తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ గెలిచింది. గెలుపు గెలుపే. దాన్ని ఎవరూ కాదనరు. కాని ఆ మేరకు పార్టీలో ఉత్సాహం కనిపించలేదు.నాయకుల్లోనూ పెద్దగా జోష్ రాలేదు. ఉప ఎన్నికల్లో ఐదు లక్షల మెజార్టీ,ఆరు లక్షల మెజార్టీలు అని చెప్పినా..ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం గంభీరంగా మారిందనే చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది. చివరికి 2.3లక్షల మెజార్టీతో గెలుపొందడం పార్టీ లీడర్లలో చాలామందికి నిరుత్సాహం కలిగించిందట. ఇదే చర్చ పార్టీలో నడుస్తోంది.ఈ ఎన్నికల్లో 3.5లక్షల దొంగ ఓట్ల ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. అంతకు ముందే 2లక్షల దొంగ ఓటర్ కార్డుల ముద్రించారని ఆరోపించింది. ఒకే గుర్తింపు కార్డు కాకుండా ఏవేని రెండు గుర్తింపు కార్డులు ఉంటేనే పోలింగ్కి అనుమతించాలని టీడీపీ కోరింది.ఎన్నికలు జరిగిన రోజున బీజేపీ కూడా దొంగ ఓట్లపై ఆరోపణలు చేసింది.రీపోలింగ్కి డిమాండ్ చేసింది. దొంగఓట్లకు సంబంధించి వీడియోలు కూడా బయటకు రావడంతో దొంగఓట్లకు సంబంధించిన చర్చ భారీగానే నడిచింది. ఆ దొంగఓట్లు టీడీపీవి అని చెప్పేందుకు వైసీపీ ఒక సందర్భంలో ప్రయత్నించినా.. అధికారంలో ఉంది వైసీపీ కాబట్టి..దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవచ్చు కదా అనే ప్రశ్న తలెత్తింది. దీంతో వైసీపీ సైలెంట్ అయిందని చెప్పవచ్చు.ఇక బస్సుల్లో దొంగ ఓటర్ల తరలింపు, కల్యాణ మండపాల్లో దొంగ ఓటర్ల మకాం, వైసీపీకి చెందిన లీడర్ల మధ్య ఫోన్ సంభాషణల సారాంశాన్ని బట్టి..దొంగ ఓట్ల విషయంలో కచ్చితమైన అభిప్రాయానికి చాలా మంది వచ్చారు. అయితే సాంకేతికంగా చర్యలు తీసుకునే అధికారం ఉన్న ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో ఉపయోగం లేకుండా పోయింది.

గెలిచి ఓడినట్టేనా..
ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 5లక్షల మెజార్టీ ఖాయమని చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పుడు 2.3లక్షల మెజార్టీ రావడంతో షాక్ తిన్నారనే చర్చ నడుస్తోంది. పార్టీలో కీలక నాయకులకు ఏం సమాధానం చెబుతామనే చర్చకూడా మొదలైనట్లు తెలుస్తోంది.ఇంత కష్టపడి.. భారీగా ఖర్చు పెట్టినా..ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదని, గెలిచినా పెద్దగా ప్రజలను తమవైపు తిప్పుకోలేకపోయామనే చర్చ నడుస్తోందట.
వార్ వన్ సైడ్ అవుతుందని భావించినా..
అంతే కాదు..స్థానిక సంస్థల ఫలితాల తీరులోనే వార్ వన్ సైడ్ అవుతుందని భావించినా.. అది జరగకపోవడం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంతో పాటు చంద్రబాబు సభలకు వచ్చిన ప్రజాదరణ విషయంలో వైసీపీ డిఫెన్స్లో పడిందని, అప్పటికే తమకు నష్టం జరిగిందని పార్టీలో చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు కొన్ని అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తిరుపతిలో 2019లో వైసీపీ గెలిచినా..సెగ్మెంట్ల వారీగా చూస్తే తిరుపతి అసెంబ్లీ పరిధిలో టీడీపీకి 3,578 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇప్పుడు వైసీపీ 34,846 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఎక్కడైతే టీడీపీకి గతంలో ఆధిక్యం వచ్చిందో అక్కడ దొంగ ఓట్లు వేయించారని టీడీపీ ఆరోపించడానికి కారణం కూడా ఇదే. ఇందుకు మరో ఉదాహరణ కూడా చర్చకు వస్తోంది. 2019తో పోల్చితే కొన్ని చోట్ల వైసీపీకి ఆధిక్యం తగ్గింది. ఆ ఆధిక్యం తగ్గిన చోట్ల 10 నుంచి 16వేల తేడా ఉంటుండగా వైసీపీ ఆధిక్యం వచ్చిన చోట్ల 30వేలకుపైగా తేడా ఉంటోంది. అందులోనూ గతంలో టీడీపీకి ఆధిక్యం వచ్చిన చోట్ల ఆ సారి వైసీపీకి భారీగా ఆధిక్యం వచ్చింది.ఇందుకు కారణం దొంగఓట్లేనని టీడీపీ చెబుతోంది.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా..
సత్యవేడు అసెంబ్లీ పరిధిలో వైసీపీకి 2019 ఎన్నికల కంటే 4,052 ఓట్లు తక్కువగా రాగా సూళ్లూరుపేటలో 16, 276 ఓట్లు, గూడూరులోనూ 10,034 ఓట్లు తక్కువగా పోలయ్యాయి. నియోజవర్గాల వారీగా పరిశీలిస్తే వైసీపీకి తిరుపతిలో 34,846, శ్రీకాళహస్తిలో 39,464, సత్యవేడులో 38,144, వెంకటగిరిలో 42,224, సర్వేపల్లిలో 40,895, గూడూరులో 36,347, సూళ్లూరుపేటలో 39,363 ఓట్లు మెజార్టీ వచ్చింది. గూడూరు అసెంబ్లీ పరిధిలో గత ఎన్నికల్లో వైసీపీకి 46,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో 36,347 మెజార్టీ వచ్చింది. గత ఎన్నికలతో పోల్చితే 10,034 మెజార్టీ తగ్గింది.ఇక పోలింగ్ శాతం తగ్గేందుకు కూడా దొంగ ఓట్ల ప్రభావంతో పాటు కొవిడ్, వైసీపీ నేతలు భయాందోళనలకు గురిచేయడంతో ఓటర్లలో నిరాసక్తత, వలంటీర్ల పరోక్ష పర్యవేక్షణ తదితర అంశాలు కూడా కారణమని టీడీడీ చెబుతోంది. మొత్తం మీద తిరుపతిలో గెలిచామని చెబుతున్నా.. ఆ జోష్ మాత్రం పార్టీలో అంతగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.











