ఫ్యాక్షనిజానికి ఆ నియోజకవర్గం పెట్టింది పేరు. పొన్నపురెడ్డి-చదిపిరాల వర్గాల ఆధిపత్య పోరుతో ప్రశాంతత ఆ నియోజక వర్గంలో లేకుండా పోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి అండతో చదిపిరాల వర్గం చెలెరిగిపోయింది. వారి ఆగడాలకు అడ్డు వేసేందుకు పొన్నపురెడ్డి శివారెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. 1983లో జరిగిన ఎన్నికలలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడి నుంచి పొన్నపురెడ్డి వర్గం హవా ఆ నియోజక వర్గంలో సాగింది. దీంతో చదిపిరాల వర్గం సైలెంట్ అయిపోయింది. 1985,1989లో వరుసగా శివారెడ్డి గెలవడంతో బాటు మంత్రి కావడంతో పొన్నపురెడ్డి వర్గానికి ఎదురులేకుండా పోయింది.1993లో హైదరాబాద్, సత్యసాయి నిగమంలో బాంబు దాడిలో శివారెడ్డి హత్య తరువాత తిరిగి ఆ నియోజకవర్గంలో వర్గ పోరు మొదలయింది.
శివారెడ్డి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామసుబ్బారెడ్డి కూడా వర్గాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో జమ్మలమడుగు కక్ష్యలు, కాపణ్యాలతో రగిలిపోయింది. రామసుబ్బారెడ్డి కూడా 1994,1999లలో విజయం సాధించారు. టీడీపీకి బలంగా వ్యతిరేక గాలి వీయడంతో 2004 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి చదిపిరాల ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు. వైఎస్ అండతో జమ్మలమడుగు నియోజకవర్గంలో చదిపిరాల వర్గం తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ దశలో రామసుబ్బారెడ్డి హత్య కేసులో జైలుకు వెళ్లడంతో పొన్నపురెడ్డి వర్గానికి దిక్కు లేకుండా పోయింది. 2009లో జరిగిన ఎన్నికలలో ఆదినారాయణ రెడ్డి తిరిగి గెలవడంతో పొన్నపురెడ్డి వర్గం నియోజక వర్గం వదిలి వెళ్ళింది.
2014 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా వీచినా కడప జిల్లాలో వైసీపీ తన పట్టు నిలుపుకుంది. దీంతో 2014 ఎన్నికలలో ఆదినారాయణ రెడ్డి మరోమారు విజయం సాధించారు. కానీ జగన్ తీరుతో పడలేక ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవిని చేప్పటినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వర్గ పోరు వద్దనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. ఒప్పందంలో భాగంగా ఆదినారాణరెడ్డిని కడప ఎంపీగా, రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వైసీపీ హవాలో వీరిద్దరూ వారి వారి స్థానాలలో ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం రావడంతో కొన్ని రోజుల పాటు ఆ రెండు వర్గాలు సైలెంట్ అయ్యారు. ఆదినారాయణ రెడ్డితో విభేదించి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు.
మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రాక ప్రస్తుత జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ పార్టీ కార్యకలాపాలకు సుధీర్ రెడ్డి దూరమయ్యాడు. అంతేకాకుండా సన్నిహిత వర్గాల వద్ద వైఎస్ జగన్ తీరుపై అసంతృప్తిని వెళ్ళగక్కాడట. వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేయాలని అనుకుంటున్నాడని వార్తలు జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరిగాయి. ఈ వార్తలు వైసీపీ అధినాయకత్వం దృష్టికి వెళ్లడంతో సుధీర్ రెడ్డిని పక్కనపెట్టి ఎంపి అవినాష్ రెడ్డితో పనులు చేయించుకోమని చెప్పినట్లు కూడా వినబడుతోంది. ఇదే విషయాన్ని ఓ ప్రముఖ ఛానల్ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. దీంతో పార్టీ ఆయనపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో తప్పక మీడియా ముందుకు వచ్చిన సుధీర్ రెడ్డి ఈ ప్రచారాన్ని ఖండించారు.
అంతవరకు బాగానే ఉంది కానీ వచ్చే ఎన్నికలలో తనకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వైసీపీలోనే ఉంటా అని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే సుధీర్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అధిష్ఠానం వచ్చే ఎన్నికలలో సీటు ఇవ్వమని తేగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సుధీర్ రెడ్డి షాక్ కు గురయినట్లు ఆ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గ బాధ్యతలు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీసుకున్నాడని సమాచారం. మొత్తం మీద తమకు పట్టు ఉన్న జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వైసీపీ నాయకత్వానికి చికాకులు తెప్పించిందని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. తన సొంత జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలతో జగన్ షాక్ తిన్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా జగన్ అలర్ట్ కాకపోతే నష్టపోక తప్పదని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.