నాలుగేళ్ళ వైసిపి అరాచకాలు, హింసా విధ్వంస పాలనే కారణం..
కేంద్రం ముందే ముక్కుతాడేస్తే, ఏపి ఇంత అధోగతి పాలయ్యేదా..?
జగన్ ఎందుకింత ఒంటరయ్యాడు..ఆయన్నెందుకు అన్నిపార్టీలు దూరం పెడ్తున్నాయి.. కలుపుకుపోవడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదెందుకని..? ఇతర పార్టీలే కాదు అన్నివర్గాల ప్రజలు జగన్మోహన రెడ్డిని ఎందుకు భరించలేకపోతున్నారు..? స్వయంకృతాపరాధమే వీటన్నింటి వెనుకనున్న ప్రధాన కారణం..14ఏళ్ల జగన్ రాజకీయ జీవితంలో ఇలాంటి దురవస్థ వస్తుందని ఊహించలేదెవ్వరూ..ఒక్కఛాన్స్ అని బుగ్గలు పట్టుకుని బతిమిలాడి, కాళ్లావేళ్లాపడి అధికారంలోకి వచ్చిన 4ఏళ్లలోనే అన్నివర్గాల ప్రజలకింత దూరమైన నాయకుడితనే..
శ్రీకాళహస్తి పర్యటనలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, విశాఖ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపిలో జగన్ అవినీతి పాలనపై ధ్వజమెత్తడం సంచలనమే..4ఏళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి వైసిపి ఎంపీల పూర్తి మద్దతు, దరిమిలా ఏపికి అడిగినన్ని అప్పుల వర్షం కురిపించడం తెలిసిందే..రాజ్యసభలో బిజెపి ప్రభుత్వ బిల్లులన్నీ గట్టెక్కగలిగాయంటే వైసిపి ఎంపిల మద్దతే కీలకం. లోక్ సభలో కూడా వైసిపి ఎంపీల తోడ్పాటు మోదీ ప్రభుత్వానికి అదనపు బలమే..దీనికి ప్రతిగానే జగన్మోహన రెడ్డిపై సిబిఐ, ఈడి కేసుల విచారణలో తీవ్ర జాప్యం, అవినాశ్ రెడ్డి అరెస్టులో వాయిదాల పర్వం తదితరాలపై జనబాహుళ్యంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఏపిపై బిజెపి పూర్తి దృష్టిపెట్టడం, 3రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతల పర్యటనల్లో వైసిపిపై సైరన్ మోగించడం విశేషం. జగన్ పై విమర్శలతోనే ఏపీలో బిజెపి ఎన్నికల శంఖారావం మోగించారు.
ఇప్పటిదాకా ఏపిలో వైసిపి, బిజెపి ఒక్కటేనన్న భావన రాష్ట్ర ప్రజల్లో ఉందనేది బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులాంటి వాళ్లు పేర్కొనడం విదితమే, అదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా నివేదించారు. ఈ ప్రచారం వల్లే సిటింగ్ ఎమ్మెల్సీ మాధవ్ కు ఇటీవల గ్రాడ్యుయేట్స్ నుండి శాసనమండలి ఎన్నికల్లో నోటాకంటే తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడం జరిగింది. బిజెపిపై ఉన్న జగన్ ముద్ర చెరిపేందుకే జెపి నడ్డా, అమిత్ షాలు మహా జన సంపర్క్ మీటింగ్ లను వేదికలుగా చేసుకోవడం జరిగింది…
రెండు నెలల క్రితం రాజస్థాన్ పర్యటనకెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడనుండి ఢిల్లీ వెళ్లి జెపి నడ్డాతో భేటీ అయి ఇదే విషయం తెలియపర్చారనేది, వారం క్రితం ఢిల్లీ వెళ్లిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా జెపి నడ్డాను, అమిత్ షాను కలిసి దీనిగురించే చర్చించారనే ప్రచారం ఉంది..
ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ కూడా వైసిపి నాలుగేళ్ల పాలనను రామరామ అనడంలేదంటే ఏ స్థాయిలో రాష్ట్రంలో హింసా విధ్వంసాలు చోటుచేసుకున్నాయో, అవినీతి కుంభకోణాలు, అరాచక పాలన జరిగిందో అర్ధం అవుతోంది.
వైసిపి ప్రభుత్వ దమనకాండకు కేంద్రం ముందే ముక్కుతాడు వేసివుంటే, రాష్ట్రం ఇంత అధోగతి పాలయ్యేది కాదనేది జనాభిప్రాయం.
ఢిల్లీ మద్యం స్కాంపై పెట్టినంత శ్రద్ద ఏపి లిక్కర్ మాఫియాపై పెట్టలేదనేది కూడా ఉంది. ఢిల్లీలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్ల స్కామే కానీ ఏపిలో నాసిరకం బ్రాండ్ల తయారీ కూడా స్కామే, లిక్కర్ సరఫరా కూడా స్కామే..అంటే ఢిల్లీలో 2రకాల కుంభకోణమైతే, ఏపిలో 4రకాల కుంభకోణం అన్నమాట..మద్యం క్యాష్ అండ్ క్యారీ అమ్మడం దేశంలో ఎక్కడైనా ఉందా..? ఏపి మద్యం కుంభకోణం గుట్టుమట్లపై కేంద్రం వదిలేయబట్టే లిక్కర్ మాఫియా ఇంత పేట్రేగిపోయిందనే ఆలోచన కూడా ప్రజల్లో ఉంది..
వాస్తవంగా చూస్తే ఏపిలో బీజెపి కూడా వైసిపి బాధిత పార్టీయే..జె గ్యాంగ్ బిజెపినేమీ వదిలేయలేదు, బిజెపివాళ్లపైనా దాడిచేశారు, తలలు పగులకొట్టారు, వాహనాలు ధ్వంసం చేశారు, తప్పుడుకేసులు పెట్టారు, మానసికంగా శారీరకంగా హింసించారు..కావలి డీఎస్పీ బూటుకాళ్ల నడుమ నెల్లూరు జిల్లా బిజెపి నేత సురేశ్ తల నలిగిపోయే దృశ్యం జనం కళ్లముందే ఉంది. అమరావతిలో బిజెపి జాతీయ నేత సత్యకుమార్ పై దాడి, వాహనం ధ్వంసం, వాకింగ్ కెళ్లిన వినుకొండ బిజెపి అధ్యక్షుడి తల పగులకొట్టడం, చిత్తూరు జిల్లా మండల బిజెపి నాయకుడి కుటుంబంపై దాడి,అనంతపురం జిల్లా ధర్మవరంలో బిజెపి నాయకులపై దాడులు గత 4ఏళ్ల అరాచక పాలనలో కొన్నిమాత్రమే..
ఏపిలో ఈ పరిస్థితులకు ఏ 1 జగన్మోహన రెడ్డి అయితే, ఏ 2 బిజెపి అనేది జనంలోకి బాగా వెళ్లింది.. టిడిపి జనసేనపై దాడులు, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలప్పుడే నడ్డా- షా లిలా ధ్వజమెత్తివుంటే మొన్న కావలిలో బిజెపి సురేష్ కా పరిస్థితి వచ్చేదా, ఆయన తలనలా డిఎస్పీ బూటుకాళ్ల మధ్య నలిపేవాడా..? అమరావతిలో సత్యకుమార్ పై దాడి జరిగేదా..? ఇప్పటంలో జనసేన వాళ్ల 52ఇళ్లు కూల్చేవారా..? పవన్ కల్యాణ్ కు విశాఖ హోటల్ లో బైటకు రానీకుండా చేసేవాళ్లా..? అనపర్తిలో చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంగా పోలీసులే బైఠాయించేవాళ్లా..?
బిజెపి పెంచిన భూతం జగన్..బిజెపి అండ చూసుకునే జగన్ ఇంత రెచ్చిపోతున్నాడు..మోదీ-షా భయం ఉంటే జగన్ ఇంత అరాచకాలకు పాల్పడేవాళ్లు కారని కూడా ఉంది. 3రాజధానులప్పుడే జగన్ స్పీడ్ కు మోదీ-షా బ్రేక్ వేసివుంటే, మోదీ శంకుస్థాపన చేసిన అమరావతికీ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం ఉంది.
మొన్న అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశంగాని, 2నెలల్లో రూ 23వేల కోట్ల వర్షం కురిపించినప్పుడు గాని, లక్షల కోట్ల అప్పులకు గేట్లు ఎత్తడంగాని, జగన్ కు బిజెపి అండ ఉందనేది అందరూ అనుకుందే.. అలాగే కేంద్రం బిల్లులు అన్నింటికీ వైసిపి మద్దతివ్వడంగాని, జగన్ పై సిబిఐ, ఈడి కేసులు ముందుకు కదలకపోవడంగాని, లేటెస్ట్ గా నూతన పార్లమెంటు భవనం ప్రారంభానికి 25పార్టీలు ఎగ్గొట్టినప్పుడు వాటన్నింటినీ హాజరవ్వాలని జగన్ రాయబారంగాని…వైసిపి, బిజెపి క్విడ్ ప్రొ కోను బలపర్చేవే.. మోదీ-షా ద్వయం మధ్య జగన్ చేరి, మోదీ-జగన్-షా త్రయం అయ్యారనేది కూడా ప్రజల్లో ఉంది..దీన్ని ఎరేజ్ చేసుకోవాలంటే అటు రాష్ట్ర నాయకత్వం,ఇటు ఢిల్లీ అధిష్టానం చాలా కష్టపడాలి.. ఇప్పుడింకా 8నెలలే ఉంది, పెద్దగా సమయంలేదు..ఈ 8నెలలు ఎంతో కష్టపడితేగాని బిజెపిపై జగన్ ముద్ర తొలిగిపోదు..
బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాపై ఏపి మాజీ మంత్రి పేర్నినాని చేసిన ఘాటైన విమర్శలు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీగాని, కేజ్రీవాల్, మమత, నితీశ్ లాంటివాళ్లే చేసిన దాఖలాల్లేవు..పేర్ని నానిని జగన్మోహన రెడ్డి మౌత్ పీస్ గానే చూడాలి. సజ్జల స్క్రిప్ట్, జగన్ డైరెక్షన్ లోనే పేర్ని నాని యాక్షన్ గా చూడాలి. విశాఖలో అమిత్ షా సభావేదికపై ఉన్న బిజెపి రాష్ట్ర నేతలు పేర్నినాని విమర్శలను ధీటుగా తిప్పికొట్టడంలో విఫలం అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిజెపి ల్యాండ్ స్కామ్ అని, క్యాప్టివ్ మైన్స్ ఎందుకు కేటాయించలేదని, బెంగళూరులో యమమేత మేశారని, అందుకే కర్ణాటక ఎన్నికల్లో బిజెపి కుక్కచావు చచ్చిందని పేర్నినాని విమర్శలు జగన్మోహన రెడ్డి విమర్శలే..శివుడి వరం పొందిన భస్మాసురుడు చివరికి ఆ శివుడిమీదే చెయ్యి పెట్టినట్లుగా జగన్ గ్యాంగ్ చివరికి బిజెపినే టార్గెట్ చేయడం గమనార్హం.
బిజెపి జాతీయ నాయకత్వంలో వచ్చిన మార్పును ఏపి బిజెపి ఎంతమేర అందిపుచ్చుకుంటుందనేది సందేహాస్పదమే.. పచ్చపువ్వులని, బులుగుపువ్వలనే విమర్శలను చెరిపేసుకుని అసలుసిసలు కమలం వికసించేనా..? దేశంలో మరేరాష్ట్రంలోనూ బీజేపీకింత లేజీ నాయకత్వం లేదు. లేనంతగా ఏపి బిజెపి బలహీనపడటానికి కారణాలను ఇకనైనా సమీక్షించాలి.
ఏపీలో అన్నిపార్టీలు ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుంటే బిజెపి ఎక్కడ..? ఎన్నికల ఏడాది చివర్లో ఏదో ఛార్జిషీట్లు పెడితే సరిపోద్దా..? ప్రజా క్షేత్రంలో పోరాటాల్లేకుండా జనాదరణ ఎలా సాధ్యం..? మీడియా ప్రకటనలకు, ప్రెస్ మీట్లకే ఏపి బిజెపి పరిమితమైంది.. తెలంగాణలో బండి సంజయ్ ఇప్పటికి ఆరేడు దశల్లో పాదయాత్రలు చేశారు, ఎన్నో ప్రజాపోరాటాలు చేశారక్కడ, ఆ స్ఫూర్తి ఏపి బిజెపి నాయకత్వంలో ఏది..? విశాఖలో వైసిపి భూదందాల మీద అమిత్ షా ధ్వజమెత్తిన నేపథ్యంలో అక్కడి ల్యాండ్ స్కామ్ ల మీద పాదయాత్రలు చేయొచ్చుకదా సోము వీర్రాజు..
ఇప్పటివరకు వైసిపిపై ల్యాండ్-శాండ్ మాఫియా, మైన్-వైన్ మాఫియా ఆరోపణలకు అదనంగా జెపి నడ్డా ‘‘ఎడ్యుకేషన్ మాఫియా’’ ఆరోపణ చేయగా, అమిత్ షా ‘‘ఫార్మా మాఫియా’’ ఆరోపణలు చేసిన నేపథ్యంలో స్థానిక నాయకత్వం మరింత జోష్ తో ప్రజాఉద్యమాలకు నడుం కట్టాల్సివుంది.. మహాజన సంపర్క్ అంటే కేవలం పబ్లిక్ మీటింగ్ లేనా..? గడపగడపకూ బిజెపి వెళ్లాలి, ప్రతి నియోజకవర్గంలో పాదయాత్రలు చేయాలి, రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలు చేయాలి, ఏపీ ప్రజల్లో బిజెపి పునః ప్రతిష్టాపనకు దోహదపడే కార్యాచరణ చేపట్టాల్సివుంది.