(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
13 ఏళ్ల తర్వాత విశాఖలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ పర్యాయం ప్రభావం చూపే అంశాలపై జోరుగా చర్చ నడుస్తోంది. 2007లో జరిగిన ఎన్నికల్లో పంచ గ్రామాల భూ సమస్య తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం మార్చి 10న జరిగే పోలింగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా అనేక వార్డుల అభ్యర్థుల విజయాలను శాసించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ విశాఖ సింహాచలం దేవస్థానం భూముల వివాదం అనూహ్యంగా తెరపైకి వస్తోంది. సింహాచలం దేవస్థానం భూ సమస్య విశాఖలోని 4 నియోజక వర్గాలు, పాతిక పైగా వార్డుల్లోని ప్రజలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్య.
పాదయాత్రలో ఇచ్చిన హామీ..
పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, పెందుర్తి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు, జిల్లా కలెక్టర్తో కూడిన కమిటీని నియమించి భూ సమస్యపై చర్చించారు. కానీ ఇప్పటి వరకు ఆశాజనకంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చర్చలే తప్ప పరిష్కార మార్గాలు కనిపించడం లేదు.
స్థానిక ఎన్నికల ప్రకటనలతో ..
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ కార్పొరేషన్ ఎన్నికలను నిలిచిన చోటు నుంచే కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో.. అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. అధికార పార్టీ సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసుకుంటే.. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను చూపుతూ ఓట్లు అడుగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో కీలకంగా ఉండే అంశం పంచ గ్రామాల దేవస్థానం భూ సమస్య. దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో గత ప్రభుత్వాలు సఫలమయ్యాయి. అదే అస్త్రం మరోమారు వైఎస్ఆర్సీపి కూడా ప్రయోగించి మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని ప్రయత్నిస్తే ఆశాభంగం తప్పదు. పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా, విశాఖ పశ్చిమ, ఉత్తర, తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా తూర్పు, ఉత్తర నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూ సమస్య ఉంది. ప్రధానంగా నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో దేవస్థానం భూ వివాదం నడుస్తోంది. దీంతో ఈ పరిధిలోని వార్డులు చేజారకుండా పంచ గ్రామాల్లో భూ సమస్యలపై ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసుకుంది. మొన్నటి వరకు భూ సమస్య వివాదం కోర్టు పరిధిలో ఉందని, స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతితో చర్చించి, పీఠాధిపతులు వేసిన కేసును ఉపసంహరించుకునేలా, కోర్టు అనుమతితో పరిష్కరిస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనేకమార్లు ప్రకటించారు. న్యాయస్థానంలో ఉన్న వివాదాన్ని మంత్రులు తమ భేటీలో ఏవిధంగా పరిష్కరిస్తారో ప్రజలకు సైతం అంతుబట్టడం లేదు.
దీనికి తోడు స్టీల్ ప్లాంట్ ఆందోళనలు..
ప్రస్తుతం జరుగుతున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పంచ గ్రామాల భూ వివాదాన్ని వెనక్కు నెట్టి స్టీల్ ప్లాంట్ అంశం తెరపైకి వచ్చింది. ఉక్కు పరిశ్రమలో జిల్లాకు చెందిన అన్ని ప్రాంతాల ఉద్యోగులు ఉన్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అన్ని నియోజకవర్గాల ప్రజలపై ప్రభావం చూపనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి పైగా ఆధారపడి ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అధికారపక్షం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్లకు అండగా నిలుస్తోంది. ఇక బీజేపీ ఈ విషయంలో ప్రజలను ఓటు అడిగే హక్కును కోల్పోయింది. ఇప్పుడు పోటీ అంతా అధికార పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యనే కొనసాగనుంది. ఈ దశలో ఏ పార్టీని గెలిపించడం వల్ల తమకు ప్రయోజనం ఉంటుందని ఓటర్లు భావిస్తారో… ఆ పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నెగ్గుతుందా? ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం విజయం సాధిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.











