనేల అన్న సామెత సాయిరెడ్డికి సరిగ్గా సరిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.











