(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
సింహాచలం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒక మహిళ కరోనా టెస్ట్ కోసం హాస్పిటల్కి వచ్చి ఆరు బయటే ప్రసవించింది.గురువారం కరోనా పరీక్ష కోసం వివరాలు ఇచ్చిన గర్భిణీ చింతాడ లక్ష్మి కూర్చున్న చోట ప్రసవించడంతో వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది స్టక్చర్పై హాస్పిటల్ వార్డులోకి తరలించి వైద్య సేవలు అందించారు. ఆమె హెల్త్ రికార్డుల ప్రకారం డెలివరీ ఈనెల 25న కావాల్సి ఉంది. అయితే ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న కాసేపటికి ఆమె నొప్పులతో బాధపడుతూ అక్కడే ప్రసవించింది.అక్కడే ఉన్నఇంచార్జి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ మాధవి వైద్య సిబ్బంది లక్ష్మికి వైద్య సదుపాయం కల్పించారు. లక్ష్మి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.లక్ష్మి ఏజెన్సీ ఏరియాలో కూలి పనులు చేసుకుంటూ కొండ ప్రాంతంలో నివాసం ఉంటుంది.లక్ష్మి సొంత ప్రాంతం కాన్వెంట్ జంక్షన్ సమీపంలో కొబ్బరి తోట.కరోనా టెస్ట్ కోసం ఆటోలో సింహాచలం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది.ఇంతలో ఆమె ప్రసవించడంతో ప్రాథమిక వైద్య సేవలు అందించి,మెరుగైన వైద్యం అందించడానికి విశాఖపట్నం KGHకి ఆశా వర్కర్ గౌరీ కుమారి సహకారంతో తరలించారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే అంటూ..
వైద్యులు నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై గర్భిణీ డెలివరీ అయిందని మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అసలు వైద్యుల ప్రమేయం లేనప్పటికీ ఆమె ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవించడంతో వైరల్ అయ్యింది. ఈ ప్రచారాన్ని ఆరోగ్య కేంద్రం అధికారులు ఖండించారు. ఇది పూర్తి అవాస్తమని సింహాచలం డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ మాధవి స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లాలో వైద్యులు నిర్లక్ష్యంతో గర్భిణీ రోడ్డుపై ప్రసవించినట్టు సోషల్ మీడియాలో వచ్చిన కధనంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించి వివరాలు ఆరా తీశారు. వాస్తవ పరిస్థితులను ఫోన్ ద్వారా విశాఖపట్నం DMHO డాక్టర్ సూర్య నారాయణను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో స్పందించిన ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు.











