అద్దె ఇవ్వలేదని వైసీపీ నాయకుడే సచివాలయ భవనాలకు తాళం వేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లులో వైసీపీ నాయకుడు, కాంట్రాక్టర్ మారం అంజిరెడ్డి 2019లో సచివాలయ భవన నిర్మాణ కాంట్రాక్టును తీసుకుని నిర్మాణం పూర్తి చేశారు. కాగా 2020 లో స్థానిక ఎమ్మెల్యే వేణుగోపాల్ ఆ భవనాన్ని ప్రారంభించారు.
అయితే నిర్మాణం పూర్తయి రెండేళ్ళు కావస్తున్న ఇంతవరకు అంజి రెడ్డికి పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేదు. భవన నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు పెరిగిపోయాయి అంజి రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆయన వాపోయారు. జిల్లా మొత్తం మీద ఎక్కడా లేనివిధంగా 40 లక్షలు వెచ్చించి సొంతింటి మాదిరిగా నాణ్యత ప్రమాణాలతో సచివాలయ భవానాన్ని నిర్మించినట్టు అంజిరెడ్డి తెలిపారు. సొంత పార్టీ పై అభిమానంతో తాను ఈ భవనం నిర్మించానని , నిర్మాణంలో తనకు పది లక్షల రూపాయల నష్టం వచ్చినా పట్టించుకోలేదని, అయినా ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడం బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక తాను ఎంతో ఇబ్బంది పడుతున్నాని, ఆ ఆవేదనతోనే నిరసన తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సచివాలయ సిబ్బందిని అంజిరెడ్డి బయటకు పంపి భవనానికి తాళం వేశారు.
ఇక గ్రామ సచివాలయానికి అంజిరెడ్డి తాళం వేసిన విషయాన్ని సిబ్బంది ఎంపీడీవో చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్ళారు.ఈ అంశం పై ఎంపీడీవో చంద్రశేఖర్ స్పందిస్తూ సచివాలయ భావన నిర్మాణ బిల్లు చేయాల్సింది పంచాయతీరాజ్ శాఖ అధికారులని, దీనిలో తమకి సంబంధం ఉండదని తెలిపారు.ఇదిలా ఉంటే భవన నిర్మాణంలో అంజిరెడ్డికి కేవలం 3 లక్షలు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉందని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు.