కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం జరిగింది.రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కేటాయించక పోగా విదిలింపులతో రాష్ట్రానికి బిచ్చం వేశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలను కూడా కేంద్ర బడ్జెట్లోప్రస్తావించలేదు. ప్రత్యేక హోదా, వెనుకబడ్డ జిల్లాల ప్యాకేజీ,రైల్వే జోన్ ఊసే లేదు.కేంద్ర విద్యాసంస్థలకు గతేడాది కేటాయించిన నిధులకు కోతపెట్టారు.
ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రకారం రాష్ట్రానికి నిధులు బదిలీలలోను భారీ కోతలు పెట్టారు.మొత్తంగా ఈ బడ్జెట్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రం పట్ల ఇంత వివక్షత చుపిస్తూ, ద్రోహం చేసినా 22 మంది పార్లమెంట్ సభ్యులు,9 మంది రాజ్యసభ సభ్యులు మొత్తం 31 మంది ఎంపీలు,వుండి కూడా పార్లమెంట్ లో కనీసం నోరు విప్పలేదంటే. రాష్ట్రం నుండి 31 మంది వైసిపి ఎంపీలు వుండి ఏం ఉద్దరించారని, వీరిని ఎంపీలుగా పంపిన ప్రజలు విశ్లేషించుకోవాలి.పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలు,ప్రజాసమస్యల పై పోరాడి సాధిస్తారని ప్రజలు ఆశించారు.కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇవ్వక పోయినా తన పై వున్న కేసుల కోసం రాజీపడి రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కొక్కటి తాకట్టు పెట్టారు.
రాష్ట్రానికి రావాల్సినవి ఏమి ఇవ్వక పోయినా వైసిపి ఎంపీలు పార్లమెంట్ లో నిలదీసి ఎరుగరు. పైగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర బడ్జెట్ అందరికి ఉపయోగపడేలా ఉందని కితాబునిచ్చారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు కేంద్ర బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసి పక్కనున్న ఆంధ్రాప్రదేశ్ పట్ల వివక్షత చూపించడం దారుణం. విభజన చట్టాలను ఆమోదించి పదేళ్లు కావస్తున్నా కేంద్ర బడ్జెట్లో హామీల ప్రస్తావన కానీ, నిధుల కేటాయింపులు గానీ జరగ లేదు.31 మంది ఎంపీలుండి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు, విశాఖ ఉక్కుపైనా కేంద్ర బడ్జెట్లో ప్రస్తావన లేదు. పోలవరం రాష్ట్రానికి చాలా కీలకమైన భారీ నీటి ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు భరించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 4785 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2023-24 బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కానీ త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందటానికి కర్ణాటక లోని అప్పర్ భద్ర నీటి ప్రాజెక్టుకు మాత్రం బడ్జెట్లో ఏకంగా రూ.5300 కోట్లు కేటాయించారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తుంగభద్ర దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతానికి ప్రమాదం ఏర్పడు తుందంటున్నారు నిపుణులు.అయినా ఇంత అన్యాయం చేస్తున్నా,ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కానీ నోరు విప్పటం లేదంటే వీరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఉన్నారో,రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి వున్నారో ప్రజలే అర్ధం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలంటే ఇంకా రూ.35 వేల కోట్లు అవసరం కానుంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని,వంద శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలని విభజన చట్టంలోస్పష్టంగా ఉన్నప్పటికీ పదేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు పూర్తికి అవసరమైన నిధులను ఇవ్వకుండా కేంద్రం లోని మోడీ సర్కార్ మడత పేచీలు పెడుతున్నది. నిర్వాసితుల పునరావాసం తమ బాధ్యత కాదన్నట్లు కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తున్నది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ వివక్షత వల్ల 75 శాతం పూర్తీ అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక హోదా అంశంగానీ, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపులు లేవు. గిరిజన యూనివర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీ మినహా మరే విద్యా సంస్థకు కేటాయించలేదు. వాటికి కూడా అరకొర నిధులే విదిలించారు. విశాఖ రైల్వే జోన్, ఎన్ఐటి, ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్ ఐటి, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ మెట్రో, ఎయిమ్స్, రాజధాని నిర్మాణానికి నిధుల ఊసేలేదు.రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ మెట్రోరైళ్ల నిర్మాణానికి ఎలాంటి కేటాయింపులు లేవు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ, విజయవాడ మెట్రోరైళ్ల నిర్మాణం కేంద్రం దయాదాక్షిణ్యమేమీ కాదు. రాష్ట్రం హక్కు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన చట్టబద్ధ హామీలుయిచ్చి పదేళ్ళు అవుతున్నా ఇవి ఆచరణకు నోచుకోవడంలేదు. ఈ బడ్జెట్లో కూడా వీటి గురించి ఒక్క మాట కూడా లేదు. రైల్వేలైన్లు అనేకం పెండింగ్లో ఉన్నాయి. కొన్నిరైల్వే లైన్లు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదనలు లేవు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుపై ఈ బడ్జెట్లో కూడా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కనీసం నిధులు కూడా కేటాయించలేదు. జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ రెండేళ్ళ క్రితమే రూపొందించినా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్ను కేంద్ర బిజెపి సర్కార్ రద్దు చేసింది. కొత్త జోన్ రాకపోగా ఉన్న డివిజన్ కోల్పోవాల్సి వచ్చింది అయినా ఎంపీలు,ముఖ్యమంత్రి కేంద్ర నిరంకుశ నిర్ణయంపై మాట్లాడలేదు.గత తొమ్మిదేళ్ళుగా ఎదురు చూస్తున్న కడప స్టీల్ప్లాంట్, దుగ్గరాజుపట్నం పోర్టుల నిర్మాణాలకు ఈ బడ్జెట్లో కూడా మొండి చెయ్యి చూపారు. నిధుల కేటాయింపు దేవుడెరుగు కనీస ప్రస్తావన కూడా లేదు. వీటికి కూడా పూర్తిగా పంగనామాలు పెట్టినట్లే. ఇక విశాఖపట్నం స్టీల్ప్లాంట్ను అమ్మేసే దిశగానే వేగంగా పావులు కదుపుతున్నది కేంద్రం. రెండున్నరేళ్లుగా విశాఖ స్టీలు ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నా అధికార పార్టీ ఎంపీలు కానీ,ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కానీ తీవ్రంగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు.
మౌనాన్ని ఏమని అర్థం చేసుకోవాలి?
రాష్ట్రానికే తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించేది లేదని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాల్సిన 31 మంది ఎంపీలు ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉండటం అంటే రాష్ట్ర ప్రయోజనాల పట్ల వీరికి ఎంత బాధ్యత ఉందొ అర్ధం అవుతుంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు విదిలింపులతో సరిపెట్టారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు మాత్రం వరాల జల్లు కురిపించారు.ఆంధ్రప్రదేశ్ పై చూపిన సవతి తల్లి ప్రేమ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీకి గతేడాది రూ2022-23 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.56.66 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల్లో రూ.13.08 కోట్లకు తగ్గించింది. హిందూస్థాన్ షిప్యార్డ్లో పెట్టుబడులకు రూ.100 కోట్లు కేటాయించి రూ.10 కోట్లకు కోతపెట్టారు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి రూ.150 కోట్లు కేటాయించి రూ.100 కోట్లకు తగ్గించారు.
పోర్ట్ ట్రస్ట్కు రూ.207.99 కోట్లు ప్రతిపాదించి రూ.155.39 కోట్లకు తగ్గించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో రూ.910 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించి రూ. 603 కోట్లకు తగ్గించారు. 2022-23లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు కింద ఏఐఐబీ నిధులు రూ.1,500 కోట్లు కేటాయించారు.కానీ రాష్ట్రప్రభుత్వ నిర్వాకంతో రూ.655 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. రాష్ట్ర వాటా సకాలంలో విడుదల చేయకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లి బిల్లులు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రోడ్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. పట్టణాల్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు కోసం గత బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయిస్తే, రాష్ట్రం 389 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది దీంతో కేంద్రం ఇప్పుడు రూ.200 కోట్లే కేటాయించింది. రోడ్ల పునర్నిర్మాణానికి గత ఏడాది రూ.979 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్ లో కేవలం రూ.247 కోట్లు మాత్రమే కేటాయించారు.
మండల కనెక్టివిటీకి సంబంధించి లింక్ రోడ్ల నిర్మాణానికి గత బడ్జెట్లో రాష్ట్రానికి రూ.884 కోట్లు కేటాయిస్తే. ఈ బడ్జెట్ లో కెవలం రూ.248 కోట్లు ఖర్చు చేశారు. అందుకే బడ్జెట్ లో రూ.209 కోట్లే కేటాయించారు. ఏపి, తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ. 44 కోట్లు కేటాయిస్తే, సవరించిన అంచనాల్లో దాన్ని రూ. 43.75 కోట్లకు తగ్గించారు. ఇప్పుడు ఏపి, తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయాలు రెండింటికి కలిపి కేవలం రూ.37.67 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో పెట్రోలియం యూనివర్శిటీకి రూ.150 కోట్లు కేటాయించగా,ప్రస్తుత బడ్జెట్ లో రూ.168 కోట్లు కేటాయించారు. విశాఖపట్నం పోర్టుకు రూ.337.69 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏదో ఒక పేరుతొ 44 నెలలుగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రధానిని,కేంద్ర మంత్రులను కలుస్తున్నారు తప్ప సాధించిన ఫలితం ఏమిటి? విభజన హామీలు పై వినతిపత్రాలు సమర్పిస్తూ జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు విడుదల చేస్తున్నారు.
జగన్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు?
ఈ 44 నెలలలో జగన్ దాదాపు 25 సార్లు ఢిల్లీ వెళ్లారు.వెళ్లిన ప్రతిసారి అవే అభ్యర్ధనలతో తేదీ లు మార్చి అవే ప్రకటనలు విడుదల చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఏమి సాధిస్తున్నారని ప్రజలు,రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ శున్య హస్తాలతో తిరిగి రావడం తప్ప ఏరోజూ కూడా తాను రాష్ట్రానికి ఈ హామీ సాధించుకొచ్చానని జగన్ గర్వంగా చెప్పుకొనే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వచేస్తున్న మోసాన్ని ఎండగట్టకుండా,నిలదీయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం కేంద్ర పెద్దలకు సాగిలపడి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయని ఊదరగొట్టిన జగన్ రెడ్డి నేడు ప్రత్యేక హోదా పై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళేది విభజన హామీలు అమలుకోసం అని చెబుతారు.కానీ మొరపెట్టుకొనేది ఇతర అంశాలు అని ప్రజలు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదనపు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతి కోసం, తన సీబీఐ,ఈడీ,బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులును సర్దుబాటు చేసుకునేందుకే ప్రధాని మోదీతో, కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సమావేశమవుతున్నారన్న చర్చకూడా జరుగుతోంది.
జగన్ కేసులు నుండి బయట పడాలి అంటే కేంద్ర పెద్దలు చల్లని చూపు అవసరం. జగన్ బిజెపితో పోరాడే పరిస్థితి లేక రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.మోడీ ప్రభుత్వ దన్నుతో లాభాల్లో వున్న గంగవరం పోర్టును కారు చౌకగా అదానీ, అంబానీలకు, గనులు, ఇతర సహజ వనరులను కట్టబెట్టారు.రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించకుండా జగన్ ప్రభుత్వం ఇదే విధంగా సాగిలా పడితే రాష్ట్ర భవిష్యత్తు ఎం కావాలి?పార్లమెంట్ సాక్షిగా ఏపీ కి అన్యాయం జరిగిందని అంగీకరిస్తూనే ప్రతి బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు కమలనాధులు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యక పోవడం ప్రజాద్రోహం కాదా? రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న బిజెపి కుట్రలను,కేంద్రాన్ని నిలదీసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయారు 31 మంది ఎంపీలు.రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నా, ప్రజా ప్రయోజనాలకు హాని చేస్తున్నా,రాష్ట్ర హక్కులు హరిస్తున్నా, మీ కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి మెతక వైఖరి అవలంభిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను బలిఫీఠం పైకి నెట్టడం సమర్ధ నీయమా? కావునా 31 మంది ఎంపీలుండి రాష్ట్రాన్ని ఏమి ఉద్దరించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టంగా అర్ధం అవుతున్నా కేంద్రానికి మోకరిల్లి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. ప్రతి పక్షంలో వున్నప్పుడు విభజన హామీలు అమలుకోసం మా ఎంపీలు రాజీనామా చేస్తారు అని బెదిరించిన జగన్ రెడ్డి, నేడు విభజన హామిలు అమలుకోసం తన ఎంపీలతో ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయించడం లేదు? 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటూ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదా దక్కింది కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కరలేదా? ఉత్తిత్తి అభ్యర్ధనలు,ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కాదు ఫలితం చూపండి, మీరు మెడలు వంచడంకాదు,కేంద్రం మెడలు వంచండి.