కరోనా కట్టడిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణుల సలహాలు ప్రజలకు చేరవేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన విర్చువల్ కాన్ఫరెన్స్ విజయవంతమైంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు ఈ ఆన్ లైన్ సమావేశంలో పాల్గొని విలువైన సలహాలు అందించారు. ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ కరోనా కట్టడికి దేశమంతా ముందు లాక్ డౌన్ వేయడమే తక్షణ పరిష్కారమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. మీకు తోడుగా మేమున్నామంటూ కరోనాపై నిర్వహించిన విర్చువల్ కాన్ఫరెన్సులో చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.సాధ్యమైనంత త్వరగా అందరికీ టీకా అందుబాటులోకి తీసుకురావాలలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా థర్డ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నీ ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలని సూచించారు. అప్పుడే మరణాలు సాధ్యమైనంత తగ్గించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేవలం దేశంలో తయారవుతున్న రెండు టీకాలపైనే కాకుండా అందుబాటులో ఉన్న అన్ని దేశాల నుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. థర్డ్ వేవ్లో బాలలు కూడా ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన చేశారు. ఒక రాష్ట్రంలో లాక్ డౌన్ వేసి, మరో రాష్ట్రంలో లాక్ డౌన్ వేయకపోతే ప్రయోజనం ఉండదని, దేశమంతా ఒకేసారి లాక్ డౌన్ వేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
అందరికీ వ్యాక్సిన్లు వేయడమే పరిష్కారం : డాక్టర్ శ్రీధర్
సెకండ్ వేవ్లో కుటుంబాలకు కుటుంబాలు బలవుతున్నాయని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి జ్వరం వచ్చినా ప్రస్తుతం కరోనా టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని వారు సూచించారు. జ్వరం వచ్చిన వారు ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. కుటుంబంలో ఒకరికి వస్తే మొత్తం కరోనా భారిన పడుతున్నారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ సునామీలా విరుచుకుపడుతోందన్నారు. దేశంలో ఆరోగ్యరంగంలో సదుపాయాలు జనాభాకు అనుగుణంగా లేవన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సదుపాయాల కన్నా పదిరెట్లు పెంచుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ వ్యాక్సిన్లు వేయడమే పరిష్కారమన్నారు. మొదటి దశలో వైద్య సిబ్బంది మొత్తానికి టీకాలు వేయడం వల్ల కరోనా సెకండ్ వేవ్ వారిపై పెద్దగా ప్రభావం చూపలేదని పరిశోధనలో తేలిందన్నారు. ఫంక్షన్లలో అనేక మంది చేరడం వల్ల కరోనా వేగంగా వ్యాపిస్తోందని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.ఏపీలో వ్యాక్సినేషన్ సెంటర్లు, సిటీ స్కాన్ సెంటర్లు కరోనా హాట్ స్పాట్లుగా మారాయని డాక్టర్ శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు.
లక్షణాలు లేకపోవడమే చాలా ప్రమాదం
కోవిడ్ వచ్చిన వారిలో 20 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని వైద్య నిపుణుడు శ్రీధర్ తెలిపారు. వీరి వల్లే ఎక్కువ మందికి కరోనా సోకుతోందని వైద్యులు వెల్లడించారు. లక్షణాలు లేనివారు విచ్చలవిడిగా తిరగడం వల్ల వారి కుటుంబ సభ్యులతోపాటు, వారు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో అనేక మంది కరోనా భారిన పడుతున్నట్టు గుర్తించినట్టు డాక్టర్లు తెలిపారు. లక్షాణాలు మొదలవడానికి ఒక రోజు ముందే కరోనా సోకినట్టని డాక్టర్లు వెల్లడించారు. కరోనా లక్షణాలు బయటపడటానికి ఐదు రోజులు పడుతోందని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు బయటపడితే తలా ఒక గదిలో ఉండాలన్నారు.
వ్యాధి నిర్థరణ, తీవ్రత గుర్తింపు కోసమే సిటీ స్కాన్: డాక్టర్ సురేష్
రెండు సార్లు నెగటివ్ వచ్చి, జ్వరం తగ్గకపోతే మాత్రమే సిటీ స్కాన్కు వెళ్లాలని ప్రముఖ డాక్టర్ సురేష్ అభిప్రాయపడ్డారు.లక్షణాలు బయటపడ్డ మూడు నుంచి 5 రోజుల తరవాతే సిటీ స్కాన్కు వెళ్లాలని ఆయన సూచించారు. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వచ్చిన ప్రతి వారికీ సిటీ స్కాన్ అవసరం లేదన్నారు. ఆరు నిమిషాలు నడిచిన తరవాత ఆక్సిజన్ లెవల్స్ పరిశీలించి 94 కన్నా తగ్గితే మాత్రమే సిటీ స్కాన్ అవసరం అవుతుందన్నారు. వారం, పది రోజులకు కూడా జ్వరం, దగ్గు తగ్గకపోతే సిటీ స్కాన్ చేయించుకోవాలన్నారు. ఎక్కువగా పొగతాగేవారు కూడా సిటీ స్కాన్ చేయించుకోవాలని డాక్టర్ సురేష్ సలహా ఇచ్చారు.
మానసిక సమస్యలు రెట్టింపు : ప్రముఖ డాక్టర్ మిరియాల శ్రీకాంత్
కరోనా ఎఫెక్టు వల్ల రోగులు అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ డాక్టర్ మిరియాల శ్రీకాంత్ వెల్లడించారు. అందరితో మాట్లాడుతూ ఉండటం, కొత్త విషయాలు ఏవైనా నేర్చుకోవడం, పరిసరాలను గమనిస్తూ ప్రకృతిని ఆస్వాదించడం,ఇతరులకు సహాయ సహకారాలు అందించడం, శారీరక శ్రమ పెంచుకునేందుకు వ్యాయామాలు చేయడం ద్వారా మానసిన ఆరోగ్యం మెరుగు పరచుకోవచ్చని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. ఆస్ట్రేలియాలో పొలిటికల్ కమిట్మెంట్ ఉండటం వల్ల కూడా ఆ దేశంలో కరోనా కట్టడి సాధ్యమైందని డాక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఆస్ట్రేలియాలో కరోనా కట్టడికి 113 రోజుల లాక్ డౌన్ విధించారని ఆయన గుర్తు చేశారు.
దేశమంతా లాక్ డౌన్ వేయాలి
కరోనా కట్టడికి లాక్ డౌన్ దేశమంతా ఒకేసారి విధించడమే తక్షణ పరిష్కారమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. డాక్టర్ల విలువైన సలహాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించడంతోపాటు ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. దేశంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విర్చువల్ కాన్ఫరెన్సులో పాల్గొన్న డాక్టర్లకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.











