విశాఖ కేజీహెచ్ లో అరాచకం చోటు చేసుకుంది. కరోనా రోగులు, కరోనా శవాలపై ఉండే కొద్ది పాటి బంగారం ఆభరణాలు, మంగళ సూత్రాలు, పుస్తెలు సిబ్బంది కాజేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. కొందరు సిబ్బంది కరోనా శవాలపై ఉండే ఆభరణాలు కేజేస్తున్నారని నిత్యం కేజీహెచ్ శవాగారం వద్ద గొడవలు జరుగుతున్నాయి. శవాలతో పాటు రిపోర్టులు కూడా ఇవ్వడం లేదని రోగుల కుటుంబీకులు ఇవాళ కేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. కరోనా శవాలు, కరోనా రోగుల వద్ద ఆభరణాలు మాయంపై వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా వారు కూడా నోరుమెదపడం లేదని రోగుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
ఆభరణాలతో రావద్దు
కరోనాతో ఆసుపత్రిలో చేరే వారు ఎవరైనా ఎలాంటి ఆభరణాలతో రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కరోనా రోగులు ఒక్కొక్కరు దాదాపు 14 రోజులు చికిత్స పొందాల్సి వస్తోంది కాబట్టి ఎలాంటి విలువైన ఆభరణాలతో ఆసుపత్రికి రావద్దని కేజీహెచ్ సూపరింటెండెంట్ విజ్ఙప్తి చేశారు. ఆభరణాలు, విలువైన పత్రాలకు ఇలాంటి సమయంలో రక్షణ కల్పించడం సాధ్యం కాదని వైద్యాధికారులు ప్రకటించారు. వందలాది మంది సిబ్బందిలో ఎవరో ఒకరు చేసే ఇలాంటి పనులవల్ల అందరికీ చెడ్డపేరు వస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.